Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయం 5— జాన్ విక్లిఫ్

    సంస్కరణ ఉద్యమానికి ముందు బహు తక్కువ బైబిలు ప్రతులు ఉండేవి. అయినా దేవుడు తన వాక్యం పూర్తిగా నాశనం కావటాన్ని అనుమతించలేదు. అందులోని సత్యాలు నిత్యమూ మరుగునపడి ఉండటం జరుగకూడదు. తన సేవకుల్ని విడిపించటానికి చెరసాల తలుపులను ఎంత సులభంగా తెరవగలడో ఇనుప గుమ్మాలను ఎంత సునాయాసంగా విరుగ గొట్ట గలడో అంతే సులువుగా జీవవాక్య శృంఖలాలను దేవుడు బద్దలు కొట్టగలడు. గుప్త ధనం కోసం అన్వేషించేటట్లు ఐరోపాఖండంలోని వివిధ దేశాల్లోని వ్యక్తులు దేవుని ఆత్మావేషం వలన సత్యం కోసం వెదకటం ఆరంభించారు. దైవానుగ్రహాన్ని బట్టి వారికి పరిశుద్ధ లేఖనాలు లభించగా వాటిని అమితాసక్తితో పఠించారు. ఏది ఏమైనప్పటికి వారు సత్యాన్ని అంగీకరించటానికి సిద్ధంగా ఉన్నారు. అంతా స్పష్టం కాకపోయినప్పటికి ఎంతో కాలంగా మరుగున పడి ఉన్న అనేక సత్యాలను గ్రహించటానికి వారికి సామర్థ్యం కలిగింది. వారు దేవుడు పంపిన దూతలుగా బయలుదేరి, తప్పులు, మూఢనమ్మకాల సంకేళను బద్దలు కొట్టి ఎంతో కాలంగా దాస్యంలో పడివున్న ప్రజలు లేచి తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవలసిందిగా వారికి పిలుపు నిచ్చారు.GCTel 61.1

    వాల్టెన్సీయుల విషయంలో తప్ప, అనేక యుగాలుగా దైవ వాక్యం విద్యావంతులకు తెలిసిన భాషలకే పరిమితమై ఉన్నది. వివిధ దేశ ప్రజలకు వారి వారి మాతృభాషలోకి లేఖనాల్ని అనువదించి అందించటానికి సమయం వచ్చింది. లోకానికి నడిరేయి గడిచింది. చీకటి గతించి వెలుగురేఖలు రూపుదిద్దుకొంటున్నాయి. అనేక దేశాల్లో తెల్లవారుతున్న సూచనలు కనిపించాయి. GCTel 61.2

    పద్నాల్లో శతాబ్దంలో ఇంగ్లాండులో “సంస్కరణ వేగుచుక్క” ఉదయించింది. జాన్ విక్లిఫ్ ఇంగ్లాండుకు మాత్రమేగాక యావత్ క్రైస్తవ లోకానికి సంస్కరణ వైతాళికుడు. రోముకు వ్యతిరేకంగా విక్లిఫ్ మొదలు పెట్టిన నుహానిరసన ఎన్నడూ మూగపోనిదిగా నిలువనుంది. ఈ నిరసన పోరాటానికి తెర లేచింది. ఫలితంగా వ్యక్తులకు, సంఘాలకు దేశాలకు స్వేచ్ఛ కలిగింది.GCTel 61.3

    విక్లిఫ్ విశాల విద్యను అభ్యసించాడు. ఆయనకు సంబంధించినంతవరకు దైవ భీతే జ్ఞానానికి మూలం. భక్తికి విశేష సామర్థ్యాలకు, ప్రతిభకు కళాశాలలో ఆయనకు వుంచి పేరు ఉన్నది. జ్ఞానార్జన పట్ల తనకున్న తృష్ణకొద్దీ ప్రతి అంశం లోను జ్ఞానం సంపాదించాలని ప్రయత్నించాడు. తత్వశాస్త్రంలోను, సంఘచట్టంలోను, పౌరచట్టంలోను ముఖ్యంగా ఇంగ్లాండుదేశ చట్టంలో విద్య నభ్యసించాడు. అనంతరం తన విద్యార్థి దశలో ఆర్జించిన విద్య తనసేవలో ఎంతో ఉపకరించింది. ఆ దినాల్లో మన్నన గల ఊహాత్మక తత్వజ్ఞానంతో పరిచయం దానిలోని లోపాల్ని ఎండగట్టటానికి ఆయనకు తోడ్పడింది. జాతీయ చటాల్ని మత సంబంధిత చట్టాల్ని అధ్యయనం చేయటం వల్ల పౌర స్వాతంత్ర్యానికి మత స్వాతంత్ర్యానికి పోరాడటానికి సామర్ధ్యం చేకూరింది. దైవ వాక్యం నుంచి సమకూర్చుకొన్న ఆయుధాలను ఉపయోగించుకొంటూ విద్యాలయాల నుంచి నూనసిక క్రమశిక్షణను సంపాదించి విద్యావేత్తల వ్యూహాలను అవగతం చేసుకొన్నాడు. తన ప్రజ్ఞాపాటవాలు, తన బహుముఖ విజ్ఞత ఆయన మిత్రులు, శత్రువుల ప్రశంసల సందుకొన్నాయి. తమ అధినాయకుడు దేశంలోని ప్రతిభావంతులలో అగ్రగణ్యుడని గుర్తించి ఆయన అనుచరగణం తృప్తి చెందారు. సంస్కరణోద్యమ నాయకుని అజ్ఞానాన్ని లేదా బలహీనతను ఎండగట్టటం ద్వారా ఉద్యమాన్ని అభాసుపాలు చేయటానికి ఆయన శత్రువుల ప్రయత్నాలు సఫలం కాలేదు.GCTel 62.1

    ఇంకా కళాశాలలో చదువుతుండగానే విక్లిఫ్ లేఖనాల్ని అధ్యయనం చేయటం మొదలు పెట్టాడు. ఆ తొలిదినాల్లో బైబిలు ప్రాచీన భాషల్లోనే ఉన్నప్పుడు సత్యమనే ఊట వద్దకు వెళ్ళటానికి విద్వాంసులకే సాద్యమయ్యేది. విద్యలేని ప్రజలకు అది అందుబాటులో లేదు. సంస్కర్తగా విక్లిఫ్ భావి కర్తవ్య నిర్వహణకు ఇలా మార్గం సరాళమయ్యింది. విద్యావంతులు దైవ వాక్యాన్ని అధ్యయనం చేసి ఆ వాక్యంలో వెల్లడ అయిన దేవుని ఉచిత కృపాసత్యాన్ని కనుగొన్నారు. తమ బోధనలలో వారు ఈ సత్యాన్ని ప్రకటించి అనేకమందిని జీవవాక్యం వద్దకు నడిపించారు.GCTel 62.2

    తన గమనాన్ని విక్లిఫ్ లేఖనాలకు తిప్పినప్పుడు విద్యాలయాల అంశాలను ఎంత క్షుణ్ణంగా పరిశీలించాడో అంత క్షుణ్ణంగా లేఖనాల్ని పరిశీలించాడు. ఇంతవరకు జ్ఞానానికి సంబంధించిన అధ్యయనాలుగాని, సంఘ సంబంధిత బోధనలుగాని తీర్చలేని గొప్ప లోటును గుర్తించాడు. ఇంతకుముందు తాను వ్యర్ధంగా వెదకినదాన్ని దేవుని వాక్యంలో కనుగొన్నాడు. ఇక్కడ రక్షణ ప్రణాళిక తేటతెల్లమయ్యింది. మానవుడి ఏకైక ఉత్తరవాది క్రీస్తే అని గ్రహించాడు. క్రీస్తు సేవకు తన్నుతాను సమర్పించుకొని తాను కనుగొన్న సత్యాలను ప్రకటించటానికి తీర్మానించు కొన్నాడు.GCTel 62.3

    అనంతర సంస్కర్తలమల్లే విక్లిఫ్ తన ఆరంభ సేవలో సంస్కరణోద్యమం తనను ఎక్కడకు నడుపుతుందో అన్నది గ్రహించలేక పోయాడు. రోము అధికారాన్ని కావాలని వ్యతిరేకించలేదు. అయితే సత్యం పట్ల తనకున్న ఆసక్తివల్ల భ్రష్ట బోధలతో సంఘర్షణ పడాల్సి వచ్చింది.పోపుల బోధల్లోని దోషాలను ఎంత స్పష్టంగా గుర్తించగలిగితే అంత బలంగా బైబిలు బోధనల్ని ఉపదేశించాడు. రోము నాయకులు దైవ వాక్యాన్ని తోసిరాజని మానవ సంప్రదాయాన్ని అంగీకరించటం ఆయన గుర్తించాడు. పోపు మత గురువులు లేఖనాలను విసర్జించారంటూ నిర్భయంగా తప్పుపట్టి బైబిలును మళ్లీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని, సంఘంలో బైబిలు అధికారాన్ని పునరుద్ధరించాలని డిమాండు చేశాడు. విక్లిఫ్ ప్రతిభ నిజాయితీగల అధ్యాపకుడు, అనర్గళంగా మాట్లాడగలిగిన వక్త. తాను బోధించిన సత్యాలకు ఆయన దైనందిన జీవితం ఒక సాదృశ్యం. తన లేఖన పరిజ్ఞానం, బలీయమైన తన ఆలోచనా సరళి, తన పరిశుద్ధ జీవితం, తిరుగులేని తన మనోధైర్యం, న్యాయవర్తన ప్రజల ఆదరాభిమానాలను సంపాదించి పెట్టాయి. రోమను సంఘంలోని అన్యాయాల్ని అధర్మాన్ని చూసి పలువురు తమ విశ్వాసం విషయంలో తీవ్ర అసంతృప్తి చెంది, విక్లిఫ్ బోధిస్తున్న సత్యాలను ఆనందోత్సాహాలతో అంగీకరించారు. అయితే తమకన్నా ఎక్కువ మన్నన ఈ సంస్కర్త పొందుతున్నట్లు పోపునేతలు గుర్తించి ఆగ్రహావేషాలతో చిందులు తొక్కారు.GCTel 63.1

    విక్లిఫ్ నిశితంగా పరిశీలించి దోషాలు పసిగట్టగల వ్యక్తి. రోము నాయకుల సమ్మతితో ఆచరణలో ఉన్న అనేక దురాచారాల్ని ఆయన నిర్భయంగా వ్యతిరేకించాడు. రాజు గుడిలో బోధకుడుగా వ్యవహరించిన తరుణంలో బ్రిటిషు రాజు తనకు కప్పం చెల్లించాలని పోపు కోరినప్పుడు లౌకిక పరిపాలకులపై అధికారం చెలాయించటం హేతువాదానికి దైవ వాక్యానికి రెండింటికీ విరుద్ధమని విక్లిఫ్ ధైర్యంగా వాదించాడు. పోపు చేస్తున్న డిమాండులు తీవ్ర ఆగ్రహం రేకెత్తించాయి. విక్లిఫ్ బోధనలు దేశంలోని అనేకమంది ప్రముఖుల మనసుల్ని ఆకట్టుకొన్నాయి. తనకు లౌకిక సంబంధమైన అధికారమున్నదన్న పోపు వాదనను తోసిపుచ్చటంలోను కప్పం చెల్లింపును నిరాకరించటంలోను రాజు సామంతులు ఐక్యంగా నిలబడ్డారు. ఇంగ్లాండులో పోపుల అధికారానికి ఇలా ఎదురుదెబ్బ తగిలింది.GCTel 63.2

    ఈ సంస్కర్త ఇంకో దురాచార నిర్మూలనకు పోరాడాడు. అదే భిక్షాటనమెత్తే సన్యాసుల వ్యవస్థ. ఈ సన్యాసులతో ఇంగ్లాండు నిండిపోయి దేశ ఔన్నత్యానికి ప్రగతికి విఘాతం ఏర్పడింది. పరిశ్రమలు, విద్య, నైతిక ప్రమాణాలు ఈ దుష్ప్రభావానికి గురై క్షీణించాయి. సోమరి బిచ్చగాడు అయిన సన్యాసి జీవితం ప్రజల వనరుల్ని హరించటమే గాక ప్రయోజనకరమైన శారీరక శ్రమను ద్వేషానికి గురిచేసింది. యువజనులు నిరుత్సాహం చెంది చెడుమార్గాన్ని అవలంబించారు. సన్యాసుల ప్రభావం వల్ల అనేకులు సన్యాసం స్వీకరించి ఆశ్రమ జీవితాలకు అంకితమవడానికి తీర్మానించు కొంటున్నారు. తల్లిదండ్రుల సమ్మతిలేకుండా వారికి తెలియకుండా వారు వద్దన్నా వినిపించుకోకుండా ఇలా వ్యవహరించే వారు. తొలిదినాల రోము సంఘ ఫాదర్లలో ఒకడు ఆశ్రమ జీవితం తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రేమ బాధ్యతలకన్న సమున్నతమైనదంటూ ఇలా ప్రబోధించాడు, “మీ నాన్న ఏడుస్తూ ప్రళాపిస్తూ తలుపువద్ద నిలిచి ఉన్నప్పటికీ, మీ యమ్మ మిమ్మల్ని నవమాసాలు మోసిన తన దేహాన్ని చూపించినప్పటికీ, మీకు స్తన్యమిచ్చిన తన పాలిండ్లను చూసినప్పటికీ వారిని కాళ్ళతో తొక్కుతూ ముందుకి సాగి నేరుగా యేసు వద్దకు వెళ్ళండి” అనంతరం లూథర్ దీన్ని “క్రూరంగా అమానుష క్రియ” గా వర్ణించాడు. “ఇది క్రైస్తవుణ్ణి మానవుడిగా చూపించటంకన్నా తోడేలుగాను నియంతగాను చూపిస్తున్నది. ” “పిల్లల హృదయాలు తలిదండ్రులకు వ్యతిరేకంగా బండరాళ్లుగా మారాయి. ” - బాన్స్ సీయర్, ది లైఫ్ ఆఫ్ లూథర్, పుటలు 69,70. ఆనాడు పరిసయ్యుల మల్లే పోపు నేతలు తమ సంప్రదాయాలతో దేవుని ఆజ్ఞను ఇలా నిరర్ధకం చేశారు. ఇలా గృహాలు నిర్మానుష మయ్యాయి. కుమారులు, కుమార్తెలు తలిదండ్రుల్ని వదలి వెళ్ళిపోయారు.GCTel 64.1

    సన్యాసుల అబద్ధ ప్రచారంవల్ల విశ్వ విద్యాలయాల్లోని విద్యార్థులు సయితం మోసపోయి సన్యాసుల జాబితాలో చేరటానికి ఆకర్షితులయ్యారు. దరిమిల అనేకమంది తమ భవిష్యత్తు పాడుకావటం, తద్వారా తమ తల్లిదండ్రులకు దుఖం కలగటం చూసి తాము దుందుడుకుగా వ్యవహరించినందుకు బహుగా విచారించారు. కాగా ఒకసారి ఉచ్చులో చిక్కుకున్న వారు స్వేచ్ఛ సాధిచటం అసంభవం. సన్యాసుల దుష్ప్రభావానికి భయపడ్డ తల్లిదండ్రులనేకులు తమ కుమారుల్ని విశ్వవిద్యాలయాలకు పంపటానికి నిరాకరించారు. పేరు మోసిన విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పడిపోయింది. విద్యాసంస్థలు క్షీణించాయి. అజ్ఞానం పెచ్చరిల్లిపోయింది.GCTel 64.2

    పాపపు ఒప్పుకోళ్లను విని క్షమాపణ ఇచ్చే అధికారాన్ని పోపు ఈ సన్యాసులకు ఇచ్చాడు. ఇది గొప్ప దురాచారానికి మూలమయ్యింది. అధిక లాభాలు ఆర్జించాలన్న యావతో మతగురువులు క్షమాపణ నివ్వటానికి ఆతృత చూపటంతో వివిధ రకాల నేరగాళ్లు క్షమాపణలు పొందటం తద్వారా అతిభయంకర నేరాలు పెచ్చు పెరగటం జరిగింది. వ్యాధి బాధితులు, పేదలు తమ బాధల్లో వుండగా వారి కష్టాలు బాధలు నివారించేందుకు తోడ్పడాల్సిన నిధులు సన్యాసుల జేబులు నింపాయి. సన్యాసులు ప్రజల్ని బెదరించి తమకు దానధర్మాలు చేయకపోవటం, భక్తిలేమిని సూచిస్తుందంటూ నింధించి డబ్బు గుంజేవారు. పేదలమని చెప్పుకొంటున్నప్పటికీ మతగురువుల ఆస్తులు నిత్యమూ పెరుగుతూనే ఉన్నాయి. వారి వైభవోపేత భవనాలు, విలాసవంతమైన భోజనం బల్లలు దేశంలో పెచ్చరిల్లుతున్న పేదరికానికి కారణాలు తమ సమయాన్ని వినోదాలలోను విలాసాల్లోను గడుపుతూ, వారు తమకు బదులుగా ఇంగితం తెలియని వారిని బయటికి పంపేవారు. ప్రజలను ఉత్సాహపర్చడానికి వారు కట్టు కథలు, ఇతిహాసాలు, చెణుకులు చెప్పి వినోదం కలిగించి వారిని మోసాలకు మరెక్కువగా లోనుచేసేవారు. అయినా సన్యాసులు మూఢనమ్మకాలుగల ప్రజానీకాన్ని తమ వశంలో ఉంచుకొని, తాము పోపు సర్వాధికారాన్ని అంగీకరించటం, పరిశుదుల్ని పూజించటం, సన్యాసులకు కానుక లివ్వటం తమ మతపరమైన విధి అని తమకు పరలోకంలో స్థానాన్ని సంపాదించటానికి ఇది సరిపోతుందని వారిని నమ్మించేవారు. ఈ అక్రమ వ్యవస్థలో దిద్దుబాటు తేవటానికి విద్యావంతులు, దైవభక్తులు ఎంతో కృషిచేసి విఫలులయ్యారు. కాగా విక్లిఫ్ స్పష్టమైన దృష్టితో ఇది తప్పుడు వ్యవస్థ అని అందుచేత దీన్ని రద్దుచేయటం అవసరమని బోధిస్తూ ఈ తప్పుడు వ్యవస్థను ఖండించాడు. చర్చ, విచారణ నిద్రలేస్తున్నాయి. పోపు ఇచ్చే పాప పరిహార పత్రాల్ని, విక్రయిస్తూ సన్యాసులు దేశంలో తిరుగుతున్న తరుణంలో పాపక్షమాపణను ద్రవ్యంతో కొనుగోలు చేయటం అసాధ్యమని భావించి రోము మతాధినేత వద్దనుంచి పాపపరిహారం కొనటం కన్నా దేవుని వద్దనుంచే నేరుగా దాన్ని పొందటం మంచిదని అనేకులు తమలోతాము అనుకొన్నారు. దురాశాపరులైన సన్యాసులను చూసి ఎంతోమంది అందోళన చెందారు. వారి దురాశకు హద్దులు లేవు. “రోము సన్యాసులు మతగురువులు కేన్సర్ వ్యాధిలా మమ్మల్ని తినేస్తున్నారు.” అని ప్రజలు వాపోయారు. డి. అబినే, పుస్త.17, అధ్యా. 7. తమ అత్యాశను కప్పి పుచ్చుకునేందుకు తాము ప్రభువు ఆదర్శాన్ని అనుసరిస్తున్నామని, యేసు ఆయన శిష్యులు ప్రజల దాతృత్వం ద్వారానే పోషణ పొందారని బిచ్చగాళ్ళయిన ఈ సన్యాసులు దబాయించేవారు. ఈ హక్కు వారి పనికి ఎంతో హాని చేసింది. అనేకమంది బైబిలు చదివి తమంతటతాము సత్యాన్ని తెలుసుకోటానికి ఇది హేతువయ్యింది. ఈ పరిణామం రోము నేతలు కోరుకొన్నది కానే కాదు. మనుషుల మనసులు సత్యానికి నిలయమైన దేవునికి ఆకర్షితమయ్యాయి. రోము అధినాయకులు మాత్రం సత్యాన్ని మరుగున ఉంచాలని ఆపసోపాలు పడ్డారు.GCTel 65.1

    సన్యాసులను ఎండగడుతూ విక్లిఫ్ పత్రికలు రాసి ప్రచురించటం మొదలుపెట్టాడు. వారితో వాదోపవాదాలకు దిగటానికి కాక పరిశుద్ధ గ్రంధంపైన, ఆ గ్రంథకర్తపైన ప్రజల దృష్టి నిలపటానికి ఆయన శ్రమించాడు. క్షమించటానికి, వెలివేయటానికి సామాన్య మతాచార్యుల కెంత అధికారమున్నదో అంతకన్నా ఎక్కువ అధికారం పోపుకులేదని ఒక వ్యక్తి ముందు దైవ ఖండనను తనపైకితాను తెచ్చుకొంటే తప్ప ఆ వ్యక్తిని వాస్తవంగా వెలివేయటం సాధ్యం కాదని విక్లిఫ్ ప్రకటించాడు. పోపు బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక లౌకిక నిర్మాణాన్ని నిర్మించుకొన్నాడు. దానిలో లక్షలాదిమంది శరీరాత్మలు మగ్గుతున్నాయి. ఆ మహా నిర్మాణాన్ని పడగొట్టటానికి జయప్రదమైన మార్గం ఇంకొకటి ఆయనకు కనిపించలేదు.GCTel 66.1

    రోము ఆక్రమణదారులనుంచి ఆంగ్ల రాజుల హక్కుల్ని కాపాడేందుకు విక్లిఫ్ కి మరోసారి పిలుపు వచ్చింది. రాజు రాయబారిగా నియమాకం తర్వాత నెదర్లాండ్స్ లో పోపు అధికారులతో సమావేశాలు జరుపుతూ ఆయన రెండేళ్ళు గడిపాడు. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాల మతాధికారులతో ఇక్కడ విక్లిఫ్ చర్చలు జరిపాడు. ఇంగ్లాండులోనే ఉండివుంటే తనకు తెలిసివుండని ఎన్నో అంశాల్ని తెరవెనుక నుంచి తెలుసుకోటానికి ఇక్కడ అవకాశం కలిగింది. తర్వాత తన సేవలో ఉపకరించే విషయాలెన్నో ఇక్కడ నేర్చుకొన్నాడు. పోపు తరపున హాజరైన ఈ రాయబారులలో పోపు వ్వవస్థ నిజస్వరూపాన్ని, ధ్యేయాన్ని చదవగలిగాడు. ఇంగ్లాండుకు తిరిగివచ్చి లోగడ తన బోధనల్ని మరింత బహిరంగంగా, మరింత ఉద్రేకంగా ప్రకటించాడు. దురాశ, అహంభావం, మోసం ఇవే రోము దేవుళ్లని చాటి చెప్పాడు.GCTel 66.2

    పోపును గురించి అతడి సుంకరుల గురించి ప్రస్తావిస్తూ ఒక పత్రికలో ఆయన ఇలా అన్నాడు, “మన దేశంలోని బీదల జీవనోపాదిలో నుంచి ఏటేటా వేలాది మార్కులను రాజ నిధుల్లోనుంచి పరిశుద్దాచారాలు, ఆధ్యాత్మిక కార్యాల కోసం అనగా శాపగ్రస్తమైన లంచం కోసం, ద్రవ్యం తీసుకొని ఆ దురాచారాన్ని కొనసాగించటానికి వారు యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని సమ్మతింప జేస్తున్నారు. మన దేశంలో పెద్ద బంగారుకొండ ఉన్నప్పటికీ గర్వి అయిన ఈ మతాధికారి సుంకరి మినహా ఎవరూ ఎన్నడూ కొల్లగొట్టని ఆ కొండ కొంత కాలానికి మాయమవుతుంది. ఎందుకంటే అతడు మన దేశంలో నుంచి ఎప్పుడూ డబ్బు పట్టుకుపోతున్నాడు. అతడు తీసుకుపోయే డబ్బుకు బదులు మన కిచ్చేది దేవుని శాపం తప్పమరేమీ కాదు”.- జాన్ లూయీస్, హిస్టరీ ఆఫ్ ది లైఫ్ అండ్ సఫరింగ్స్ ఆఫ్ జె. విక్లిఫ్, పుట 37.GCTel 66.3

    ఇంగ్లాండుకు తిరిగి వచ్చిన వెంటనే లటర్ వర్త్ అధ్యక్షుడు (డైరెక్టర్)గా విక్లిన్ను రాజు నియమించాడు. విక్లిఫ్ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం రాజుకు అసంతృప్తి కలిగించలేదన్నది ఇది స్పష్టం చేస్తున్నది. న్యాయస్థానం తీర్పుల్ని, దేశ ప్రజల విశ్వాసాన్ని విక్లిఫ్ జీవితం ప్రభావితం చేసింది.GCTel 67.1

    పోపుల ఉరుములు విక్లిఫ్ పై కేంద్రీకృత మవటానికి ఆట్టే సమయం పట్టలేదు. ఇంగ్లాండుకి మూడు బుల్ ప్రకటనలు జారీ అయ్యాయి- విశ్వ విద్యాలయానికి, రాజుకు, ప్రిలేట్లకు, సిద్ధాంత వ్యతిరేక బోధనను వెంటనే ఆపటానికి తక్షణం నిర్ణయాత్మక చర్య చేపట్టాలని ఆ మూడు బుల్ ప్రకటనల ఆదేశం. అగస్టన్ నియాండర్ జెనరల్ హిస్టరీ ఆఫ్ ది క్రిస్టియన్ ది విజరీన్ అండ్ చర్చ్ పీరియడ్ 6, సెక్ష 2, పిటి 1, పేరా 8. బుల్ ప్రకటనలు రాకముందు తీర్పుకోసం తమ ముందు నిలువవలసిందిగా బిషప్పులు ఉత్సాహంతో ఉప్పొంగుతూ విక్లిఫ్ కి ఆదేశాలు పంపారు. అయితే విఫ్ వెంట ప్రాబల్యం గల ఇద్దరు సామంతరాజులు న్యాయస్థానానికి వెళ్లారు. భవనం చుట్టూ ప్రజలు చేరటం, విక్లిఫ్ ని లోపలికి తీసుకువెళ్లటం న్యాయాధి పతుల్లో బెదురు పుట్టించింది. కోర్టు కార్యకలాపాలు కొంతసేపు నిలిచిపోయాయి. విక్లిఫ్ తిరిగి వెళ్లిపోవటానికి అనుమతి లభించింది. కొంతకాలం తర్వాత 3వ ఎడ్వర్డు రాజు మరణించాడు. తన అవసానకాలంలో సంస్కర్తకు వ్యతిరేకంగా వ్యవహరించటానికి ప్రిలేటులు ఎడ్వర్డుని ప్రభావితం చేయజూశారు. ఎడ్వర్డు మరణానంతరం విక్లిఫ్ పూర్వ సంరక్షకుడు ఇంగ్లాండుకు రీజెంట్ (రాజ్య ప్రతినిధి) అయ్యాడు.GCTel 67.2

    కాగా పోపుల బుల్ ప్రకటన మేరకు సిద్ధాంత వ్యతిరేకి విక్లిఫ్ ని నిర్బంధించి జైలులో వేయటానికి ఇంగ్లాండు అంతటిలోను ఆదేశం జారీ అయ్యింది. ఆ నేరానికి శిక్ష ప్రత్యక్ష సజీవ దహనం. రోము నేతల కక్షకు విక్లిఫ్ త్వరలోనే ఆహుతి కావటం తథ్యమనిపించింది. అయితే “భయపడకుము నేను నీకు కేడెము” ఆదికాండము 15:1, అని ఒక పూర్వీకుడితో పలికిన ఆ ప్రభువు తన సేవకుణ్ణి కాపాడటానికి మళ్లీ తన చేయి చాపాడు. మరణం వచ్చింది సంస్కర్తకు కాదు. ఆయన మరణాన్ని శాసించిన పోపుకి. 9వ గ్రెగరీ మరణించాడు. విక్లిఫ్ విచారణ నిమిత్తం సమావేశమైన మత గురువులు తిరిగి వెళ్ళి పోయారు.GCTel 67.3

    సంస్కరణోద్యమం బలం పుంజుకొనేందుకు అవకాశం కల్పించటానికిగాను దేవుని చిత్రాన్ని అనుసరించి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. గ్రెగరీ మరణానంతరం విరోధి వర్గాలకు చెందిన ఇద్దరు పోపులు ఎంపికయ్యారు. కళంకరహితులమని చెప్పుకొంటున్న రెండు ప్రత్యర్ధి అధికారాలు ఇప్పుడు ప్రజలు తమకు విధేయులు కావాలని ఆదేశిస్తున్నాయి. ఇరువురూ ఒకరితో ఒకరు జరుపుతున్న పోరుతో తమ తమ విశ్వాసులు తమ విరోధుల్ని శసించటం ద్వారా తమకు మద్దతు పలకాలని తమకు పరలోకంలో ప్రతిఫల వాగ్దానం ఉన్నదని తమ మద్దతు దారుల్ని ఉత్సాహపర్చారు. ఈ ఘటన పోపు అధికారాన్ని బలహీనపర్చింది. ఈ ప్రత్యర్థి వర్గాలు రెండూ ఒకరిపై ఒకరు దాడిచేసుకోటం ప్రారంభించాయి. ఇలా విక్కి కొంత విశ్రాంతి దొరికింది. ప్రత్యర్థి పోపు లిద్దరూ ఒకరి నొకరు శపించుకోటం నిందించుకోటం ఎక్కువయ్యింది. విరుద్ధమైన వారి భావాలకు మద్దతు పలకటానికి ఎందరో రక్తం చిందించాల్సి వచ్చింది. నేరాలు, అపవాదులు సంఘంలో వెల్లువెత్తాయి. సంస్కర్త విక్లిఫ్ అయితే లటర్వీర్ లోని తన ప్రశాంత రిష్ లో విశ్రాంతి తీసుకొంటూ సంఘర్షణ పడుతున్న పోపులను విడిచి సమాధానకర్త అయిన యేసువద్దకు ప్రజలను నడిపించటానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. GCTel 68.1

    ఈ భేధం, దానివల్ల ఏర్పడ్డ వైరుధ్యం అవినీతి పోపుల నిజ స్వరూపాల్ని బయటపెట్టి సంస్కరణోద్యమానికి మార్గం సుగమం చేశాయి. పోపుల విభేదాలు (ఆన్ షిజమ్ ఆఫ్ ది పోప్స్ అన్న అంశంపై ఒక పత్రిక ప్రచురించి ఈ మతగురువులిద్దరూ ఒకరినొకరు అబద్ద క్రీస్తు అని విమర్శించుకోటంలో సత్యాన్నే పలుకుతున్న విషయం గమనించండంటూ, ఆ పత్రికలో విక్లిఫ్ ప్రజలను హెచ్చరించాడు. “ఒక గురువుకు పట్టిన దయ్యాన్నే దేవుడు ఇక సహించడు. దాన్ని ఇద్దరు గురువులకు పంచాడు. క్రీస్తు నామంలో మనుషులు వారిద్దరినీ సులభంగా జయించగలిగేందుకే ఆ పని చేశాడు” అన్నాడు విక్లిఫ్ - ఆర్. వాగన్, లైఫ్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ జాన్ డి విక్లిప్ సం 2, పుట 6.GCTel 68.2

    తన ప్రభువువల్లే, విక్లిఫ్ సువార్తను బీదలకు ప్రకటించాడు. తన పేరిష్ లబర్ వర్త్ లో ఉన్న ప్రజలకు సత్యం ప్రకటించటంతోనే తృప్తి చెందక ఇంగ్లాండులో ప్రతీచోటా సత్యాన్ని ప్రకటించాలని తీర్మానించుకొన్నాడు. ఇందుకుగాను సత్యాన్ని ప్రేమించి దాన్ని ప్రచురించాలన్న ఆకాంక్షగల సాధారణ బోధకుల సమాజాన్ని ఏర్పాటు చేశాడు. వీరు సంత వీధుల్లోను, పట్టణాల్లోను, గ్రామాల్లోను సువార్త ప్రకటిస్తూ సంచరించారు. వారు వృద్ధులను, వ్యాధిగ్రస్తులను, బీదవారిని వెదకి వారికి దైవకృపా వర్తమానాన్ని అందించారు.GCTel 69.1

    ఆక్సుఫర్డ్ లో వేదాంత శాస్త్ర ఆచార్యుడుగా విశ్వ విద్యాలయ గదుల్లో విక్లిఫ్ దైవ వాక్యాన్ని బోధించాడు. తన విద్యార్ధులకు మనసా వాచా కర్మణా ప్రకటించటంచేత ఆయనకు సువార్త డాక్టర్” అన్న పేరు వచ్చింది. పోతే తన జీవితంలో ఆయన చేసిన మహోపకారం లేఖనాల్ని ఇంగ్లీషు భాషలోకి అనువదించటం.GCTel 69.2

    “లేఖనాల్ని గూర్చిన సత్యం వాటి భావం” (ఆన్ ది ట్రూత్ అండ్ మీనింగ్ ఆఫ్ స్కిప్పర్స్) అన్న పుస్తకంలో ఇంగ్లాండులోని ప్రతీ వ్యక్తి దేవుని అద్భుత కార్యాల్ని తన మాతృభాషలో చదువుకొనేందుకుగాను బైబిలును అనువదించాలన్న కోరికను వ్యక్తం చేశాడు విక్లిఫ్.GCTel 69.3

    కాని అర్ధాంతరంగా ఆయన కృషికి తెరపడింది. ఇంకా అరవై ఏళ్లు నిండకముందే విశ్రాంతి ఎరుగని శ్రమ, అధ్యయనం, ప్రత్యర్థుల దౌర్జన్యం ఆయన శక్తిని హరించి అకాలంగా ముసలివాణ్ణి చేశాయి. ఆయన ప్రమాదకరమైన వ్యాధికి గురి అయ్యాడు. సన్యాసులకు ఈ వార్త అమితానందం కలిగించింది. తాను సంఘానికి చేసిన కీడు నిమిత్తం తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చుతాడని భావించి తన ఒప్పుకోలును వినటానికి సన్యాసులు ఆయన నివాసానికి ఆగమేఘాల మీద వెళ్లారు. మరణిస్తున్నట్లు వారు భావించిన విక్లిఫ్ చుట్టూ నలుగురు పౌర అధికారులతో నాలుగు మత శాఖల నుంచి నలుగురు ప్రతినిధులు చేరారు. “మీరిప్పుడు మరణశయ్యమీద ఉన్నారు. మీరు చేసిన అపరాధాల నిమిత్తం పశ్చాత్తాపడి మాకు కీడు తలపెట్టి పలికిన మాటల్ని మా సమక్షంలో ఉప సంహరించుకోండి” అన్నారు. సంస్కర్త నిశబ్దంగా విన్నాడు. తనను పైకి లేపుమని తన సహాయకుడితో చెప్పాడు. తన అపరాధాన్ని ఒప్పుకొంటాడని ఎదురుచూస్తున్న వారివంక నిదానంగా చూస్తూ వారికి తరచుగా కంపం పుట్టించే గంభీరస్వరంతో ‘నేను మరణించను, జీవిస్తాను, సన్యాసుల దుష్క్రియల్ని మళ్లీ వెల్లడి చేస్తాను” అన్నాడు- డి ఆ బ్నీ, పుస్త 17, ఆధ్యా. 7. ఆశ్చర్యంతోను ఒకింత లజ్జతోను సన్యాసులు అక్కడనుంచి నిష్క్రమించారు. విక్లిఫ్ అన్న మాటలు నెరవేరాయి.GCTel 69.4

    రోముతో పోరాడేందుకు తన దేశ ప్రజల చేతుల్లో మిక్కిలి శక్తిమంతమైన ఆయుధాన్ని ఉంచటానికి క్లిఫ్ జీవించే ఉన్నాడు. అది ప్రజలకు స్వేచ్ఛను, చైతన్యాన్ని సువార్త ఇచ్చే బైబిలు అనే ఆయుధం. ఈ కార్యసాధనలో అధిగమించాల్సిన ఆటంకాలెన్నో ఉన్నాయి. విక్లిను శరీర బలహీనతలు కుంగ దీస్తున్నాయి. తాను చేయాల్సిన సేవకు కొన్ని సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉన్నదని ఆయనకు తెలుసు. తాను ఎదుర్కోవలసిన వ్యతిరేకతను స్పష్టంగా చూడగలిగాడు. దేవుని వాక్యంలోని వాగ్దానాల నుంచి ఉద్రేకం పొందుతూ ఆయన నిర్భయంగా ముందుకు సాగాడు. ప్రత్యేకమైన దైవకృప విక్లిఫ్ ను సంపూర్ణ మానసిక సామర్థ్యాలతో విలువైన అనుభవంతో కాపాడి తన సేవలన్నింటిలోను అతిశ్రేష్టమైన సేవకు ఆయనను సిద్ధపర్చింది. క్రైస్తవ లోకమంతా గందరగోళంతో నిండి ఉండగా ఈ సంస్కర్త బయట రేగుతున్న తుఫానులను లెక్కచేయకుండా లటవర్ లోని తన నివాసంలో తాను ఎంపిక చేసుకొన్న కార్యాన్ని సాధించటానికి ఉపక్రమించాడు.GCTel 70.1

    చివరికి పని పూర్తి అయ్యింది. ఇంగ్లీషు భాషలో వెలువడ్డ ప్రప్రధమ బైబిలు అనువాదమది. ఇంగ్లాండు ప్రజలకు దైవ వాక్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్కరణ వాదికి చెరసాలన్నా, సజీవదహన శిక్ష అన్నా ఇక భయంలేదు. ఇంగ్లీషు ప్రజల చేతుల్లో ఎన్నడూ ఆరని దీపం పెట్టాడు. యుద్ధ రంగంలో తన దేశం సాధించిన ఘన విజయాలకన్నా మాతృదేశ ప్రజలకు బైబిలుని ఇవ్వటంతో ప్రజల అజ్ఞానం దుర్నీతి సంకెళ్లను బద్దలు కొట్టటం ద్వారా ఆయన తన ప్రజలకు స్వేచ్ఛనిచ్చి, ఉన్నతస్థాయి కల్పించి మరెక్కువ విజయాన్ని సాధించాడు.GCTel 70.2

    అచ్చువేసే కళ ఇంకా ఉనికిలోకి రాలేదు. నెమ్మదిగా ఎంతో కాలం శ్రమించి బైబిలు ప్రతులు రాయట మొక్కటే ప్రచార సాధనం. బైబిలును సొంతం చేసుకోవాలన్న ఆసక్తి ఇబ్బడి ముబ్బడిగా పెరగటం వల్ల చేతితో రాసి ప్రతులు తీయటానికి ఎంతోమంది ముందుకు వచ్చారు. కాకపోతే పెరుగుతున్న గిరాకీకి దీటుగా సరఫరా చేయలేక పోయారు. డబ్బుగల కొందరు కొనుగోలు దారులు సంపూర్ణ బైబిలు కావాలని కోరారు. తక్కిన వాళ్ళు ఖండికలు మాత్రమే కొనుక్కొనేవారు. అనేక సందర్భాలలో కొన్ని కుటుంబాలు కలసి ఒక ప్రతిని కొనుక్కొనే వారు. విక్లిఫ్ బైబిలు ఈ విధంగా ప్రజల గృహాల్లోకి ప్రవేశించింది.GCTel 70.3

    అది మనుషులను ఆలోచింపజేసింది. పోపుల అంధవిశ్వాసాలకు సాత్వికంగా లొంగిపోకుండా వారిని వెన్ను తట్టి మేలుకొలిపింది. విక్లిఫ్ ఇప్పుడు క్రీస్తుపై విశ్వాసం ద్వారా రక్షణ, లేఖనాల నిర్దుష్ఠత వంటి విస్పష్ట ప్రొటస్టాంటు సిద్ధాంతాలను బోధించాడు. ఆయన పంపిన బోధకులు బైబిలును వారితోపాటు సంస్కరణ వాద స్వీయ రచనలను విస్తృతంగా పంచిపెట్టారు. ఫలితంగా ఆ నూతన విశ్వాసాన్ని ఇంగ్లాండు దేశంలో దాదాపు సగం మంది అంగీకరించారు.GCTel 71.1

    లేఖనాలు అందుబాటులోకి రావటం సంఘాధికారులకు ఎంతో నిరుత్సాహం కలిగించింది. ఇప్పుడు వాళ్లు విక్లిఫ్ కన్న బలీయమైన సాధనాన్ని ఎదుర్కోవాలి. వాళ్లవద్ద ఉన్న ఆయుధాలేవీ దాన్ని ప్రతిఘటించటంలో జయం పొందలేవు. ఈ సమయంలో ఇంగ్లాండులో బైబిలును నిషేధిస్తున్న చట్ట మేదీలేదు. ఎందుకంటే సామాన్య ప్రజలు మాట్లాడే భాషలో బైబిలు ఎన్నడూ ప్రచురితం కాలేదు. అలాంటి చట్టాలు అనంతరం రావటం అవి కఠినంగా అమలు కావటం జరిగింది. కాగా బైబిలు విస్తరణను అడ్డుకోటానికి మతగురువులు ఎంత ప్రయత్నించినప్పటికీ కొంతకాలం వరకు దైన వాక్యం వ్యాప్తి చెందటానికి అవకాశం ఏర్పడింది.GCTel 71.2

    సంస్కరణ వాది గొంతు నొక్కటానికి పోపు నేతలు మళ్లీ కుతంత్రాలు పన్నారు. ఆయనను వెంటవెంటనే మూడు కోర్టుల ముందు విచారణకు నిలబెట్టారు. కాని ఫలితం లేకపోయింది. మొదట బిషప్పుల సినాడ్ ఆయన రచనలు సిద్ధాంత వ్యతిరేకాలని ప్రకటించింది. రెండో రిచర్డ్ రాజు మద్దతు సంపాదించి నిషిద్ధ సిద్ధాంతాలను నమ్మేవారి నందరినీ చెరసాలలో బంధించాలని ఆయన చేత చట్టం చేయించారు. సినాడ్ తీర్మానాన్ని విక్లిఫ్ పార్లమెంటుకి అప్పీలు చేసుకొన్నాడు.GCTel 71.3

    జాతీయ సభముందు అధికార శ్రేణిపై నిర్భయంగా నేరాన్ని, మోపి సంఘం ఆమోదముద్ర పొందిన దురాచారాలను సంస్కరించాలని డిమాండు చేశాడు. పోపుల అధికార దురాక్రమణను, పోపు పడవిలో చోటుచేసుకున్న అవినీతిని దుష్కృత్యాలను గొప్ప ప్రతిభతో వివరించాడు. ఆయన ప్రత్యర్ధులు గందరగోళంలో పడ్డారు. విక్లిఫ్ మిత్రులు మద్దతుదారులు ఒత్తిడికిలోనై వారు చెప్పింది అంగీకరించారు. వృద్ధుడు ఏకాకి, నిస్సహాయుడు అయిన సంస్కరణవాది, ఏకమైన రాజు పోపు అధికారానికి తల ఒగ్గుతాడన్న ఆశాభావం వారి మనస్సుల్లో ఉంది. అయితే తమకు పరాజయం తప్పదని పోపు మతవాదులకు అర్ధమయ్యింది. విక్లిఫ్ చిత్తశుద్ధితో చేసిన విజ్ఞాపనలకు స్పందిస్తూ ఆయనకు శిక్ష విధిస్తూ జారీ అయిన చట్టాన్ని పార్లమెంటు రద్దుచేసింది. సంస్కరణ వాదికి మళ్లీ స్వేచ్ఛ లభించింది.GCTel 71.4

    మూడోసారి ఆయనను తీర్పుకు నిలబెట్టారు. ఈ సారి దేశంలోని అత్యున్నత మత విషయక న్యాయపీఠం ముందు. ఇక్కడ సిద్ధాంత వ్యతిరేకికి దయచూపించటం జరుగదు. చివరికి ఇక్కడ రోము వాదులు విజయ కేతనం ఎగురవేస్తారు. సంస్కరణ వాది కృషి అంతమౌతుంది. పోపు మతవాదుల ఆలోచనా ధోరణి ఇలా వుంది. వారు ఈ ఉద్దేశాన్ని నెరవేర్చగలిగితే విక్లిఫ్ తమ సిద్ధాంతాలు అసత్యాలని ఒప్పుకోవటమో లేదా మంటల్లో కాలి మరణించటానికి కోర్టు విడిచి వెళ్లటమో జరుగుతుందనుకొన్నారు.GCTel 72.1

    కాని విక్లిఫ్ తన నమ్మకాన్ని రచనల్ని ఉపసంహరించుకోలేదు. నటించటం ఆయనకు చేతకాదు. తన బోధల్ని నిర్భయంగా సమర్థించుకొని తన్ను హింసించేవారు మోపిన నిందలను తిప్పికొట్టాడు. తన్నుతాను మర్చిపోయి తానున్న స్థలాన్ని పరిస్థితులను మర్చిపోయి, తన శ్రోతలను దేవుని న్యాయపీఠం ముందుకి ఆహ్వానించి నిత్య సత్యమనే త్రాసులో వారి కుతర్కాలను మోసాలను తూకం వేశాడు. ఆ సభామందిరంలో పరిశుద్దాత్మ శక్తిని అందరు గుర్తించారు. ఆయన చెబుతున్నవి వింటున్న వారిపై దైవ ప్రభావం పడింది. వారు ఆ స్థలాన్ని వదిలి వెళ్లలేకపోయారు. ప్రభువు అమ్ముల పొదినుంచి వస్తున్న బాణాలమల్లే సంస్కరణవాది పలికిన మాటలు వారి హృదయాల్ని చీల్చాయి. వారు మోపిన సిద్ధాంత వ్యతిరేకత అన్న అభియోగాన్ని గొప్ప నేర్పుతో తిప్పి వారిమీదనే మోపాడు. అబదాల్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారని వారిని ప్రశ్నించాడు. దేవుని కృపను బజారువస్తువుగా అమ్మి లాభం చేసుకోటానికా అని నిగ్గదీశాడు.GCTel 72.2

    “మీరు ఎవరితో పోరాడుతున్నామను కొంటున్నారు? సమాధిలో ఒక అడుగు పెట్టిన వృద్ధుడితోనా? కాదు. సత్యంతో- మీ కన్నా ఎంతో బలమైన సత్యంతో, మిమ్మల్ని జయించే సత్యంతో , _ లిలీ, పుస్త 2,అధ్యా 13. ఈ మాటలు పలుకుతూ సమావేశం విడిచి వెళ్లిపోయాడు. తన ప్రత్యర్థుల్లో ఒక్కడు కూడా ఆయనను అడ్డుకోటానికి ప్రయత్నించలేదు. విక్లిఫ్ చేయాల్సిన పని దాదాపు పూర్తి అయ్యింది. ఆయన ఎంతోకాలం మోసిన సత్యధ్వజం తన చేతుల్లో నుంచి త్వరలోనే నేలకు ఒరగనున్నది. అయితే మరోసారి సువార్త పక్షంగా ఆయన సాక్ష్యం ఇవాల్సి ఉన్నాడు. అబద్దాల ఆశ్రయదుర్గం నుంచే సత్య ప్రసారం జరగాల్సి ఉన్నది. రోము నగరంలో పోపుల ట్రిబ్యూనల్ ముందు విచారణకు విక్లిఫ్ కు సమన్లు వచ్చాయి. అది తరచుగా పరిశుదుల రక్తం చిందించిన ట్రిబ్యూనల్. తన ముందున్న ప్రమాదం విక్లిఫ్ ఎరగంది కాదు. అయినప్పటికీ ఆ సమన్ల ఆదేశాను సారం విక్లిఫ్ రోము వెళ్లి ఉండేవాడే. ఇంతలో పక్షవాతం వచ్చి ఆయన్ను కదలనీయకపోవడంతో ప్రయాణం చేయలేకపోయాడు. తన నివాసం నుంచి సంస్కరణ వాది పోపుకి ఒక ఉత్తరం రాశాడు. అది గౌరవ భావంతో క్రైస్తవ స్పూర్తితో రాసిన ఉత్తరం. అయినా అది పోపుల ఆడంబరాన్ని, అహంకారాన్ని నిశితంగా విమర్శించే ఉత్తరం.GCTel 72.3

    “నా విశ్వాసం గురించి ప్రతివారికీ, ముఖ్యంగా రోము బిషప్పుకు, బహిరంగంగా ప్రకటించటానికి ఎంతో ఆనందిస్తున్నాను. అది సరి అయినది. వాస్తవమైనది అని నా విశ్వాసం. అలాగైతే సదరు బిషప్పు నా నమ్మకాన్ని ధ్రువపర్చవచ్చు. కాని పక్షంలో దాన్ని సవరించవచ్చు. GCTel 73.1

    “ముందుగా, క్రీస్తు సువార్త సంపూర్ణ దైవ ధర్మశాస్త్రమని నా అభిప్రాయం. రోము బిషప్పు క్రీస్తుకు లోకంలో రాయబారిగనుక ఇతరులకన్న అతను ఎక్కువగా సువార్త నిబంధనకు బద్ధుడై ఉండాలని నేననుకొంటున్నాను. ఎందుచేతనంటే క్రీస్తు అనుచరుల సందర్భంగా గొప్పతనమన్మది లోక సంబంధమైన గౌరవ మర్యాదలతో ముడిపడిందికాదు. జీవితవిధానంలోను వ్యావహారిక శైలిలోను నిర్దుష్టంగా వ్యవహారించటంలోనే ఆగొప్పతనం ఉన్నది. క్రీస్తు యాత్రికుడుగా ఈ లోకంలో జీవించిన కాలంలో నిరుపేదగా నివసించాడు. లౌకిక అధికారాన్ని గౌరవాన్ని విసర్జించాడు...GCTel 73.2

    “నిజాయితీ పరుడైన ఏ వ్యక్తి పోపునుగాని, పరిశుద్దుల్నిగాని అనుసరించకూడదు. అన్ని విషయాల్లోను ప్రభువైన యేసుక్రీస్తునే అనుసరించాలి. క్రీస్తు అడుగు జాడల్లో నడవటానికి బదులు పేతురు, జెబెదయికుమారులు లోక ప్రతిష్టను ఆశించినప్పుడు దేవుని కించపర్చారు. కాబట్టి ఈ దురాచారాల్లో వారిని అనుసరించకూడదు.GCTel 73.3

    “రాజకీయాధికారాన్ని ఆధిపత్యాన్ని పోపు లౌకిక అధికారులకు విడిచిపెట్టి బోధక వర్గాన్ని ఉద్బోధిస్తూ దేశంలో సంచరించాలి. క్రీస్తు చేసింది. ఇదే, ముఖ్యంగా తన అపోస్తలుల ద్వారా. కనుక ఈ విషయాల్లో నేనేమైన తప్పు చేస్తే దాని సవరణకు నన్నునేను సమర్పించు కొంటున్నాను. అవసరమైతే మరణం ద్వారా కూడ. నా యిష్ట ప్రకారం లేదా నా అంతరాత్మతో నేను కోరుకొన్నట్లు చేయటం సాధ్యపడితే రోము బిషప్పుల ముందు నిలవాలన్నదే నాకోరిక. కాని అది ప్రభువు చిత్తానికి విరుద్ధంగా ఉన్నది. అది నాకు మనుషుల మాటకన్న దేవుని మాటవినటం నేర్పింది”GCTel 73.4

    చివరిగా ఆయన ఇలా అన్నాడు, “పోపు అర్బన్ VI అతని బోధక వర్గం జీవిత విధానంలోను వ్యవహార శైలిలోను యేసుక్రీస్తు ప్రభువును అనుకరించేందుకు, వారు ప్రజల్ని సవ్యంగా ఉపదేశించేందుకు, ఆ ఉపదేశాన్ని అనుసరించి వారు కూడ నివసించేందుకు వారిని చైతన్య పర్చాల్సిందిగా ప్రార్ధన చేద్దాం.” జాన్ఫక్స్ ఏక్ట్స్ అండ్ మాన్యుమెంట్స్, సం 3, పుటలు 49.GCTel 74.1

    ఇలా పోపు ముందు అతని కార్డినళ్ల ముందు క్రీస్తు వినయాన్ని, నమ్రతను ప్రస్తావించి క్రీస్తు రాయబారులమని చెప్పుకొంటున్న తమకును క్రీస్తుకును మధ్య ఉన్న తేడాను వారికి మాత్రమేగాక క్రైస్తవలోకానికే విక్లిఫ్ చూపించాడు.GCTel 74.2

    తన విశ్వాసానికి తాను చెల్లించాల్సిన మూల్యం తన ప్రాణాలేనని విక్లిఫ్ గుర్తించాడు. ఆయన్ని మట్టుపెట్టటానికి కృషి చేసిన రాజు, పోపు, బిషప్పులు ఏమయ్యారు? కొన్ని నెలల్లోనే తనకు సజీవ దహనం శిక్ష పడే సూచనలు కనిపించాయి. కాని ఆయన మనోధైర్యం చెదరలేదు. “హతసాక్షి కిరీటాన్ని అన్వేషించటం గురించి ఎందుకు మాట్లాడారు? క్రీస్తు సువార్తను అహంకారులైన ప్రివేటకు బోధించండి. మీరు తప్పక హతసాక్షులవుతారు. ఏంటీ, నేను బతికివుండి మౌనంగా ఉండటమా? అసంభవం. కత్తివేటు పడనీయండి, దానికే వేచి ఉన్నాను” అన్నాడాయన- డి ఆ బి, పుస్త, 17. అధ్యా.8.GCTel 74.3

    కాగా దేవుని కృప దైవ సేవకుణ్ణి ఇంకా భద్రంగానే ఉంచింది. అనుదినమూ అభద్రత నెదుర్కొంటు జీవితకాలమంతా ధైర్యంగా సత్యం కోసం నిలిచిన వ్యక్తి తన ప్రత్యర్థుల ద్వేషానికి బలి పశువుకాడు. విఫ్ తన్నుతాను కాపాడుకోటానికి ఎన్నడూ ప్రయ త్నించలేదు. ప్రభువే ఆయన సంరక్షకుడు.తనను హతమార్చటానికి తన విరోధులు సిద్ధమైనప్పుడు వారి వశం నుంచి ఆయనను దేవుని హస్తమే తొలగించింది. లటర్బర్గ్ లోని తన సంఘంలో ప్రభుభోజన పదార్థాలు పంచే తరుణంలో పక్షవాత ఘాతానికి కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు.GCTel 74.4

    తాను నిర్వహించాల్సిన పనిని విక్లిఫ్ కి దేవుడు నియమించాడు. ఆయన నోటిలో సత్యవాక్యాన్ని ఉంచి ఆ వాక్యం ప్రజలకు అందేనిమిత్తం ఆయన చుట్టూ దేవుడు కావలి ఏర్పాటు చేశాడు. ఆయన ప్రాణాన్ని కాపాడాడు. సంస్కరణ మహోద్యమానికి పునాది పడే వరకు ఆయన సేవలను దేవుడు పొడిగించాడు.GCTel 74.5

    విక్లిఫ్ చీకటి యుగాల అంధకారంలో నుంచి వచ్చాడు. తన సంస్కరణ వ్యవస్థను రూపొందించుకోటానికి తనకు ముందుండి కృషి చేసిన వారెవరూ లేరు. ఒక ప్రత్యేక కార్యాన్ని నిర్వహించటానికి జన్మించిన స్నానికుడైన యోహాను మల్లే విక్లిఫ్ సూతన యుగ వైతాళికుడు. ఆయన అందించిన సత్య వ్యవస్థలో ఏకత్వం పరిపూర్ణత్వం ఉన్నాయి. ఆయన వెనుక వచ్చిన సంస్కరణ వాదులు వాటిని మించిపోలేదు. వంద సంవత్సరాల తర్వాత కూడా కొందరు వాటిని చేరుకోలేదు. పునాది అంత విశాలంగాను లోతుగాను, మూస అంత బలంగాను వాస్తవికంగాను పడటం చేత ఆయన తర్వాత వచ్చిన వారు వాటిని తిరిగి నిర్మించాల్సిన అవసరం లేకపోయింది.GCTel 75.1

    అంతరాత్మను ప్రతిభను మేలుకొలిపి, దీర్ఘకాలంగా రోము విజయ రథానికి అనుసంధానంగా ఉన్న దేశాలకు విముక్తి కలిగించేందుకు విక్లిఫ్ మొదలు పెట్టిన మహోద్యమం బైబిలునుంచి పుట్టింది. 14వ శతాబ్దిలో మొదలై యుగాల పొడుగునా జీవజలంలా ప్రవహిస్తున్న ఆశీర్వాదాల ఏరుకు మూలం ఇదే. పరిశుద్ధ లేఖనాలు దేవుని చిత్తాన్ని వెల్లడించే ఆవేశపూరిత ప్రకటన అని అవి మన విశ్వాసానికి ఆచరణకు సరియైన ఒరవడి అని విక్లిఫ్ నిస్సంకోచంగా విశ్వసించి అంగీకరించాడు. రాము సంఘాన్ని దేవుని సంఘంగా తప్పులేని అధికారంగా పరిగణించటం, వెయ్యి సంవత్సరాలుగా వస్తున్న ఆ సంఘ బోధనల్ని ఆచారాల్ని ప్రశ్నించకుండా భక్తి భావంతో అంగీకరించటం ఆయన నేర్చుకొన్నాడు. అయితే దేవుని పరిశుద్ధ వాక్యాన్ని వినటానికిగాను వీటన్నిటిని పక్కన పెట్టాడు. ఈ దైవాధికారాన్నే ప్రజలు గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. సంఘం పోపు ద్వారా మాట్లాడేకన్నా వాక్యం ద్వారా మాట్లాడే దైవ స్వరమే నిజమైన దైవాధికారమని ఆయన ప్రకటించాడు. బైబిలు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా బయలుపర్చుతుందని పరిశుద్ధాత్మ ఒక్కడే బైబిలును విశదం చేయగలడని దాని బోధనలు అధ్యయనం చేసి ప్రతీవారు తమతమ విధులేమిటో తెలుసుకోవాలని ఆయన ప్రబోధించాడు. ప్రజల మనసుల్ని ఈ రీతిగా పోపునుంచి రోమను సంఘం నుంచి దేవుని వాక్యానికి మరల్చాడు.GCTel 75.2

    సంస్కర్తలలో విక్లిఫ్ అగ్రగణ్యుడు. ప్రతిభ విషయంలో భావస్పష్టత విషయంలో సత్యాన్ని అచంచలంగా అనుసరించే విషయంలో సత్యాన్ని ధైర్యంగా సమర్ధించటం విషయంలో, తన వెనుక వచ్చిన వారిలో బహుతక్కువ మందే ఆయనకు సరిసాటి. ఆయన నివసించిన దినాల్లో మానసిక అంధకారం, అవినీతి రాజ్యమేలున్నా, నిష్కళంక జీవితం, అధ్యయనంలోను పనిలోను దీక్ష, నైతిక నిష్ట, క్రీస్తును పోలిన ప్రేమ, నిస్వార్ధపరిచర్య- ఇది ప్రధఘ సంస్కర్త విక్లిఫ్ గుణసంపద.GCTel 75.3

    శిక్షణ నిచ్చే శక్తి , పరివర్తనను తెచ్చే శక్తి పరిశుద్ధ లేఖనాలకు ఉన్నదనటానికి విక్లిఫ్ ప్రవర్తన ప్రబల నిదర్శనం. తాను ఉన్న స్థితికి కారణం బైబిలే. వాక్యంలో ప్రకటితమైన గొప్ప సత్యాల్ని గ్రహించేందుకు జరిగే కృషి శక్తి సామర్థ్యాలకు తాజాతనాన్ని ఉత్సాహాన్ని చేకూర్చుతుంది. అది మనసును విశాలపర్చి, గ్రహణశక్తిని పెంపొందించి వివేచనకు పరిణతినిస్తుంది. బైబిలు పఠనం వల్ల ఆలోచనలు, మనోభావాలు, అభిలాషలు సమున్నతమౌతాయి. ఏ యితర పఠనం వల్ల ఇది సాధ్యకాదు. అది లక్ష్యానికి స్తిరత, సహనం, ధైర్యం, నిగ్రహం ఇస్తుంది. ప్రవర్తనను పరిశుద్ధపర్చుతుంది. ఆత్మను పవిత్రపర్చుతుంది. చిత్తశుద్ధితో, భక్తితో చేసే లేఖన పఠనం విద్యార్థుల మనసుల్ని నిత్యుడైన దేవుని మనసుతో అనుసంధానపర్చి వారిని బలమైన చురుకైన మనసులు, ఉదాత్తమైన నియమాలుగల వ్యక్తులుగా తీర్చిదిద్ది లోకానికి సమర్పిస్తుంది. అత్యుత్తమ మానవతత్వం తయారుచేయగల వ్యక్తుల కన్న వీరు మిన్నగా ఉంటారు. “నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును. అవి తెలివి లేనివారికి తెలివి కలిగించును” కీర్తనలు 119:130.GCTel 76.1

    విక్లిఫ్ ప్రబోధించిన సిద్ధాంతాలు కొంతకాలం విస్తరించాయి. వికై ఫైట్లుగాను, లొలార్డులుగాను పేరుపొంది ఆయన అనుచరులు ఇంగ్లాండులోనేగాక ఇతర దేశాల్లో కూడా సువార్త ప్రకటించారు. ఇక తమ నాయకుడు లేడు గనుక బోధకులు ఇంకా ఉద్రేకంగా పని చేశారు. ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి వారి బోధలు విన్నారు. సామంతులు కొందరు, రాజు భార్యతోసహా నూతన విశ్వాసాన్ని అంగీకరించి మతం మార్చు కొన్నారు. అనేక స్థలాల్లో ప్రజల జీవన సరళిలో స్పష్టమైన దిద్దుబాటు కనిపించింది. విగ్రహారాధనను సూచించే రోమను మత చిహ్నాల్ని ఆలయాల్లోనుంచి తీసివేశారు. అయితే అనతికాలంలోనే తమ మార్గదర్శినిగా బైబిలును అంగీకరించిన ప్రజలమీద హింసాకాండ తుఫానువల్లే విరుచుకుపడింది. రోము మద్దతు కూడగట్టుకోటం ద్వారా తమ అధికారాన్ని సుస్తిరపర్చుకోజూచిన ఇంగ్లీషు రాజులు సంస్కరణ వాదుల్ని బలి పశువులు చేయటానికి వెనుకాడలేదు. సువార్తను విశ్వసించే ప్రజలకు సజీవదహన దండన విధింపు ఇంగ్లాండు దేశ చరిత్రలోనే ప్రప్రధమం. హతసాక్ష్యాలు ఒకదాని వెంట మరొకటిగా జరిగాయి. వెలివేతకు హింసకు గురి అయిన సత్యవాదులు తమ వెతల్ని సబ్బాతు ప్రభువుకు వినిపించుకొనే వారు. సంఘ విరోధులుగా, దేశద్రోహులుగా నిందకు, హింసకు గురి అయిన వారు బీదల గృహాల్లో ఆశ్రయం పొందుతూ తరచు గుహల్లోను చీకటి బిలాల్లోను తలదాచుకొంటూ రహస్య స్థలాల్లో సువార్త ప్రకటించటం కొనసాగించేవారు.GCTel 76.2

    తీవ్రహింస సాగుతూ ఉన్నా భ్రష్టుపట్టిన మత విశ్వాసాన్ని వ్యతిరేకిస్తూ భక్తి పూర్వకమైన, యదార్ధమైన, సహనంతో కూడిన ప్రార్థన శతాబ్దాలు పొడుగునా వ్యక్తమౌతూనే వచ్చింది. ఆ తొలిదినాల క్రైస్తవుల వాక్యజ్ఞానం అంతంత మాత్రమే. కాకపోతే వారు వాక్యాన్ని అమితంగా ప్రేమించి అనుసరించారు. వాక్యం నిమిత్తం శ్రమలనుభవించారు. అపోస్తలుల దినాల్లోని శిష్యుల మల్లే క్రీస్తు నిమిత్తం అనేకమంది తమ ఆస్తిపాస్తుల్ని త్యాగం చేశారు. తమసొంత గృహాల్లో నివసించటానికి అనుమతి పొందిన వారు వెలివేతకు గురి అయిన సోదరులకు సంతోషంగా ఆశ్రయమిచ్చారు. తాము కూడా నిషేధానికి గురి అయినప్పుడు ఆనందంగా త్యాగసిద్ధ జీవిత శ్రమల్ని అంగీకరించారు. తీవ్ర హింసలకు గుండె చెదరిన వేలాదిమంది తమ విశ్వాసంతో స్వతంత్రంగా కొనుక్కొని తమ తప్పు ఒప్పుకోలును ప్రచురించటానికి పశ్చాత్తాప సూచక దుస్తులు ధరించి ఖైదు నుంచి విడుదల పొందారు. చీకటి జలాల్లో ‘‘లొలార్డు గోపురాల్లో హింస మధ్య, నాలుకలు చాపుతున్న మంటల మధ్య “ప్రభువు శ్రమల సహవాసం” అనుభవించటానికి యోగ్యులుగా పరిగణన పొందినందుకు ఆనందిస్తూ సత్యం గురించి నిర్భయంగా సాక్ష్యమిచ్చిన వారి సంఖ్య అల్పంకాదు. వీరిలో అధికులు గొప్పవారు, సామాన్యులు, బీదవారు ఉన్నారు.GCTel 77.1

    విక్లిఫ్ జీవించి ఉన్న కాలంలో పోపు మత వాదులు తమ చిత్రాన్ని నెరవేర్చుకోలేక పోయారు. ఆయన తన సమాధిలో విశ్రాంతి తీసుకొంటూన్నప్పుడు కూడ ఆయనపట్ల వారి ద్వేషం చల్లారలేదు. విక్లిఫ్ మరణించిన నలబై సంవత్సరాల అనంతరం కాన్స్టెన్స్ సభ ఆదేశానుసారం ఆయన అస్థికలను తవ్వితీసి వాటిని బహిరంగంగా కాల్చి బూడిదచేసి ఆ బూడిదను సమీపాన ఉన్న వాగులో పారేశారు. ఒక ప్రాచీన రచయిత ఇలా రాస్తున్నాడు ఏవన్ నదిలోకి, ఏవన్ నుంచి సెవర్స్ నదిలోకి, సెవర్స్ నుంచి సముద్రాలలోకి, మహాసముద్రంలోకి ఇలా వెళ్లిన విక్లిఫ్ బూడిద ఆయన సిద్ధాంతాలకు ప్రతీక. ఆ సిద్ధాంతాలు ఇప్పుడు లోకమంతా వ్యాపించి ఉన్నాయి.” టి పుల్లర్, చర్చ్ హిస్టరీ ఆఫ్ బ్రిటన్, పుస్త, 4 సెక్ష 2, పేరా 54. కుత్సితమైన తమ ఈ చర్య ప్రాముఖ్యాన్ని విక్లిఫ్ ప్రత్యర్ధులు గుర్తించలేదు.GCTel 77.2

    బోహీమియాకు చెందిన జాన్వాస్ విక్లిఫ్ రచనల ద్వారానే రోమను మతదోషా లెన్నింటినో విసర్జించి సంస్కరణ దిశగా ఉద్యమించటానికి ప్రేరణ పొందాడు. ఒకదాని నుంచి ఒకటి ఎంతో దూరంలో ఉన్న ఈ రెండు దేశాల్లో సత్యమనే విత్తనం నాటుకొంది. దీర్ఘకాలంగా మరుగునపడివున్న దైవ వాక్యంపై మనుషుల మనసులు కేంద్రీకృ తమయ్యాయి. దేవుని హస్తం గొప్ప దిద్దుబాటుకు మార్గం తెరుస్తున్నది.GCTel 77.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents