Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    45—రోము నుంచి రాసిన ఉత్తరాలు

    యేసు అనుచరులను గురించి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోటానికి తన తొలినాళ్ల క్రైస్తవానుభవంలో అపొస్తలుడు పౌలుకి ప్రత్యేకావకాశం లభించింది. అతడు “మూడవ ఆకాశమునకు కొనిపోబడెను.” “పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యముకాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు”. తనకు వచ్చిన “ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు” అతడే అంగీకరించాడు. సువార్త సత్యాల్ని గూర్చిన సూత్రాల విషయంలో అతని అవగాహన “మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలుల” అవగాహనకు దీటైనది. 2 కొరి 12:2, 4,1,11. “జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ” “వెడల్పు పొడవు లోతు ఎత్తు” అతడు స్పష్టంగా సంపూర్తిగా అవగాహన చేసుకున్నాడు. ఎఫెసీ 3:18-19.AATel 335.1

    దర్శనంలో తాను చూసినదంతా పౌలు చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఆ సభలో తన మాటలకు తప్పుడు అర్ధాలను చెప్పగలిగినవారున్నారు. అయితే తనకు ఏమైతే ప్రత్యక్షపర్చబడిందో అది నాయకుడుగా వివేకంగల బోధకుడుగా తాను సేవ చేయటానికి, అనంతరం తాను సంఘాలకు పంపిన బోధకుల్ని తీర్చిదిద్దటానికి తోడ్పడింది. దర్శనంలో ఉన్నప్పుడు తనలో కలిగిన భావోద్వేగం తనతో ఉండిపోయింది. క్రీస్తు ప్రవర్తనను నిర్దుష్టంగా సూచించడానికి అది పౌలుకి సామర్థ్యాన్ని చేకూర్చింది. నోటిమాట ద్వారా ఉత్తరం ద్వారా అతడు ఒక సందేశాన్ని అందించాడు. అది నాటి నుంచి దేవుని సంఘాన్ని బలోపేతం చేస్తున్నది. సంఘం ఎదుర్కోనున్న అపాయాల్ని గురించి తప్పుడు సిద్ధాంతాల్ని గురించి ఈ వర్తమానం నేటి 2 న్వాసుల్ని హెచ్చరిస్తున్నది.AATel 335.2

    హితవుతో నిండిన తన ఉత్తరాల్ని అపొస్తలుడు ఎవరికి రాశాడో వారు “గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు” చిన్న పిల్లలవలె ఉండక వారందరు ” విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు” కావాలని అతడు ఆశిస్తున్నాడు. అన్యజనుల సమాజాల నుంచి క్రీస్తు అనుచరులైన వారికి పౌలు ఈ విజ్ఞప్తి చేశాడు, “అన్యజనులు నడుచుకొనునట్లు సరికమీదట నడచుకొనవలదని ప్రభువునందు మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సుగలవారై.... తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవము నుండి వేరుపడినవారై తమ మనస్సునకు కలిగిన వ్యర్హతను అనుసరించి నడుచుకొనుచున్నారు”, “మీరు సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు అజ్ఞానులవలె కాక జ్ఞానులవలె నడుచుకొనునట్లు, జాగ్రత్తగా చూచుకొనుడి.” ఎఫెసీ 4:14,13,17,18; 5:15,16. క్రీస్తు “సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలబెట్టు” కొనే సమయానికి ఎదురుచూడాల్సిందిగా వారిని ప్రోత్సహించాడు. ఎఫెసీ 5:25-27.AATel 335.3

    మానవ శక్తి చేతగాక దేవుని శక్తిచేత రాసిన ఈ వర్తమానాల్ని అందరూ పఠించాలి. వాటిని మళ్లీ మళ్లీ పఠించటం అవసరం. వాటిలో ప్రయోగత్మకమైన దైవభక్తి, సూత్రాలు ఉన్నాయి. వాటిని ప్రతీ సంఘం ఆచరించటం అవసరం. అవి నిత్యజీవమార్గాన్ని విస్పష్టం చేస్తున్నాయి.AATel 336.1

    “కొలొస్సయిలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు” తాను రోములో ఖైదీగా ఉన్న సమయంలో రాసిన ఉత్తరంలో వారు విశ్వాసంలో నిలకడగా అచంచలంగా ఉండటాన్ని గూర్చి ప్రస్తావిస్తూ ఆ వార్తను ఎపఫౌవలన తెలుసుకున్నానని, ఎపఫ్రా ఇలా అన్నాడని పౌలు రాశాడు. “మేమును ఈ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మసంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించువారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు, ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమను బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్దుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని దేవుని బ్రతిమాలి వేడుకొనుచున్నాను.”AATel 336.2

    కొలొస్సయి విశ్వాసుల విషయంలో తనకున్న ఆకాంక్షను పౌలు ఈ విధంగా మాటల్లో వ్యక్తం చేశాడు. ఈ మాటలు క్రీస్తు అనుచరుల ముందు ఎంత ఉన్నతాదర్శాన్ని నిలుపుతున్నాయి! ఆ మాటలు క్రైస్తవ జీవితానికున్న అద్భుతమైన అవకాశాన్ని సూచిస్తూ దైవ ప్రజలకు ఒనగూడే దీవెనలకు మితి పరిమితి లేదని స్పష్టం చేస్తున్నాయి. దేవుని గూర్చిన జ్ఞానంలో నిత్యం వృద్ధి చెందుతూ వారు క్రైస్తవానుభవంలో బలో పేతులవుతూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ తుదకు “తేజో వాసులైన “పరిశుద్ధుల” “స్వాస్థ్యములో పాలివారగుటకు” యోగ్యులవుతారు.AATel 336.3

    దేవుడు ఎవరిద్వారా సమస్తాన్నీ సృజించాడో, మానవుల రక్షణను ఎవరిద్వారా ఏర్పాటుచేశాడో ఆ క్రీస్తును అపొస్తలుడు తన సహోదరుల ముందు ఘనపర్చాడు. లోకాల్ని అంతరిక్షంలో నిలిపి ఈ విశ్వాంతరాళంలోని సమస్తాన్ని వాటివాటి విధి నిర్వహణలో క్రమపద్ధతిలో నిరంతరం నడుపుతున్న హస్తమే తమ నిమిత్తం సిలువకు మేకులతో కొట్టబడిందని చెప్పాడు. పౌలు ఇలా రాశాడు. “ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనము లైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సుజింపబడెను.” “మరియు గతకాలమందు దేవునికి దూరస్తులును, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావము గలవారునైయుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంనయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.”AATel 337.1

    పడిపోయిన మనుషుల్ని పైకిలేవదీసేందుకు దైవ కుమారుడు భువిపై వంగాడు. ఇందుకోసం ఆయన పాపరహిత లోకాల్ని విడిచాడు. తనను ప్రేమించిన తొంభై తొమ్మిదింటిని విడిచి “మన యతిక్రమ క్రియలను బట్టి”.... గాయపర్చబడటానికి మన దోషములను బట్టి నలుగగొట్టబడటానికి వచ్చాడు. యెషయా 53:5. ఆయన అన్ని విషయాల్లో తన సహోదరులవంటివాడయ్యాడు. మనకు మల్లేనే ఆయన రక్తమాంసాలు కలవాడయ్యాడు. ఆయన ఆకలి దప్పిక అలసట ఎరిగినవాడు. భోజనం వల్ల శక్తిని నిద్రవల్ల విశ్రాంతిని పొందాడు ఈ లోకంలో ఆయన పరదేశి యాత్రికుడు. లోకంలో ఉన్నాడు కాని లోక సంబంధికాడు. నేడు స్త్రీ పురుషులకు మల్లే శోధనలకు గురిఅయ్యాడు. కాని పాపరహిత జీవితం జీవించాడు. ఇతరులపట్ల దయ, కరుణ, సానుభూతి, పరిగణన కలిగి ఆయన దేవుని ప్రవర్తనను ప్రతి బింబించాడు. ” ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను..... మనము ఆయన మహిమను కనుకొంటిమి.” యోహాను 1:14. AATel 337.2

    అన్యమతాచారాలు ప్రభావాలు తమ చుట్టూ ఉండటంతో కొలొస్సయి విశ్వాసులు సరళమైన సువార్త సత్యాలనుంచి అన్యాచారాలకు ఆకర్షితులయ్యే ప్రమాదముంది. ఈ విషయమై వారిని హెచ్చరిస్తూ పౌలు క్రీస్తును తమ మార్గదర్శకుడుగా ఎంపిక చేసుకోటం క్షేమమని వారికి ఉద్బోధించాడు. పౌలిలా రాశాడు, “నాకొరకును, లవొదికయ వారి కొరకును, శరీరరీతిగా నా ముఖము చూడనివారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసి కొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి, సంపూర్ణ గ్రహీంపు యొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.AATel 337.3

    “ఎవరైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరం కుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను..... మీరు ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సైయున్నాడు.”AATel 338.1

    వంచకులు బయలెళ్తారు. వారి ప్రభావంవల్ల “పాపము” “విస్తరిస్తుంది” “అనేకులపట్ల ప్రేమ” “చల్లారును” మత్తయి 24:12. శత్రువులు పెట్టే హింసకన్నా దీనివల్ల సంఘానికి కలిగే చేటు ఎక్కువని శిష్యుల్ని ఆయన హెచ్చరించాడు. ఈ అబద్ధ బోధకుల గురించి విశ్వాసుల్ని పౌలు పదే పదే హెచ్చరించాడు. విశ్వాసులు ప్రధానంగా ఈ అపాయం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అబద్ధ బోధకులికి చెవినియ్యటం ద్వారా తప్పుడు బోధలకు వారు తలుపు తియ్యవచ్చు. ఈ రకంగా సాతాను నూతనంగా సువార్త విశ్వాసాన్ని స్వీకరించినవారి ఆధ్యాత్మిక అవగాహనను మసకబార్చి వారి విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. సిద్ధాంతాల పరిశీలనకు క్రీస్తే ప్రామాణికం. ఆయన బోధనలతో ఏకీభవించని సమస్తాన్ని విసర్జించాలి. పాపం నిమిత్తం సిలువ పొందిన క్రీస్తు, మరణం జయించి లేచిన క్రీస్తు, పరలోకానికి ఆరోహణుడైన క్రీస్తు • వారు నేర్చుకుని బోధించాల్సిన శాస్త్ర విజ్ఞానం ఇదే.AATel 338.2

    నేడు క్రైస్తవ సంఘాన్ని చుట్టుముట్టివున్న అపాయాలగురించి దైవ వాక్యం చేస్తున్న హెచ్చరికలు మనకు సంబంధించినవే. అపొస్తలుల కాలంలో సంప్రదాయం, తత్వజ్ఞానం ఉపయోగించి లేఖనాల పై విశ్వాసాన్ని నాశనం చెయ్యటానికి మనుషులు ప్రయత్నించినట్లే ఈనాడు కూడా ఉన్నత పరిశీలన పరిణామ సిద్ధాంత భావాలు, భూతమతం, దివ్యజ్ఞానం బహుదేవతా పూజ ద్వారా మనుషుల్ని నిషిద్ధ మార్గాల్లోకి నడిపించటానికి సాతాను చూస్తున్నాడు. అనేకమందికి బైబిలు నూనె లేని దీపమయ్యింది. కారణమేంటంటే వారు ఊహాగానాల పై ఆధారపడ్డ నమ్మకాలపై మనసు పెడున్నారు. ఆ నమ్మకాలు వారిలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ముక్కముక్కలుగా ఖండించటం, ఊహించటం, పునర్నిర్మించటం ద్వారా జరిగే ఉన్నత పరిశీలన బైబిలు దైవ ప్రేరణ వలనవచ్చిన గ్రంథమన్న నమ్మకాన్ని నాశనం చేస్తుంది. మానవ జీవితాల్ని అదుపుచెయ్యటానికి, ఉన్నత స్థాయికి లేపటానికి, ఉత్తేజపర్చటానికి బైబిలుకున్న శక్తిని అది దొంగిలిస్తుంది. వాంఛే అత్యున్నత చట్టమని విచ్చలవిడి ప్రవర్తనే స్వేచ్ఛ అని మనిషి తనకు తానే జవాబుదారి అని భూతమతం వేలాది ప్రజలకు నూరిపోస్తుంది.AATel 338.3

    క్రీస్తు అనుచరుడికి “చక్కని మాటలు” ఎదురవుతాయి. వీటిని గురించి కొలొస్సయి విశ్వాసుల్ని పౌలు హెచ్చరించాడు. లేఖనాలకు భూతమత వాద వ్యాఖ్యానం చెప్పే వ్యక్తులు క్రైస్తవునికి ఎదురవుతారు. వారికి చెవినియ్యటం ప్రమాదకరం. లేఖనాల్లోని నిత్య సత్యాల్ని ధ్రువీకరిస్తూ వచ్చే స్పష్టమైన స్వరం అతనికి వినిపించాల్సిన స్వరం. తన దృష్టిని క్రీస్తు పై నిలిపి తనకు స్పష్టంగా నిర్దేశితమైన మార్గంలో సాగుతూ అతడు ప్రభువు బోధనలకు విరుద్ధమైన అభిప్రాయాల్ని తిరస్కరించాలి. అతడు దేవుని సత్యం పై తన ఆలోచనను ధ్యానాన్ని నిలపాలి. బైబిలుని తనతో ప్రత్యక్షంగా మాట్లాడున్న దైవ స్వరంగా పరిగణించాలి. ఇలా అతడు దైవ వివేకాన్ని పొందగలుగుతాడు.AATel 339.1

    క్రీస్తులో ప్రకటితమైన జ్ఞానం రక్షణ పొందే వారందరికీ ఉండవలసిన జ్ఞానం. ప్రవర్తనలో మార్పు కలిగించేది ఈ జ్ఞానమే. దాన్ని స్వీకరించి జీవించే ఆత్మలో అది క్రీస్తు రూపాన్ని తిరిగి సృజిస్తుంది. ఈ జ్ఞానాన్ని పొందాల్సిందిగా దేవుడు తన ప్రజల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ జ్ఞానం ముందు తక్కినవన్నీ వ్యర్థమే, శూన్యమే.AATel 339.2

    ప్రతీ తరంలోను, ప్రతీ దేశంలోను ప్రవర్తన నిర్మాణానికి పునాది ఒక్కటే - దైవ వాక్యంలోని సూత్రాలే. దేవుడు చెప్పిన దాని ప్రకారం నడుచుకోటమే మనకు క్షేమం. “యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును.” ” ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.” కీర్తనలు 19:8:15:5. అపొస్తలులు తమ దినాల్లో ప్రబలిన తప్పుడు సిద్ధాంతాల్ని దైవ వాక్యంతో ఎదుర్కొన్నారు. “వేయబడిన పునాది తప్ప మరియొక పునాది ఎవడును వేయలేడు” అని ప్రకటించారు. 1 కొరింథీ 3:11.AATel 339.3

    కొలొస్సయి విశ్వాసులు మారుమనసుపొంది బాప్తిస్మం పుచ్చుకొన్నప్పుడు తాము క్రితంలో నమ్మి ఆచరించిన వాటిని విడిచి పెడ్తామని క్రీస్తుపట్ల నమ్మకంగా భక్తిగా నివసిస్తామని వాగ్దానం చేశారు. తన ఉత్తరంలో పౌలు ఈ విషయాన్ని వారికి గుర్తుచేశాడు. తమ వాగ్దానాన్ని నెరవేర్చుకోటానికి వారు తమపై ఆధిపత్యం సాధించ చూస్తున్న దుష్ట శక్తిని నిత్యం ఎదుర్కోటం మర్చిపోవద్దని పౌలు వారిని ఉద్బోధించాడు. అపొస్తలుడు ఇలా అన్నాడు,” “మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్నవాటిమీదనేగాని, భూసంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడియున్నది.”AATel 339.4

    ఎవడైనను క్రీస్తు యేసునందున్నయెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయెను.” 2 కొరింథీ 5:17. స్త్రీలేంటి పురషులేంటి క్రీస్తు శక్తి ద్వారా పాపపు అలవాటు సంకెళ్ళను ఛేదించగలగుతున్నారు. స్వార్థాన్ని విడిచి పెడున్నారు. దుష్టులు సజ్జనులవుతున్నారు. తాగుబోతులు తాగుడు విడిచి పెడున్నారు. కామాంధులు పవిత్రులవుతున్నారు. సాతాను పోలికలున్న ఆత్మలు క్రీస్తు రూపంలోకి మార్పుచెందుతున్నాయి. ఈ ఒక్క మార్పే అద్భుతాల్ని తలదన్నిన అద్భుతం. వాక్యంద్వారా చోటుచేసుకున్న మార్పు వాక్యం తాలూకు లోతైన మర్మాల్లో ఒకటి. అది మనం గ్రహించలేం. మన పని దాన్ని నమ్మటమే. వాక్యం చెబుతున్నట్లు “మియందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయైయున్నాడు.AATel 340.1

    దేవుని ఆత్మ మనసును హృదయాన్ని అదుపు చేసినప్పుడు మారుమనసు పొందిన ఆత్మ ఉప్పొంగి కొత్త కీర్తన పాడుతుంది. ఎందుకంటే తన అనుభవంలో దేవుని వాగ్దానం నెరవేరింది, తన అతిక్రమానికి క్షమాపణ లభించి తన పాపం నివారణ అయ్యింది. తాను ఉల్లంఘించిన దైవధర్మశాస్త్రం నిమిత్తం అతడు దేవుని ముందు పశ్చాత్తపుడయ్యాడు. మానవుల్ని నీతిమంతులుగా తీర్చేందుకు క్రీస్తు మరణించటం పై విశ్వాసముంచాడు. “విశ్వాసమూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా.... దేవునితో సమాధానము కలిగియుందుము.” రోమా 5:1.AATel 340.2

    ఇది తన అనుభవం గనుక క్రైస్తవుడు తన పక్షంగా క్రీస్తు సాధించిన దానితో తృప్తిపడి చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి కృతనిశ్చయంతో ఉన్న వ్యక్తి మార్పులేని పాతస్వభావపు ఉద్రేకాలు ఉద్వేగాలు అంధకార రాజ్యపుశక్తుల దన్నుతో తనకు వ్యతిరేకంగా మోహరించి ఉన్నట్లు తెలుసుకుంటాడు. అతడు క్రీస్తుకు తన సమర్పణను రోజుకు రోజు నవీకరించు కోవాలి. రోజుకు రోజు పాపంతో పోరు సల్పాలి. పాత అలవాట్లు, చెడుపట్ల పారంపర్య బలహీనతలు ప్రాబల్యం కోసం పోరాడాయి. వీటి విషయంలో క్రైస్తవుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. క్రీస్తు శక్తితో విజయానికి కృషిచెయ్యాలి.AATel 340.3

    పౌలు కొలొస్సయులకు ఈ ఉపదేశం రాశాడు. “కావున భూమి మీదనున్న మీ అవయవములను... చంపివేయుడి... పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, వినోటి బూతులు అనువీటన్నిటి విసర్జించుడి.....కాగా, దేవుని చేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్యమును వినయమును, సాత్వికమును, దీర్ఘ శాంత మును, వినయమును, సాత్వికము, దీర్ఘ శాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసెనని యొకడనుకొనినయెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి; వీటన్నిటిని పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.AATel 340.4

    క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులైయుండుడి”. కొలొస్సయులకు రాసిన ఉత్తరంలో క్రీస్తు సేవలో నిమగ్నులైయున్నవారికి విలువైన పాఠాలున్నాయి. ఈ పాఠాల ఏకైక ఉద్దేశం సమున్నత లక్ష్యం రక్షకుని రాయబారిగా కృషిచేసే వ్యక్తిలో కనబడ్డాయి. భక్తి మార్గంలో తన పురోగమనాన్ని అడ్డుకొనే సమస్తాన్ని విడిచి పెట్టి లేదా ఇరుకు మార్గం నుంచి మరొకరి పాదాలు తప్పుదారి పట్టించకుండా చూసుకొంటూ విశ్వాసి తన దిన దిన జీవనంలో కృపను, దయను, వినయాన్ని, సాత్వికాన్ని సహనాన్ని క్రీస్తు ప్రేమను ప్రదర్శిస్తాడు.AATel 341.1

    సమున్నతమైన, పవిత్రమైన, విశిష్టమైన జీవితంలోని శక్తే మన గొప్ప అవసరం. మన లౌకిక విషయాల్ని గురించి ఎక్కువగా పరలోక రాజ్యం గురించి అతి తక్కువగా ఆలోచిస్తుంటాం.AATel 341.2

    దేవుడిచ్చిన ఆదర్శాని సాధించటంలో క్రైస్తవుడు చేసే శ్రమనుగూర్చి నిస్పృహ చెందాల్సిన పనిలేదు. దేవుడు ప్రతివారికి నైతిక సంపూర్ణతను ఆధ్యాత్మిక సంపూర్ణతను వాగ్దానం చేస్తున్నాడు. యేసే శక్తికి మూలం, జీవితానికి పునాది. ఆయన మనల్ని తన వాక్యం వద్దకు తీసుకొనివచ్చి వ్యాధిగ్రస్తమైన మన ఆత్మలకు స్వస్తతకూర్చే జీవ వృక్షపు ఆకులు మనకు ఇస్తాడు. మనల్ని దేవుని సింహాసనం వద్దకు నడిపించి మనల్ని మరింత దగ్గరచేసే ప్రార్థనకు మాటల్ని మన నోటికందిస్తాడు. పరలోకంలోవున్న మిక్కిలి శక్తివంతమైన సాధనాల్ని మనకోసం వినియోగిస్తాడు. మనం అడుగడుగునా ఆయన సజీవ శక్తిని స్పృశిస్తాం. “దేవుని విషయమైనAATel 341.3

    జ్ఞానమందు అభివృద్ధి” పొందాలని కోరుకునే వారి పురోగతికి దేవుడు పరిమితులు నియమించడు. వారు ప్రార్థన ద్వారా, అప్రమత్తత ద్వారా, జ్ఞానం అవగాహన విషయంలో పెరుగదలద్వారా ” ఆయన మహిమ శక్తి నిబట్టి సంపూర్ణ బలముతో బలపర్చబడ” వలసి ఉన్నారు. ఈ రీతిగా ఇతరులకోసం పనిచేయటానికి వారు శిక్షణ పొందుతారు. పవిత్రత, పరిశుద్ధత పొందిన మానవులు తన సహాయకులు కావాలన్నది రక్షకుని సంకల్పం “తేజోవాసులైన పరిశుద్దుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసి.... మనలను అంధకార సబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవారసులనుగా” చేసిన దేవునికి ఈ గొప్ప ఆధిక్యత నిమిత్తం కృతజ్ఞతలు తెలపాలి.AATel 341.4

    కొలొస్సయులికి రాసిన ఉత్తరం లాగే ఫిలిప్పీయులికి రాసిన ఉత్తరం కూడా రోములో చెరసాలలో ఉన్నప్పుడే పౌలు రాశాడు. ఫిలిప్పీలోని సంఘం “నా సహోదరుడును, జతపనివాడును, నాతోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపకరించువాడు” అని పౌలు అన్న ఎపఫ్రాదితుతో పౌలుకు కానుకలు పంపింది. రోములో ఉన్నప్పుడు ఎపఫ్రాదితు జబ్బుపడి “చావునకు సిద్ధమైయుండెను గాని దేవుడతనిని కనికరించెను” అని ఇంకా “అతని మాత్రమేగాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను” అని పౌలు రాశాడు. ఎపఫ్రాదితుకు జబ్బు చెయ్యటాన్ని గురించి విన్న ఫిలిప్పీ విశ్వాసులు అతణ్ని గురించి ఆందోళన చెందారు. అతడు తిరిగివారి వద్దకు వెళ్ళిపోవాలని తీర్మానించుకున్నాడు. అతణ్ని గురించి పౌలు పిలిప్పీ సంఘానికి ఇలా రాశాడు, “అతడు రోగియాయెనని మీరు వినిరి గనుక అతడు మిమ్మునందరిని చూడమిగుల అపేక్షగలవాడై విచారపడుచుండెను.... కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా యెడల ఈ ఉపచర్యతో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై యుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.”AATel 342.1

    ఫిలిప్పీయులికి ఎపఫ్రాదితుతో పౌలు ఒక ఉత్తరం పంపించాడు. వారు తనకు పంపిన కానుకల గురించి వారికా ఉత్తరంలో వందనాలు చెప్పాడు. తన పోషణ నిమిత్తం పౌలుకి ఆర్ధిక సహాయం అందించే సంఘాలన్నిటిలో ఫిలిప్పీ సంఘానిది పై చెయ్యి. తన ఉత్తరంలో అపొస్తలుడిలా అన్నాడు,” ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని నాకే తెలియను. ఏలయనగా థెస్సలొనీకలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదుగాని ఈ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునై యున్నగుణములై యున్నవి.AATel 342.2

    “మన తండ్రియగు దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, మీలో ఈ సత్ క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించు నని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థన చేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనునప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకములయందును, నేను సువార్త పక్షమున వాదించుట యందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరును ఈ కృపలో నాతో కూడా పాలివారైయున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొనియున్నాను. ఇందుచేత మిమ్మునందరిని గూర్చి ఈలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి... నా ప్రేమ తెలివితోను, సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు వారు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనినవారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్ధించుచున్నాను.”AATel 342.3

    పౌలు చెలసాలలో ఉన్న కాలంలో దేవుని కృప అతణ్ని బలపర్చి శ్రమలు కష్టాల్లో సంతోషించటానికి అతనికి శక్తినిచ్చింది. తాను చెరసాలలో బందీగా ఉండటం సువార్త వ్యాప్తికి దోహదపడిందంటూ తన ఫిలిప్పీయ సహోదరులకు విశ్వాసంతోను నిశ్చితితోను పౌలు రాశాడు. పౌలిలా అన్నాడు, “సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలుటకే సమకూడెనని వారు తెలిసికొనగోరుచున్నాను. ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేవలోని వారికందరికిని తక్కిన వారికందరికిని సృషమాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి”.AATel 343.1

    పౌలుకు కలిగిన ఈ అనుభవంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. ఎందుకంటే దేవుడు పనిచేసే తీరును అది మనకు వెల్లడిచేస్తుంది. మనకు గొప్ప ఇబ్బందిగాను పరాజయంగాను కనిపించే పరిస్థితి నుంచి ప్రభువు విజయం చేకూర్చగలడు. కనిపించని వాటిని విశ్వాస నేత్రంతో చూసే బదులు కనిపించే వాటినే చూస్తూ మనం దేవుని మర్చిపోయే ప్రమాదంలో ఉన్నాం. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మనపట్ల క్రూరంగా ఉన్నాడని నిందిస్తాం. ఒకపనిలో మనకు నిపుణత లేకుండా చెయ్యడం సమంజసమని ఆయన తలస్తే అది మన మంచికే చేస్తున్నాడని ఆలోచించకుండా మనం దుఃఖించి ప్రళాపిస్తాం. శిక్షించటం ఆయన ప్రణాళికలో ఒక భాగమని, క్రైస్తవుడు క్రియాశీలంగా సేవ చేస్తున్నప్పటికన్నా శ్రమలనుభవిస్తున్నప్పుడు ప్రభువుకు ఎక్కువ సేవ చేయటం సాధ్యమని మనం తెసుకోటం అవసరం.AATel 343.2

    “ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు. గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు ఆయన ఆకారమునందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన” క్రీస్తును పిలిప్పీయులకు పౌలు క్రైస్తవ జీవితంలో ఆదర్శంగా సమర్పించాడు.AATel 344.1

    పౌలు ఇంకా ఇలా అన్నాడు. “కాగా నా ప్రియులారా, మీరెప్పుడును విధేయులై యున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరియెక్కువగా నేను మీతో లేని యీకాలమందును, భయముతోను, వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా వారు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసి కొనుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై నాలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేతపట్టుకొని, లోకమందు జ్యోత్యులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్ధముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయకారణము కలుగును.”AATel 344.2

    రక్షణకు కృషిచేస్తున్న ప్రతీ ఆత్మకు సహాయపడేందుకు ఈ మాటలు నమోదయ్యాయి. సంపూర్ణత ప్రమాణాన్ని ఉన్నతంగా నిలిపి దాన్ని ఎలా చేరగలమో పౌలు చూపిస్తున్నాడు. “మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి” ఎందుకనగా.... మిలో కార్యసిద్ధి కలుగుజేయువాడు దేవుడే” అంటున్నాడు.AATel 344.3

    రక్షణ సంపాదించటమన్నది భాగస్వామ్యంతో కూడినపని. అది నమ్మడి చర్య. పశ్చాతపుడైన పాపికి దేవునికి మధ్య సహకారం అవసరం. ప్రవర్తనలో సరైన సూత్రాలు ఏర్పడటానికి ఇది అవసరం. పరిపూర్ణత సాధనకు అడ్డుతగిలే ప్రతిబంధకాల్ని అధిగమించటానికి మానవుడు చిత్తశుద్ధితో కృషిచెయ్యాలి. అయితే విజయసాధనకు మానవుడు దేవుని మీద సంపూర్తిగా ఆధారపడాలి. కేవలం మానవ ప్రయత్నమే చాలదు. దైవ శక్తి లేకుండా మానవ ప్రయత్నం వ్యర్థం. దేవుడు మానవుడు ఇద్దరూ పనిచేయాలి. శోధనను ప్రతిఘటించటం మానవుడు చేయాల్సిన పని. ఆ పనికి మానవుడు దేవుని వద్దనుంచి శక్తి పొందాలి. ఒక పక్క అనంత వివేకం, కారుణ్యం, మరోపక్క బలహీనత, పాపస్థితి. నిస్సహాయత ఉన్నాయి.AATel 344.4

    మనపై మనకు పూర్తి నిగ్రహం ఉండాల్సిందిగా దేవుడు కోర్తున్నాడు. అయినా మన అనుమతి సహకారం లేకుండా ఆయన మనకు సహాయం చెయ్యలేగ.. మానవుడిలో ఉన్న మానసిక, ఇతరత్రా శక్తులద్వారా దేవుని ఆత్మ పనిచేస్తాడు. ఉద్దేశ్యాల్ని, కోర్కెల్ని, అభిరుచుల్ని మనంతట మనమే దేవుని చిత్తానికి అనుగుణంగా మల్చుకోలేము. అయితే మనం “సిద్దమనసు కలిగి ఉండేందుకు ఇష్టపడితే” “వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి” రక్షకుడు ఈ కార్యాన్ని మనకోసం సాధిస్తాడు. 2 కొరింథీ 10:5.AATel 344.5

    బలమైన సౌష్టవమైన ప్రవర్తనను నిర్మించుకోవాలని కోరుకొనే వ్యక్తి, సమతౌల్య మైన క్రైస్తవుడుగా జీవించాలని ఆశించే వ్యక్తి క్రీస్తు నిమిత్తం అంతా ఇవ్వాలి. క్రీస్తు నిమిత్తం అంతా చెయ్యాలి. రక్షకుడు పాక్షిక సేవను అంగీకరించడు. ఆత్మార్పణ అంటే ఏంటో అతడు దినదినం నేర్చుకోవాలి. దైవ వాక్యాన్ని పఠించి దాని అర్ధాన్ని గ్రహించి అందులోని ధర్మశాసనాల్ని ఆచరించాలి. అతడు ఇలా ఉత్తమ క్రైస్తవ జీవన ప్రమాణాన్ని చేరగలుగుతాడు. రోజుకు రోజు దేవుడు అతనితో పనిచేసి చివరి పరీక్షకు నిలిచే ప్రవర్తననను రూపు దిద్దుతాడు. మనుషులముందు దేవుని దూతల ముందు ఉదాత్తమైన పరిశోధనను నిర్వహించి, పడిపోయిన మానవులకు సువార్త ఏమి చేస్తుందో విశ్వాసి ప్రదర్శిస్తూ ఉంటాడు.AATel 345.1

    పౌలు ఇలా రాశాడు, “నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరిపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమాన మును పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను.”AATel 345.2

    పౌలు చాలా పనులు చేశాడు. క్రీస్తును తన ప్రభువుగా స్వీకరించిన నాటినుంచి అతని జీవితం అవిశ్రాంత సేవతో నిండింది. సిలువ ఉదంతాన్ని చెబుతూ పట్టణాలకు, వివిధ దేశాలకు ప్రయాణించి అనేకమందిని క్రైస్తవుల్ని చేసి సంఘాలు స్థాపించాడు. ఈ సంఘాలపై నిత్యం శ్రద్ధాసక్తులు చూపించాడు. ఉపదేశంతో నిండిన ఉత్తరాలెన్నో ఈ సంఘాలకు రాశాడు. దినవారీ ఆహారం నిమిత్తం కొన్నిసార్లు తన వృత్తి విద్యను ఆచరణలో పెట్టి పనిచేసేవాడు. అయినా పౌలు తన గురిని అనగా దేవుని ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానం కోసం పరుగెత్తటం ఎన్నడూ విస్మరించలేదు. అతడు నిత్యం ఒక లక్ష్యాన్ని ముందుంచుకున్నాడు. అది దమస్కు పట్టణం గుమ్మం వద్ద తన్నుతాను ప్రత్యక్షపర్చుకున్న ఆ ప్రభువుకు నమ్మకంగా ఉండటమన్న లక్ష్యం. ఈ లక్ష్యం నుంచి పౌలు దృష్టిని ఏదీ మరల్చలేకపోయింది. కల్వరి సిలువను ఉన్నతంగా ఎత్తటమే పౌలు షరమోద్దేశం. అతని మాటలకు కార్యాలకు స్ఫూరినిచ్చింది అదే.AATel 345.3

    కష్టాలు శ్రమల నడుమ ముందుకు సాగటానికి పౌలును ఒత్తిడి చేసిన మహా కర్తవ్యం ప్రతీ క్రైస్తవ కార్యకర్తను దేవుని సేవకు తన్నుతాను అంకితం చేసుకోటానికి నడిపించాలి. అతడి దృష్టిని రక్షకుని పై నుంచి మరల్చటానికి లోకాకర్షణలు వినోదకేళీలతో అతణ్ని ప్రలోబ పెట్టటం జరుగుతుంది. అయినా అతడు గురివద్దకే పరుగెత్తుతూ, దేవుని ముఖం వీక్షించటమన్న నిరీక్షణతో పోల్చితే దాన్ని సాధించటానికి ఎంతటి శ్రమ అయినా ఎంతటి త్యాగమైన లెక్కలోకి రాదని ప్రపంచానికి, దూతలకు, మనుషులికి చాటి చెప్పుతాడు.AATel 345.4

    తాను ఖైదీగా ఉన్నప్పటికీ సౌలు అధైర్యపడలేదు. చెప్పాలంటే రోమునుంచి అతడు సంఘాలకు రాసిన ఉత్తరాల్లో విజయమే ధ్వనించింది. ఫిలిప్పీయులికి ఇలా రాశాడు, “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి; మరల చెప్పుదును ఆనందించుడి.... దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా నా విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పెనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి.”AATel 346.1

    “కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును..... ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక.”AATel 346.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents