తిండిపోతు తనమును, అమిత భోగమును అరికట్ట యత్నించుచున్న మనము మానవ కుటుంబస్థితిగతులను పర్యాలోచించవలెను. లోకములోని ఆయా భాగములలో నివసించుచున్న వారికి దేవుడు ఏర్పాట్లు కావించెను. దేవునితో జత పనివారు కావలెనని కోరువారు ఏయాహారమును తినవలెనో దేనిని తినరాదో యిదమిత్తముగా నిర్ణయించకముందు జాగ్రత్తగా ఆలోచించవలెను. సామాన్య ప్రజానీకముతో మనకు సంబంధముండవలెను. ఆరోగ్య సంస్కరణకు వీలుండని పరిస్థితులలో నున్న ప్రజల మధ్య అమలుపర్చినచో మేలు కన్న కీడెక్కువ సంభవించును. బీదలకు నేను సువార్త ప్రకటించునపుడు శరీర పోషణకు తోడ్పడు ఆహారమును భుజింపవలెనని వారికి బోధించవలసినదిగా ఆదేశించబడితిని. “మీరు గ్రుడ్లు లేక పాలు లేక మీగడ ఉపయోగించరాదు. ఆహారమును తయారు చేయుటలో వెన్ననుపయోగించరాదు” అని నేను చెప్పజాలను. బీదలకు సువార్త ప్రకటించబడవలెను. అయితే ఆహారమును నిర్ధిష్టించుట కింకను సమయము రాలేదు. CChTel 432.3