Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    35—కోరహు తిరుగుబాటు

    ఇశ్రాయేలీలయుల మీదికి దేవుడు పంపించిన శిక్షలు వారి సణుగుళ్లను, అవిధేయతను కొంతకాలం నిరోధించటానికి తోడ్పడ్డాయి. కాని వారి హృదయంలో తిరుగుబాటు స్వభావం కొనసాగి చేదు ఫలాలు ఫలించింది. లోగడ చోటు చేసుకున్న తిరుగుబాటులు, ప్రజలు ఉద్రేకాలతో రెచ్చిపోయినందువల్ల రేగిన గలాటాలే. ఇప్పుడైతే వారు తీవ్రమైన కుట్రకు పాల్పడ్డారు. దేవుడు. నియమించిన నాయకుల్నే గద్దె దించటానికి కృతనిశ్యయంతో ఉన్నారు.PPTel 388.1

    ఈ తిరుగుబాటు ఉద్యమంలో ప్రధాన పాత్రదారి కహాతు వంశీయుడైన లేవీయుడు, మోషే దాయాది. అతడు సమర్ధతలు, మంచి పలుకుబడి ఉన్నవాడు. గుడార సేవలకు నియమితుడైనా అసంతృప్తితో ఉన్నాడు. ప్రతిష్టాత్మకమైన యాజకత్వాన్ని అభిలషించాడు. లోగడ కుటుంబంలోని జ్యేష్ఠ పుత్రుడికి సంక్రమించిని నాయకత్వం అహరోనుకీ, అతడి కుమారులకీ అనుగ్రహించటం అతడి అసూయకు, అసంతృప్తికీ కారణం. కొంతకాలంగా కోరహు మోషే, అహరోనులపట్ల అంతర్గతంగా వ్యతిరేకతను పెంచుకొన్నాడు.. దాన్ని బయలటకు కనబడనియ్యలేదు. చివరికి పౌర సంబంధిత అధికారాన్ని, మత సంబంధమైన అధికారాన్ని రెండింటినీ కూలదోయటానికి వ్యూహం రూపొందించుకోన్నాడు. తనకు సహకరించే సానుభూతి పరులు లేకపోలేదు.. గుడారానికి దక్షిణంగా ఉన్న కోరహు, కొహతీయుల గుడారాలకు దగ్గరగా రూబేను గోత్రపు శిబిరం, ఆ గోత్రపు ఇద్దరు ప్రధానులైన దాతాను, అబీ రాముల గుడారాలు ఉన్నాయి. అవి కోరహు గుడారానికి దగ్గరగా ఉన్నాయి. ఈ ప్రధానులు కోరహు పథకాలన్నిటిలోను వెంటనే అతడితో చేతులు కలిపేవారు. యాకోబు జ్యేష్ఠపుత్రుడి సంతానమైన వీరు ప్రజా పరిపాలన తమ హక్కని యాజకత్వ గౌరవాన్ని తాము కోరహుతో కలసి అనుభవించాలని తీర్మానించుకొన్నారు.PPTel 388.2

    ప్రజల మనోగతం కోరహు భావజలానికి మద్దతు పలికింది. తీవ్ర ఆశాభంగానికి గురికావటంతో వారి శంకులు, ఈర్ష్య, ద్వేషం తిరిగి వచ్చాయి. వారు మళ్లీ సహనశీలి అయిన తమ నాయకుడి మీద నిందలు వేయటం మొదలు పెట్టారు. తాము దేవుని నడుపుదల కింద ఉన్నామన్న విసయాల్ని ఇశ్రాయేలీయులు మరచిపోయారు. నిబంధన దూత తమ అదృశ్య నాయకుడని, మేఘస్తంభంలో ఉండి క్రీస్తు సన్నిధి తమ ముందు నడిచిందని, ఆయననుంచే మోషే ఆదేశాలందుకొన్నాడని వారు మరచిపోయారు.PPTel 388.3

    తామంతా అరణ్యలో మరణించాలి అన్న తీర్పును వారు అంగీకరించలేదు. అందుచేత తమను నడిపిస్తున్నది దేవుడు కాదు మో షేయే అని తమ మరణ తీర్మానం చేసిందీ అతడే అని నమ్మటానికి వారు ప్రతీ సాకును అసరాగా తీసుకొన్నారు. లోకమంతటిలోనూ మిక్కిలి సాత్వికుడయిన మోషే ప్రజల మూర్ఖమైన అవిధేయతను తిరుగుబాటును సర్దుమణచటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. లోగడ తమ దుర్మార్గతను ప్రభువు గద్దించిన ఆనవాళ్లు క్షీణించిన తమ సంఖ్యలోను, మరణించిన తమ సభ్యుల సంఖ్యలోను ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నా వారు పాఠం నేర్చుకోలేదు. మళ్లీ శోధనకు లోంగిపోయారు.PPTel 389.1

    ఉద్రేకాలు, ఉద్వేగాలతో ఎగసిపడే ఆ జన సముహానికి నేతగా ఉండటంకంటే గొర్రెల కాపరిగా మోషే జీవించిన జీవితం ఎంతో ప్రశాంతంగాను, అనందమయంగాను ఉండేది. అయినా ఎంపిక చేసుకొనే శక్తి మోషేకి లేదు. కాపరి కొంకి కర్రను మారుగా అధికార దండం అతడి చేతిలో పెట్టాడు దేవుడు. ఆయన తీసివేసేవరకు మోషే దాన్ని కింద పెట్టకూడదు.PPTel 389.2

    హృదయ రహస్యాల్ని ఎరిగిన ఆ ప్రభువు కోరహు అతడి అనుచరుల ఉద్దేశాలేంటో గ్రహించి వారి కుతంత్రాల్ని పసిగట్టి వాటినుంచి తప్పించుకోనేందుకుగాను తన ప్రజలకు అవసరమైన ఉపదేశం అందించాడు. అసూయ పెంచుకొని మిర్యాము మోషే పై ఫిర్యాదులు చేసినప్పుడు ఆమెకు ఏమి సంభవించిందో వారు కన్నులారా చూశారు. మోషే ప్రవక్త కన్నా అధికుడని ప్రభువు ప్రకటించాడు. “ముఖాముఖిగా అతనితో మాటలాడుదును...... కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట లాడుటకు మీరేల భయపడలేదు” అన్నాడు. సంఖ్యా 12:8. ఆ హెచ్చరిక కేవలం మిర్యాము, అహరోనుల్ని ఉద్దేశించి చేసింది కాదు. ఇశ్రాయేలీయులందరినీ ఉద్దేశించి చేసింది.PPTel 389.3

    కోరహు అతడి సహకుట్రదారులు దేవుని శక్తిని ఆయన ఔన్నత్యాన్ని వీక్షించటమన్న ప్రత్యేక అధిక్యతలు పొందిన వ్యక్తులు, మోషేతో పర్వతం మీదికి వెళ్లి దేవుని మహిమను వీక్షించిన వారిలో వీరున్నారు. కాగా అప్పటి నుంచి వీరిలో మార్పు చోటుచేసుకుంది. చిన్నగా ప్రారంభమై రానురాను బలీయమై చివరికి వారి మనసులు సాతాను వశంలో ఉండేంతగా తిరుగుబాటు కార్యంలో నిమగ్నులయ్యే వరకు వారు శోధనతో దోబూచులాడురు. ప్రజల విశాల హితమే ధ్యేయమని చెబుతూ వారు మొదట ఒకరితో ఒకరు గుసగుసలాడి ఆ మీదట తమ అసంతృప్తిని ఇశ్రాయేలు సమాజ నాయకులకు ముట్టించారు. తమ పుల్లవిరుపు మాటల్ని ప్రజలు ఆలకించటంతో వారు మరింత తెగువతో ముందుకు వెళ్ళి తమను నడుపుతున్నది దైవావేశం దైవకార్యం అని నమ్మారు.PPTel 389.4

    సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న రెండువందల ఏబయిమంది ప్రధానుల్ని తమ పక్కకు ఆకర్షించటంలో వారు విజయం సాధించారు. పలుకుబడిగల ఈ నాయకులు మద్దతుతో, మోషే అహరోనుల పరిపాలన పద్ధతిలోను వ్యవహార శైలిలోను గొప్ప మార్పు తెచ్చి ప్రగతి సాధించగలమని భీమాగా ఉన్నారు. అసూయ ఈర్ష్యను పుట్టించింది. ఈ రెండూ ఏకమై తిరుగుబాటును రేపాయి. మోషే అధికారాన్ని అతనికున్న గౌరవ స్థానాన్ని గూర్చి చర్చించుకొన్నారు. అతడు ఉన్నత స్థానాన్ని ఆక్రమించాడని దాన్ని తమలో ఎవరైన సమర్థంగా నిభాయించ గలుగుతారని నిర్ధారించుకొన్నారు. అంతేకాదు. మోషే అహరోనుల తమంతట తామే తమ పదవుల్ని అందిపుచ్చుకొన్నారని ఊహించుకొని తమను తాము వంచించుకోటమే కాదు ఇతరుల్ని కూడా వంచించారు. ఈ నాయకులు తమ్మును తాము ప్రభువు సమాజానికి పైగా హెచ్చించుకొన్నారని, యాజకత్వాన్ని ప్రజాపరిపాలనను హస్తగతం చేసుకొన్నారని, ఇశ్రాయేలు సమాజంలో వారి గోత్రం తక్కిన గోత్రాల కన్నా ఎక్కువ గౌరవానికి అర్హమయ్యింది కాదని, ప్రజలకన్నా వారు ఏమంత పరిశుద్దులు కారని, దేవుని ప్రత్యేక సముఖం కాపుదల అనుగ్రహం పొందిన తమ సహోదరులతో వారు సమానంగా ఉండటం సరిపోతుందనని అసంతృప్తితో ఉన్న వీరు వాదించారు.PPTel 390.1

    కుట్రదారులు ఇక ప్రజలమధ్య పనిచేయాల్సి ఉన్నారు. తప్పులో ఉండి మందలింపు అవసరమైన వారికి, సానుభూతి ప్రశంసలందుకోటంకన్నా ఎక్కువ ఉత్సాహాన్నిచ్చేది మరోకటి ఉండదు. కోరహు అతడి అనుచరులు ప్రజాదరణను మద్దతును ఈ రకంగా సంపాదించారు. ప్రజల సణుగుడే దేవుని అగ్రహానికి కారణమన్నది పొరపాటని వారు ఉద్ఘాటించారు. సమాజం తన హక్కుల్ని కోరటంలో తప్పు చేయలేదని నొక్కిపలికారు. మోషే కఠినమైన పరిపాలకుడని పరిశుద్ధులైన ప్రజల్ని పాపులని చెప్పి మందలించాడని, అయితే దేవుడు తమ మధ్యనే ఉన్నారని వారు మోషేని విమర్శించారు.PPTel 390.2

    అరణ్యంగుండా తమప్రయాణ చరిత్రను కోరహు సమీక్షించాడు. వారు ఇరుకు దారుల్లో నడవటం, సణగటంవల్ల అవిధేయతవల్ల పలువురు మరణించటం గుర్తు చేశాడు. మోషే వేరే మార్గన్ని అనుసరించి ఉంటే తమకు కష్టాలు సంభవించేవి కాదని అతడి శ్రోతలు పలువురు అభిప్రాయపడ్డారు. తమకు కలిగిన ప్రమాదాలన్నీ మోషే మూలంగానే అని కనానులో తాము ప్రవేశించకపోవటం మోషే అహరోనుల అసమర్థ నాయకత్వం ఫలితమే అని, కోరహు తమ నాయకుడైతే తమ పాపాలనిమిత్తం తమను గద్దించటం కన్నా తమ మంచి పనుల్ని ప్రస్తావించి ఉద్రేక పర్చటం ద్వారా తమ ప్రయాణం శాంతియుతంగా సాగేటట్లు చేస్తాడని అరణ్యంలో అటూ ఇటూ తిరిగే బదుల తాము నేరుగా వాగ్దత్త దేశాన్ని చేరగలుగుతామని భావించారు.PPTel 390.3

    ఈ విద్రోహ చర్య సందర్భంగా సమాజంలోని అసమ్మతి వాదుల మధ్య ముందె న్నడూ లేని సామరస్యం కనిపించింది. తనకున్న ప్రజాదరణ కోరహు ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. మోషే అందిపుచ్చుకొన్న అధికారానికి అడ్డుకట్ట వేయకపోతే ఇశ్రాయేలీ యుల స్వాతంత్ర్యనకే ముప్పువాటిల్లుతుందన్న తన నమ్మకాన్ని అది ధ్రువపర్చింది. దేవుడు ఆ విషయం తనకు ప్రత్యక్షపర్చాడని ఆలస్యం కాకముందే పరిపాలన వ్యవస్థలో మార్పు తేవటానికి దేవుడు తనను ఆదేశించాడని కూడా చెప్పాడు. కాని మోషే మీద కోరహు చేసిన ఆరోపణల్ని చాలామంది నమ్మటానికి సిద్ధంగా లేరు. మోషే సహనంతో త్యాగబుద్దితో చేసిన సేవలు వారి మనస్సుల్లో మెదిలాయి. మనస్సాక్షి వారిని ఆందోళన పర్చింది. అందునుబట్టి ఇశ్రాయేలు ప్రజల పట్ల తన ప్రగాఢ ఆసక్తికి ఏదో బలమైన కారణం చూపించాలి. కనుక తమ ఆస్తుల్ని వేసుకోవాలన్న దురద్దేశంతో తమను అరణ్యంలో చంపటానికి తీసుకువచ్చాడన్న పాత ఆరోపణను లేవనెత్తాడు.PPTel 391.1

    ఈ పనిని కొంతకాలం అతి గోప్యంగా సాగించాడు. ఉద్యమం బహిరంగ ఘర్షణకు చాలినంత బలం పుంజుకొనప్పుడు కోరహు ఆ వర్గానికి నాయకుడిగా అవతరించి మోషే అహరోనులు అధికారిన్ని చేజిక్కించుకొన్నారని బాహాటంగా నిందించటం మొదలు పెట్టాడు. అధికారంలో తనకు తన అనుచరులకు సమానంగా పాలుపంచు కొనే హక్కు ఉన్నదని కోరహు సూచించాడు. ఇంకా ప్రజలు తమ స్వేఛ్చను స్వాతంత్రాన్ని కోల్పోయారని విమర్శించాడు. కుట్రదారులిలా అన్నారు “మీతో మాకిక పనిలేదు. ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనచున్నారు.? PPTel 391.2

    ఇలాంటి కుటిలమైన కుట్ర జరుగుతందని మోషే అనుమానించలేదు. అది వెలుగులోకి వచ్చినప్పుడు దేవుని ముందు సాగిలపడి ఆ విషయన్ని ఆయనకు చెప్పు కొన్నాడు. దు:ఖంతో పైకి లేచాడు. అయినా ప్రశాంతంగా సేర్యంగా ఉన్నాడు. అతడుదేవుని అనుగ్రహం పొందాడు. ఆయనే అతడికి మార్గనిర్దేశం చేశాడు. ‘తనవాడు ఎవడో పరిశుద్దుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసివానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచు కొనినవానిని తన యొద్దకు చేర్చుకొనెను” అన్నాడు. అందరూ ఆలోచించుకోటానికి వ్యవధి ఉండేందుకుగాను ఆ పరీక్షను మరుసటి ఉదయానికి ఏర్పాటు చేశాడు. యాజకత్వాన్ని ఆశించేవారు తమ తమ ధూపారులు పట్టుకొని సమాజం సమక్షంలో గుడారంలో ధూపం వేయల్సి ఉంది. పవిత్రమైన ఆ సేవకోసం అభిషేకం పొందినవారు మాత్రమే గుడారంలో సేవలు చెయ్యాలి అన్నది విస్పష్టమైన నిబంధన. దైవాజ్ఞకు విరుద్ధంగా “అన్యాగ్ని” అర్పించినందువల్ల యాజకులై నాదాబు, అబీహులు నాశనమయ్యారు. అంత ప్రమాద భరితమైన విజ్ఞప్తికి పూనుకొంటే ఆ విషయం దేవుని ముందు పెట్టవలసిందిగా మోషే తన ప్రత్యర్థుల్ని కోరాడు.PPTel 391.3

    కోరహాను అతడి సోదర లేవీయుల్ని ప్రత్యేకించి వారితో మోషే ఇలా అన్నాడు. “తనమందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీ యుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్ను నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరిని చేర్చుకొనెనుగదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల?” PPTel 392.1

    దాకౌను అబీరాములు కోరహులా ధైర్యంగా నిలబడలేదు. పూర్తిగా భ్రష్టులు కాకపోయినా వారు ఈ కుట్రలోకి ఆకర్షితులయ్యారేమో అనుకొని తన మీద వారికున్న ఆరోపణల్ని వినగోరి వారిని రమ్మని మోషే కబురు చేశాడు. వారు రాలేదు సరిగదా సమాజమంతా వింటుండగా ఇలా అన్నారు. “ఈ అరణ్యమలో మమ్మును తీసికొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకును నీ కధికార కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొని రాలేదు. పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మా కియ్యలేదు. ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము”.PPTel 392.2

    తాను వాగ్దానం చేసిన దేశాన్ని వర్ణించటానికి దేవుడు ఉపయోగించిన పద బంధాల్ని వారు ఈ విధంగా దాసత్వ దృశ్యాన్ని వర్ణించేందుకు ఉపయోగిస్తున్నారు. తన అధికారాన్ని స్థిరపర్చుకోటానికి తాను దేవుని నడుపుదలకింద వ్యవహరిస్తున్నట్లు మోషే నటిస్తున్నాడని ఆరోపించారు. తన స్వార్థ ప్రయోజానాల్ని అనుసరించి ఒకసారి కనానుకేసి ఒకసారి అరణ్యంలోకి మోషే తమను నడిపిస్తే గుడ్డిగా వెళ్లటానికి తామిక సిద్ధంగా లేమని ప్రకటించారు. తమ పట్ల ప్రేమానురాగాలు గల తండ్రిగా, సహనశీలి అయిన కాపరిగా మసులుకొంటూ వచ్చిన అతణ్ని కర్కోటకుడుగాను, అక్రమపాలకుడు గాను చిత్రించారు. తమ పాపాలకు శిక్షగా వారికి కనాను ప్రవేశం లభించకపోతే దానిక మో షెనే కారణమని నిందిచారు.PPTel 392.3

    ప్రజలు కుట్రదారుల్నే ఎక్కువ అభిమానించినట్లు కనిపించింది. అయినా మోషే తనను తాను సమర్ధించుకోటానికి ప్రయత్నించలేదు. తన పవిత్ర ఉద్దేశాలకు నీతివంతమైన తన ప్రవర్తనకు సమాజం సముఖంలో సాక్షిగా ఉండమంటూ దేవుని కోరాడు మోషే, తనకు న్యాయధిపతిగా ఉండాల్సిందిగా ఆయనను విజ్ఞప్తి చేశాడు. మరుసటి ఉదయం కోరహునాయకత్వం కింద ఆ రెండువందల ఏభైమంది ప్రదానులు ధూపారులు పట్టుకొని ప్రత్యక్షమైయ్యారు. వారు గుడారం అవరణంలో సమావేశ మయ్యారు. ఆ పరీక్ష ఫలితాల్ని తెలుసుకోటానికి ప్రజలు ఆవరణం బైట గుమిగూడి ఉన్నారు. కోరహు అతడి సహచరుల ఓటమిని చూసేందుకు సమావేశం కండని మోషే ప్రజల్ని ఆదేశించలేదు. అయితే ఆ తిరుగుబాటు దార్లే తమ గుడ్డి విశ్వాసంతో తమ విజయాన్ని వీక్షించండంటూ ప్రజల్ని ఆహ్వానించారు. ఆ జన సముహంలో చాలామంది కోరహు పట్ల బహిరంగంగా సానుభూతి కనపర్చారు. అహరోనును విమర్శిస్తున్న కోరహుకి విజయం లభిస్తుందని భీమాగా ఉన్నాడు.PPTel 393.1

    దేవుని సముఖంలో వారలా సమావేశమైనప్పుడు “యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను.” అంతట మోషే అహరోనుల్ని దేవుడిలా ఆదేశించాడు, “మీరు ఈ సమాజములోనుండి అవతలికి వెళ్ళుడి. క్షణములో నేను వారిని కాల్చివేయుదును” అయితే వారిరువురూ నేలపై సాగిలపడి “సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపము చేసినందున ఈ సమస్త జనము మీద నీవు కోపపడుదువా?” అని ప్రార్థించారు. దాతాను, అభీరాముల్ని కలవటానికి కోరహు సమావేశం విడిచి పెట్టి వెళ్ళిపోయాడు. తనతో సమావేశమవ్వటానికి నిరాకరించిన వారికి చివరి హెచ్చరిక ఇవ్వటానికిగాను వారిని కలవటానికి మోషే డెబ్బయిమంది పెద్దలతో కలిసి వెళ్లాడు. ప్రజలు వారి వెంట వెళ్లారు. తన వర్తమానం ప్రకటించక ముందు, దైవాదేశం మేరకు మోషే ప్రజల్ని ఇలా ఆదేశించాడు. “ఈ దుష్టుల గుడారముల యొద్దనుండి తొలగి పోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగిన దేదియు ముట్టకుడి” ఈ ఆదేశాన్ని అందరూ పాటించారు. తమ పైకి రానున్న తీర్పును గూర్చిన భయం వారందరిలోను ఉన్నది. తాము వంచించిన ప్రజలు తమను వదిలివేసినట్లు ప్రధాన తిరుగుబాటుదార్లు గుర్తించారు. అయినా వారిలో చలనం కలిపించలేదు. దైవాదేశాన్ని ధిక్కరిస్తున్నట్లు తమ కుటుంబాలతో సహా తమ తమ గుడార ద్వారాల్లో నిలబడి ఉన్నారు.PPTel 393.2

    సర్వసమాజం వింటుండగా ఇశ్రాయేలు దేవుని నామంలో మోషే ఈ విధంగా ప్రకటించాడు. “ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలిసికొందురు. మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణమును వీరు పొందిన యెడల సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగిన యెడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచినవారిని వారికి కలిగిన సమస్తమును మ్రింగివేసిన యెడల వారు యెహోవాన అలక్ష్యము చేసిరని మీకు తెలియును”.PPTel 394.1

    ఆ ఘటనకోసం భయంతో కని పెడ్తున్న ఇశ్రాయేలు ప్రజల దృష్టి మోషేపై నిలిచింది. మోషే మాట్లాడటం ముగిసిన తర్వాత భూమి బద్దలయ్యింది. తిరుగుబాటు దారులు అందులో కూరుకుపోయారు. వారి సమస్తం వారితోపాటు నాశనమయ్యింది. “వారు సమాజములో ఉండకుండ నశించిరి”. ప్రజలు అక్కడనుంచి పారిపోయారు. ఆ పాపంలో పాలిభాగస్తులుగా తమ్మును తాము నిందించుకొంటూ పారిపోయారు.PPTel 394.2

    కాని దేవుని తీర్పులు మాత్రం అంతం కాలేదు. మేఘంలోనుంచి అగ్నివచ్చి ధూపం అర్పించిన రెండువందల ఏభైమంది ప్రధానుల్నీ దహించి వేసింది. వీరు తరుగుబాటులో మొదటివారు కాదు. అందువల్ల వారు ప్రధాన కుట్రదారులతో నాశనమవ్వలేదు. వారి నాశనాన్ని చూసి పశ్చాత్తాపం పొందే అవకాశం వారికి లభించింది. కాని వారు తిరుగుబాటుదారుల పట్ల సానుభూతి చూపించారు. వారి శిక్షను కూడా పంచుకొన్నారు.PPTel 394.3

    మోషే ఇశ్రాయేలీయులో విజ్ఞాపణ చేస్తున్న తరుణంలో సైతం వస్తున్న నాశనం నుంచి తప్పించుకోటానికి కోరుహా, అతడి అనుచర్లు పశ్చాత్తాపపడి క్షమాభిక్ష వేడుకొన్నట్లయితే దేవుని తీర్పులు వారిమీదికి రాకుండా ఆగిపోయేవి. వారు తమ మూర్ఖత్వంలో కొనసాగటంవల్లనే వారికి నాశనం సంభవించింది. వారి అపరాధంలో ఇశ్రాయేలు సర్వసమాజం పాలుపంచుకొన్నది. ఎందుచేతనంటే అందరూ వారిపట్ల కొదోగొప్పో సానుభూతి వ్యక్తం చేశారు. అయినా కృపగల దేవుడు తిరుగుబాటు నాయకులకు వారు తప్పుదారి పట్టించిన ప్రజలకు మధ్యతేడా కనపర్చాడు. మోసంలో పడ్డ ప్రజలు పశ్చాత్తాపపడటానికి తరుణమిచ్చాడు తమది తప్పు మోషేది ఒప్పు అనటానికి నిదర్శనం కోకొల్లలుగా ఉంది. దేవుని శక్తి ప్రదర్శనతో సందేహమంతా తొలగిపోయింది.PPTel 394.4

    హెబ్రీయులకు మందు నడిచిన దూత యేసే. నాశనం కాకుండా వారిని కాపాడటానికి ఆయన ప్రయత్నించాడు. క్షమాపణకు వారికింకా తరుణమిచ్చాడు. దేవుని తీర్పులు వారికి అతిసమీపంగా వచ్చాయి. పశ్చాత్తాపపడమంటూ అవి విజ్ఞాపన చేశాయి. వారి తిరుగుబాటును పరలోకంనుంచి వచ్చిన ప్రత్యేకమైన, ప్రతిఘటించ వీలులేని శక్తి ఆపుచేసింది. దేవుడు ప్రదర్శిస్తున్న కృపకు ఇప్పుడు వారు అనుకూలంగా స్పందిస్తేవారికి నాశనం తప్పుతుంది. కాగా నాశనమైపోతామన్న భయంతో వారు ఆ తీర్పులనుంచి పారిపోతున్నారేగాని వారి తిరుగుబాటు మనసులు మారలేదు. ఆ రాత్రి వారు తమ గుడారాలకు భయభ్రాంతులై తిరిగి వచ్చారే తప్ప మారిన మనస్సులతో కాదు.PPTel 394.5

    కోరహు, అతడి అనుచర్లు ప్రజల్ని ఉబ్బించి ఊరించారు. తాము నిజంగా మంచివారమని తమను మోషే వంచించాడని వారిని నమ్మించారు. కోరహాది తప్పు మార్గం మో షేది సత్యమార్గం అని వారు ఒప్పుకొంటే అప్పుడు తాము అరణ్యంలో మరణించాలి అన్నది దేవుని తీర్పుగా వారు అంగీకరిచాల్సి వస్తుంది. ఆ తీర్పును అంగీకరించటానికి వారు సిద్ధంగా లేరు. అందుకు తమను మోషే మోసగించాడని నమ్మటానికి ప్రయత్నించారు. గద్దింపు బదులు ప్రశంస, ఆందోళన సంఘర్షణలు బదులు సుఖశాంతులు వర్థిల్లే నూతన శకం ప్రారంభం కానున్నదని వారు ఆశతో ఎదురు చూశారు. నాశనమైన వ్యక్తులు పొగడ్తమాటలు మాట్లాడి వారి పట్ల గొప్ప ప్రేమాసక్తులున్నట్లు చెప్పారు. కోరహా అతడి అనుచర్లు మంచివారని వారి నాశనానికి మో షేనే హేతువని ప్రజలు నమ్మారు.PPTel 395.1

    తమ రక్షణ నిమిత్తం దేవుడు ఉపయోగించే సాధనాల్ని మానవులు తృణీకరించటం కన్నా గొప్ప అవమానం ఆయనకు ఇంకేదీ ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు ఇది చేయట మేకాదు మోషే అహరోనుల్ని చంపటానికి ప్రయత్నించారు. అయినా తమ నీచ పాపం నిమిత్తం దేవుని క్షమాభిక్ష వేడుకోటం అవసరమని గుర్తించలేదు. కృప ఇంకా అందు బాటులో ఉన్న ఆ రాత్రి పశ్చాత్తాపంతోను తమ పాపాన్ని ఒప్పుకోటంలోనూ వారు గడపలేదు. పైగా తాము ఘోరపాపాతులని కనపర్చే నిదర్శనల్ని మసిపూసి మారేడుకాయ చేయటానికి ప్రయత్నించారు. దేవుడు నియమించిన వ్యక్తుల పట్ల ఇంకా ద్వేషాన్ని ప్రదర్శించి వారి అధికారాన్ని ప్రతిఘటించటానికి పూనుకొన్నారు. సాతాను వారికి దుర్బుద్ధి పుట్టించి వారిని నాశనానికి నడిపించటానికి పొంచి ఉన్నాడు.PPTel 395.2

    భూగర్భంలోకి కూరుకుపోయిన దుష్టుల కేకలకు ఇశ్రాయేలీయులందరూ భయందోళనలతో పారిపోయారు. “భూమి మనలను మ్రింగివేయునేమో అనుకొనుచు” వారు పారిపోయారు. “మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపి తీరతారని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను”. వారు తమ నాయకులైన మోషే అహరోనుల పై దౌర్జన్యం చేయటానికి సిద్ధమయ్యారు. PPTel 395.3

    గుడారం పై మేఘంలో దేవుని మహిమ కనిపించింది. ఆ మేఘంలోనుంచి ఒక స్వరం మోషే అహరోనులో ఇలా అన్నది. “మీరు ఈ సమాజము మధ్యనుండి తొలగిపోవుడి. క్షణములో నేను వారిని నశింపజేయుదును”.PPTel 396.1

    మోషే పై పాపదోషిత్వం లేదు. అందచేత అతడు భయపడలేదు. నాశనమవ్వటానికి ఆ సమాజాన్ని విడిచి పెట్టి వెళ్ళలేదు. ఆ గడ్డు సమయంలో తాను సంరక్షిస్తున్న మందపట్ల ఆసక్తి చూపించే యధార్ధ కాపరిగా మోషే వారితో ఉండిపోయాడు. తాను ఎన్నుకొన్న జనుల్ని తన ఉగ్రత పూర్తిగా నాశనం చేయరాదని దేవునితో విజ్ఞాపన చేశాడు. తన విజ్ఞాపన వల్ల ప్రతీకారచర్యను ఆపగలిగాడు. అవిధేయులు, తిరుగుబాటు దారులు అయిన ఇశ్రాయేలీయులు పూర్తిగా, అప్పుడు నాశనం కాబోవటంలేదు.PPTel 396.2

    అయితే ఆగ్రహ చర్య నిర్వహించే దూత బయల్దేరి పోయాడు. తెగులు చంపటం ప్రారంభించింది. తమ్ముడు మోషే అదేశం మేరకు అహరోను ధూపార్తి పట్టుకొని “వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము” చేయటానికి సమాజం మధ్యకు త్వరత్వరగా వెళ్ళాడు, “అతడు చచ్చిన వారికిని బ్రదికినవారికిని మధ్యనిలువ బడ్డాడు” ఆ ధూపార్చన పొగ పైకి లేస్తున్న తరుణంలో గుడారంలో మోషే చేస్తున్న ప్రార్థనలు దేవుని వద్దకు చేరుకొన్నాయి. తెగులు ఆగిపోయింది అప్పటికే పద్నాలుగువేల మంది ఇశ్రాయేలీయులు మరణించారు. సణుగుడి తిరుగుబాటుల పర్యవసానానికి అది నిదర్శనం.PPTel 396.3

    యాజకత్వ అహరోను కుటుంబంలో స్థాపితమయ్యిందనటానికి దేవుడు మరికొంత నిదర్శనాన్నిచ్చాడు. దేవుని ఆదేశం మేరకు ప్రతీ గోత్రం ఒక కర్రను తయారుచేసి దానిమీద తమ తమ గోత్రం పేరు రాయల్సి ఉన్నారు. లేవిశ్రీతం కర్రమీద అహరోను పేరు ఉంది. ఆ కర్రల్ని గుడారంలోని “శాసనముల యెదుట” ఉంచారు. కర్ర చిగురించటం, ఆ గోత్రాన్ని ప్రభువు యాజకత్వానికి ఎంపిక చేసుకొన్నాడనటానికి సూచన, మరుసటి ఉదయం “చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి యుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లుగలదాయెను” దాన్ని ప్రజలకు చూపించి అనంతర తరాల వారికి సాక్ష్యంగా దాన్ని గుడారంలో భద్రపర్చటం జరిగింది. యాజకత్వ సమస్యను ఈ అద్భుతకార్యం పరిష్కరించింది. PPTel 396.4

    మోషే అహరోన్లు దైవాధికారం వల్ల మాట్లాడరని ఇప్పుడు విదితమయ్యింది. తారు అరణ్యలోనే మరణించనున్నారన్న అ ప్రియ సత్యన్ని ప్రజలు నమ్మక తప్పింది కాదు. వారు “ఇదిగో మా ప్రాణములు పోయినవి. నశించిపోతిమి మేమందరము నశించిపోతిమి” అన్నారు. తమ నాయకులకు ఎదురు తిరిగి పాపం చేశామని కోరహా అతడి అనుచర్లు పొందిన శిక్ష న్యాయమైందని వారు ఒప్పుకొన్నారు.PPTel 396.5

    పరలోకంలో సాతాను తిరుగుబాటుకు ఏ దుర్బుద్ది దారితీసిందో అదే దుర్బుద్ధి ఒకింత చిన్న రంగస్థలంలో కోరహు తిరుగుబాటుకి బాటలు పరిచింది. గర్వం, దురాశ కారణంగా లూసిఫర్ దైవ ప్రభుత్వం పై ఫిర్యాదు చేసి పరలోకంలో అనాదిగా స్థిరపడి ఉన్న క్రమాన్ని కూలదొయ్యటానికి ప్రత్నించాడు. దేవుడు నియమించిన వ్యక్తుల్ని నిరాకరించటం ద్వారా దేవున్ని నిరాకరించటానికి సాతాను వారిని నడిపించాడు. మోషే అహరోన్ల మీద సణగటం ద్వారా ప్రజలు దేవదూషణకు పాల్పడ్డారు. అలా వ్యవహరించటంలో తాము నీతిమంతులమని భావించటం తమ పాపాల్ని ఖండించి మందలించిన వారు సాతాను కార్యకర్తలని పరిగణించటం అన్న మోసంలో పడ్డారు.PPTel 397.1

    కోరహా నాశనానికి పునాదులు వేసిన పాపాలు ఇంకా కొనసాగటం లేదా? గర్వం, దురాశ విశ్వవ్యాప్తమయ్యాయి. ఇవి ప్రబలినప్పుడు, అసూయ ప్రాబల్యానికి పోరాటం పెచ్చు పెరుగుతాయి. మనుషుడు దేవుని విడిచి పెట్టి సాతానుకి చేరువవుతాడు. పలువురు క్రీస్తు అనుచరులమని చెప్పుకొనేవారు సైతం కోరహా అతడి అనుచరులకు మల్లే తమ్మును తాము హెచ్చించుకోటానికి ఆలోచనలు చేసి ప్రణాళికలు వేసి తీవ్రంగా కృషి చేస్తారు. ప్రజల సానుభూతి మద్దతు పొందటానికి సత్యాన్ని వక్రీకరించి దైవ సేవకులపై నిందలు మోపి అబద్ద ప్రచారం చేస్తారు. తమ హృదయాల్లోని స్వార్థ దురుద్దేశాల్ని సయితం వారికి ఆపాదించటానికి సిద్ధంగా ఉంటారు. వాస్తవానికి విరుద్ధంగా అబద్దాన్ని పదే పదే పలకటం ద్వారా అదే సత్యమని నమ్మే స్థితికి వస్తారు. దేవుడు నియమించిన నాయకులపై ప్రజల నమ్మకాన్ని నాశనం చేయటానికి కృషి చేయటం ద్వారా తాము మంచి పనిచేస్తున్నామని, నిజంగా దేవుని సేవ చేస్తున్నామని నమ్ముతారు.PPTel 397.2

    హెబ్రీ ప్రజలు దేవుని ఆదేశాల్ని ఆంక్షల్ని పాటించటానికి సుముఖంగా లేరు. కట్టుబాట్లు పాటించటానికి, మందలింపును స్వీకరించటానికి సమ్మతంగా లేరు. వారు మో షేకి వ్యతిరేకంగా సణుగుకోటానికి హేతువిదే. తమ ఇష్టానుసారంగా ప్రవర్తించటానికి విడిచి పెట్టి ఉంటే తమ నాయకుడి గురించి వారికి ఎలాంటి ఫిర్యాదులూ ఉండేవి కాదు. సంఘ చరిత్ర పొడవునా దేవుని ప్రజలు ఇదే స్వభావాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు.PPTel 397.3

    మసుషులు తమ పాపప్రవర్తన ద్వారా తమ మనసుల్లో సాతాను ప్రవేశానికి అవకాశమిస్తారు. అలా దుర్మార్గతలో దశల వారీగా పెరుగుతారు. సత్య విసర్జన వల్ల మనసు మసకబారుతుంది. హృదయం కఠినమౌతుంది. అందుచేత మరింత సృష్టిమైన సత్యాన్ని విసర్జించటమన్న తర్వాత మెట్టుకి పాపి చేరుకోటం సులభమౌతుంది. చివరకు దుర్వర్తనలో మనుషులు స్థిరపడిపోతారు. వారికి పాపం పాపంగా కనిపించదు. దైవ వాక్యాన్ని నమ్మకంగా బోధించే దైవ సేవకుడు అలా తమ పాపాల్ని ఖండించటం చేత వారికి అయిష్టుడవుతాడు. దిద్దుబాటోలో ఇమిడి ఉన్న బాధను త్యాగాన్ని భరించటానికి ఇష్టం లేక దైవ సేవకుడి మందలింపులు అనవసరమైనవి కఠినమైనవి అని అతడి మీద కక్షపూనుతారు. కోరహా మాదిరిగా ప్రజల్లో పొరపాటు లేదని చెబుతారు. పాపాన్ని ఖండించే దైవ సేవకుడే కష్టాలకు కారకుడని నిందిస్తారు. అసూయతో అసంతృప్తితో నిండి ఉన్న వీరు ఈ వంచనతో తమ అంతరాత్మల్ని శాంతపర్చుకొని సంఘంలో విభేదాలు సృష్టించి సంఘ శ్రేయానికి పాటుపడే వారికృషిని దెబ్బతీస్తారు.PPTel 398.1

    తన సేవకు నాయకత్వం వహించటానికి దేవుడు ఎంపిక చేసుకొన్న వ్యక్తులు నిర్వహించే ప్రతీ అభివృద్ధి కార్యక్రమం అనుమానం సృష్టిస్తుంది. అసూయపరులు, తప్పులు వెదకే వారు ప్రతీ చర్యకు అపార్ధాలు కూర్చుతారు. లూథర్, వెస్లీ మొదలైన సంస్కర్తల కాలంలో జరిగిందిదే. నేడు కూడా ఇదే జరుగుతుంది.PPTel 398.2

    ఇశ్రాయేలీయులికి వచ్చిన మార్గదర్శకాలు గద్దింపులు అన్నీ దేవుని వద్దనుంచి వచ్చినవని కోరహు ఎరిగి ఉంటే అతడు ఆ రకంగా వ్యవహరించేవాడు కాదు. అతడు ఇది ఎరిగి ఉండాల్సింది. ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తుంది తానేనని కావలిసినంత నిదర్శనాన్నిచ్చాడు దేవుడు. కోరహా అతడి సహచరులు సత్యం విషయంలో అంధులయ్యేంత వరకు సత్యాన్ని విసర్జించారు. అందును బట్టి బ్రహ్మాండమైన దైవ శక్తి ప్రత్యక్షతలు సైతం వారిలో నమ్మకం పుట్టించలేకపోయాయి. అవన్నీ మానవ ప్రతిభవల్ల లేదా సాతాను శక్తివల్ల జరిగాయని భావించారు. ప్రజలు కూడా అదే పని చేశారు. కోరహా అతడి అనుచర్లు నాశనమైన మర్నాడు మోషే అహరోన్ల వద్దకు వచ్చి వారిలా అన్నారు. “మీరు యెహోవా ప్రజలను చంపితిరి” తమను మోసగించిన మనుషుల్ని నాశనం చేయటం ద్వారా దేవుడ తన ఆగ్రహాన్ని వ్యక్తంచేసినప్పటికీ ఆయన పంపిన తీర్పుల్ని సాతానుకి ఆపాదించి ఆదుష్టుడి శక్తి ద్వారా మోషే అహరోనుల, మంచివారు పరిశుద్దులు అయిన ప్రజల్ని చంపారని ఆరోపించారు. వారు పరిశు ద్దాత్మకు విరోధంగా పాపం చేశారు. పరిశుద్దాత్మకు విరోధంగా చేసిన పాపం దేవుని కృప ప్రభావానికి చోటివ్వకుండా హృదయాన్ని కఠిన పర్చుతుంది. “మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్దాత్మకు విరోధముగా మాట్లాడిన వానికి........ పాపక్షమాపణలేదు” అని క్రీస్తు అన్నాడు. మత్తయి 12:32. దైవ శక్తితో తాను చేసిన మహత్కార్యాల్ని క్రీస్తు బయల్హబూబు శక్తివల్ల చేశాడని యూదులు ఆరోపించినప్పుడు ఆయన అన్నమాటలివి. పరిశుద్ధాత్మ ద్వారా మానవులతో మాట్లాడాడు ఈ సాధనం సాతాను సంబంధమైందంటూ దాన్ని విసర్జించేవారు ఆత్మ దేవునితో అనుసంధాన మయ్యే ఈ మార్గాన్ని మూసివేసుకొంటున్నవారవుతారు.PPTel 398.3

    పాపిని మందలించటానికి, పాపికి తాను పాపినన్న గుర్తింపు కలిగించటానికి దేవుడు తన ఆత్మ ప్రత్యక్షతల ద్వారా పనిచేస్తాడు. ఆత్మ పరిశుద్దాత్మ పరిచర్యను చివరికి నిరాకరిస్తే ఆ ఆత్మకు దేవుడు చేయగలిగింది ఇక ఏమీ ఉండదు. తనకృప అంతటికి దేవుడు ధారపోస్తాడు. పాపి దేవున్ని విడిచి దూరంగా వెళ్లిపోతాడు. పాపానికి పరిష్కార మార్గంకనిపించదు. పాపిని ఒప్పించి అతడిలో మార్పు తేవటానికి దేవునికి గుప్త శక్తి ఉండదు. “వానిని అలాగుననేయుండనిమ్ము” అన్నది దైవాజ్ఞ (హోషేయ 4:17). అప్పుడు “మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధి పూర్వకముగా పాపాముచేసిన యెడల పాపములకు బలియికను ఉండదుగాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమై అగ్నియు నికనూ ఉండును” హెబ్రీ 10:26, 27.PPTel 399.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents