Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    38—ఎదోము చుట్టూ ప్రయాణం

    కాదేషులో ఇశ్రాయేలీయుల శిబిరం ఎదోము పొలిమేరలకు ఎంతో దూరంలో లేదు. వాగ్దత్త దేశం కనానుకి ఈ దేశ గుండా వెళ్లటానికి మోషే ప్రజలూ అభిలాషించారు. దేవుని ఆదేశానుసారం ఆ మేరకు ఎదోము రాజుకి ఒక సందేశం పంపారు. “నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా -- మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసిది: మా పితరులు ఐగుప్తుకు వెళ్లిరి: మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి: ఐగుప్తీయులు మమ్మును, మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొర పెట్టగా ఆయన మా మొఱ విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము. మమ్మును నీ దేశమును దాటి పోనిమ్మ: పొలములోబడి యైనను, ద్రాక్ష తోటలలోబడియైనను వెళ్లము: బావుల నీళ్లు త్రాగము: రాజ మార్గమున నడిచిపోయెదము. నీ పొలిమేరలను దాటువరకు కుడి వైపునకైనను, ఎడమ వైపునకైనను తిరగకుండ పోయెదము”.PPTel 415.1

    మర్యాద పూర్వకమైన ఈ వినతికి బెదిరింపుతో కూడిన తిరస్కృతి వచ్చింది. “నీవు నా దేశము లోబడి వెళ్లకూడదు. నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సుమీ”. ఈ తిరస్కృతికి విభ్రాంతి చెంది ఇశ్రాయేలు నాయకులు ఈ వాగ్దానంతో రెండోసారి విజ్ఞప్తి చేశారు, “మేము రాజ మార్గములోనే వెళ్లెదము. నేనును, నా పశువులును, నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును. మరేమీ లేదు, కాలినడకనే దాటి పోవుదుము అంతే”.PPTel 415.2

    “నీవు రానే కూడదు” అన్నది ఎదోము జవాడు. ఆయుధాలు ధరించిన ఏదో మీయ దళాల్ని ఇరుకైన కొండ సందుల వద్ద మోహరించి ఆ దిశలో ఇశ్రాయేలీయుల ప్రస్థావాన్ని అడ్డుకొన్నారు. తాము బలప్రయోగం చేయరాదన్నది ఇశ్రాయేలుకు వచ్చిన ఆదేశం. వారు ఎదోము చుట్టూ తిరిగి తమ ప్రయాణం సాగించాల్సి వచ్చింది.PPTel 415.3

    శ్రమ కలిగినప్పుడు ప్రజలు దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఉంటే సైన్యాల కధిపతి అయిన యెహోవా వారిని ఎదోము దేశముగుండా నడిపించేవాడు. ఆ దేశ ప్రజలు వారికి భయపడేవారు. శత్రుత్యం ప్రదర్శంచే బదులు వారు స్నేహ హస్తం చా పేవారు. అయితే ఇశ్రాయేలీయులు దేవుని ఆదేశాన్ని వెంటనే ఆచరణలో పెట్టలేదు. ఫిర్యాదులు చేస్తూ సణుగుకొంటూ ఉన్నప్పుడు బంగారు అవకాశం చేజారిపోయింది. చివరికి తమ మనవిని రాజు ముందుంచాలనుకొనే సరికి రాజు దాన్ని తిరస్కరించాడు. వారు ఐగుప్తును విడిచి పెట్టింది లగాయతు మార్గంలో శోధనలు అవరోధాలు కల్పించటానికి సాతాను సర్వదా కృషి చేస్తూనే వున్నాడు. కనానును స్వతంత్రించుకోకుండా వారిని ఆపటానికి శ్రమిస్తూనే ఉన్నాడు. తమ అపనమ్మకం వల్ల వారు పదేపదే అతడికి తలుపు తెరిచి దేవుని ఉద్దేశాన్ని వ్యతిరేకించటానికి తోడ్పడ్డారు.PPTel 415.4

    దేవుని మాటను విశ్వసించటం, ఆయన దూతలు మనకు సహాయం చేసేందుకు వేచివున్న సమయంలోనే ఆయన మాటచొప్పున చేయటం ప్రాముఖ్యం. మన ప్రతీ ముందడుగును ప్రతిఘటించటానికి దుష్టదూతలు సిద్ధంగా ఉంటారు. దేవుడు తన ప్రజల కోసం అద్భుత కార్యాలు చేసేందుకు సంసిద్ధంగా ఉన్న తరుణంలో ముందుకు సాగమని వారిని ఆదేశించనప్పుడు సందేహించి ఆలస్యం చేయటానికి సాతాను వారిని శోధిస్తాడు. జగడాలు లేదా గొణుగుడు లేదా అవిశ్వాసం రగలించి దేవుడు మనకివ్వాలని ఆశిస్తున్న దీవెనలు మనకు దక్కకుండా చేయటానికి ప్రయత్నిస్తాడు. దైవ సేవకులు చురుకుగా వ్యవహరించే వ్యక్తులై యుండాలి. ఆయన తెరిచే మార్గాల్లో వేగంగా సాగిపోవాలి. వారు ఏ కొంచెం జాప్యం చేసినా వారిని జయించటానికి సాతానుకి అది అవకాశమిస్తుంది.PPTel 416.1

    వారు ఎదోముగుండా వెళ్లటం గురించి ప్రభువు మోషేకిచ్చిన ఆదేశాల్లో ఎదోమీయులు తమకు భయపడ్డారని ఆయన అన్నప్పుడు దాన్ని అసరాగా చేసుకొని వారిని దోచుకోరాదని ప్రభువు ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించాడు. దేవుని శక్తి ఇశ్రాయేలీయుల పక్షంగా ప్రదర్శితమైనందువల్ల ఎదోమీయులు తమకు భయపడ్డారు గనుక ఇశ్రాయేలీయులు వారి మీద పడి చంపకూడదు. వారికి దేవుడిచ్చిన ఆదేశం ఇది. “మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహాపడవద్దు: ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయూరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను” ద్వితీ 2:4,5. ఎదోమీయులు అబ్రాహాము, ఇస్సాకుల సంతతివారు. తన ఈ సేవకుల్ని బట్టి దేవుడు ఏశావు పిల్లలపై దయ చూపించాడు. వారికి శేయీరు మన్యాన్ని వారసత్వంతగా ఇచ్చాడు. వారు తమ పాపాలవ్ల దేవుని కృపకు అతీతులైతే తప్ప వారి జోలికి ఇశ్రాయేలీయులు పోరాదన్నది దేవుని ఆదేశం. ఇకపోతే తమ దుష్టత్య పాత్రను నింపుకొన్న కనానీయుల్ని నాశనం చేసి వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నారు. ఎదోమీయులు ఇంకా కృపకు పాత్రులు, అందుకే వారితో హెబ్రీయులు దయగా వ్యవహరించాల్సి ఉన్నారు. కృప చూపించటం దేవునికి మహదానందం. తన శిక్షల్ని విధించక ముందు ఆయన దయ కనికరాల్ని ప్రదర్శిస్తాడు. కనానీయుల్ని సర్వనాశనం చేయమని ఆదేశించక ముందు ఏదోమీయుల్ని విడిచి పెట్టమని వారిని కోర్టున్నాడు.PPTel 416.2

    ఏదో మీయులు ఇశ్రాయేలీయుల పూర్వికులు, అన్నదమ్ములు. అందుకే వారి మధ్య దయ మర్యాదలు కొనసాగటం అవసరం. తమ దేశం గుండా వెళ్లటానికి ఎదోమీయులు ఇశ్రాయేలీయులల్ని నిరాకరించి అవమానించినందుకు అప్పుడు గాని, భవిష్యత్తులో ఇంకెప్పుడు గాని ఇశ్రాయేలీయులు ప్రతీకారం తీర్చుకోరాదని దేవుడు ఆదేశించాడు. ఎదోములో వారు ఎలాంటి భూభాగాన్ని కోరకూడదని ఆదేశించాడు. తాము దేవుడు ఎన్నుకొన్న జనాంగమైనా ఇశ్రాయేలీయులు తమపై దేవడు విధించిన ఆంక్షల్ని పాటించాల్సి ఉన్నారు. వారికి దేవుడు మంచి స్వాస్థ్యాన్ని వాగ్దానం చేశాడు. అలాగని భూమంతా తమదేనని తమకు సర్వహక్కులున్నాయని భావించి ఇతరుల్ని నెట్టి వేయకూడదన్నది దేవుని ఉద్దేశం. తాము ఏదోమీయుల్తో వ్యవహరించేటప్పుడు వారికి అన్యాయం చేయకుండా ఆచితూచి అడుగులు వేయాలని దేవుడు చెప్పాడు. వారు ఎదో మీయులో వాణిజ్యం జరిపి తమకు అవసరమైన వస్తువుల కొనుగోలు చేసుకొని వాటికి ద్రవ్యం చెల్లించాలి PPTel 417.1

    ఇశ్రాయేలీయులు ఉద్రేకం పొంది దేవుని పై నమ్మకముందచి ఆయనకు విధేయులయ్యేందుకుగాను దేవుడు వారికి ఈ విషయం గుర్తు చేశాడు, “నీ చేతుల పన్నులన్నింటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను... నీకేమియు తక్కువ కాలేదు” ద్వితి 2:7. వారు ఎదోమీయులమీద ఆధారపడలేదు. అన్ని వనరులు తన చేతిలో వున్న దేవుడు వారికున్నాడు. వారికి చెందంది దేనినైనా వారు బలాత్కారంగా గాని, మోసం ద్వారా గాని పొందటానికి ప్రయత్నించకూడదు. తమ లావాదేవీలన్నిటిలోను “నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను” అన్న ధర్మ సూత్రాన్ని ఆచరించి వారు ఆదర్శనీయులుగా నివసించాలి.PPTel 417.2

    దేవుడు ఉద్దేశించిన ఈ రీతిగా వారు ఎదోము గుండా వెళ్లి ఉంటే ఆ పయనం తమకే కాదు ఆ దేశ ప్రజలకు కూడా ఆశీర్వాదంగా పరిణమించేది. ఎందుకంటే దైవ ప్రజలతో, ఆయన ఆరాధనతో వారికి పరిచయం ఏర్పడటానికి యాకోబు దేవుడు తన్ను ప్రేమించే వారిని ఎలా వర్ధిల్లజేశాడో చూడటానికి వారికి అవకాశం లభించేది. కాని ఇశ్రాయేలీయుల అవిశ్వాసం మూలాన ఇది జరగలేదు. తమ అరుపులకు సమాధానంగా వారికి దేవుడు నీళ్లిచ్చాడు గాని తమ అవిశ్వాసమే వారికి శిక్ష విధించటానికి సమ్మతించాడు. మళ్లీ వారు అరణ్యంలో సంచరించాలి. ఆ విచిత్ర ప్రవాహపు నీళ్లు తాగి తమ దాహార్తిని చల్లార్చుకోవాలి. వారు దేవుని మీద నమ్మకం ఉంచి ఉంటే ఆ ప్రవాహం ఇక అవసరమయ్యేది కాదు.PPTel 417.3

    ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ దక్షిణ దిశగా తమ ప్రస్థానం సాగించారు. వారి ప్రయాణం నిస్సారమైన బీడు భూములగుండా సాగింది. ఎదోము కొండలు లోయల్లోని కొద్దిపాటి పచ్చదనం దృశ్యాల అనంతరం ఆ బీడు భూముల్లో ప్రయాణం మరింత అయాసకరమనిపించింది. నిస్తేజమైన ఈ అరణ్యం పక్కనే ఉన్న పర్వత శ్రేణిలో హోరు పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరం పై అహరోను మరణం సమాధి జరగాల్సి ఉన్నది. ఇశ్రాయేలీయులు ఈ పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు మోషేని దేవుడిలా ఆజ్ఞాపించాడు -- “నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరుకొండ యెక్కి అహరను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును”.PPTel 418.1

    ఈ ఇరువురు వృద్ధులు ఆ యువకుడు హోరు పర్వత శిఖరం బాధపడి ఎక్కారు. మోషే అహరోనుల తలలు నూట ఇరవై శీతాకాలాల మంచుతో తెల్లబడి ఉన్నాయి. సుదీర్ఘ సుప్రసిద్ధ జీవితాల్లో కఠోర శ్రమల్ని, సమున్నత గౌరవాల్ని చవి చూశారు. వారు ప్రతిభ పాటవాలు గల వ్యక్తులు. వారి శక్తి సామర్థ్యాలన్నీ దేవునితో సాంగత్యం ద్వారా వృద్ధి చెంది సమున్నతం ప్రతిష్టాత్మకం అయ్యాయి. వారి జీవితాలు స్వార్థరహితమైన దైవ సేవలోను తోటి మానవుల సేవలోను గడిచాయి. వారి ముఖాల్లో విశేష జ్ఞానం, కార్యదీక్ష, ధృడమైన మమతాను రాగాలు ప్రతిబింబించాయి.PPTel 418.2

    తమ ఆసక్తులు సేవల పరంగా మోషే అహరోనులు అనేక సంవత్సరాలుగా ఒకరిపక్క ఒకరు నిలిచారు. వారిద్దరూ కలిసి ఎన్నో అపాయాల్ని ఎదుర్కొన్నారు. దేవుని ఆశీర్వాదాల్ని పంచుకొన్నారు. అయితే వారు విడిపోవటానికి సమయం వచ్చింది. వారి అడుగులు నెమ్మదిగా పడునానయి. వారు ఒకరితో ఒకరు గడిపే ఆ ఘడియలు ప్రశస్తమైనవి. కొండ పైకి ఎక్కటం భారంగా ఉంది. విశ్రాంతి కోసం తరచు ఆగుతూ గతాన్ని జ్ఞాపకం చేసుకొని భవిష్యత్తు గురించి మాట్లాడుకొన్నారు. వారి ముందు తాము సంచిరించిన విశాల అరణ్యం కనిపిస్తున్నది. కింద మైదానంలో తాము ఎవరి నిమిత్తం పాటుపడ్డారో, ఎవరి కోసం త్యాగాలు చేశారో ఆ ఇశ్రాయేలు ప్రజల శిబిరం కనిపిస్తున్నది. ఎదోము పర్వతాలకు అవతల ఎక్కడోవున్నది వాగ్రత్త దేశానికి నడిపే మార్గం. పాపం ఆ దేశంలో నివసించి ఆనందించే భాగ్యం మోషే అహరోన్లకు లేదు. వారి హృదయాల్లో తిరుగుబాటు భావాలు చోటుచేసుకోలేదు. వారి నోటివెంట ఎలాంటి సణుగుడు వినరాలేదు. అయినా తమ పితరుల స్వాస్థ్యాన్ని పొందకుండా తమను బహిష్కరించి ఏంటో గుర్తుకు వచ్చినప్పు వారి కళ్లు చెమర్చాయి.PPTel 418.3

    ఇశ్రాయేలీయుల నిమిత్తం అహరోను పరిచర్య ముసిగింది. నలభై ఏళ్లకిందట తనకు ఎనభై మూడేళ్ల వయసులో తన మహాకార్య నిర్వహణలో మోషేతో కలిసి పనిచేయటానికి అహరోన్ని దేవుడు పిలిచాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుంచి నడిపించటంలో అహరోను తన తమ్ముడు మోషేకి సహకరించాడు. హెబ్రీ ప్రజలు అమాలేకీయుల్తో యుద్ధం చేసినప్పుడు తమ అధినాయకుడు మోషే చేతుల్ని అతడు ఎత్తి పట్టుకున్నాడు. దేవుని సముఖాన్ని సమీపించేందుకు దేవుని మహిమను వీక్షించేందుకు సీనాయి పర్వతం ఎక్కే భాగ్యం అతడికి కలిగింది. అహరోను సంతతికి దేవుడు యాజకత్వ బాధ్యతను ఇచ్చాడు. అహరోనుని పవిత్ర ప్రధాన యాజకుడుగా నియమించి సత్కరించాడు. తన భయంకరమైన తీర్పు ప్రదర్శనలో కోరహును అతడి అనుచరులను నాశనం చేయటం ద్వారా అహరోన్ని ఆ పరిశుద్ధ హోదాలో నిలిపాడు. అహరోను విజ్ఞాపన వల్లనే తెగులు ఆగిపోయింది. దేవుని ఆజ్ఞను లెక్క చేయనందువల్ల తన ఇద్దరు కుమారులు హతులైనప్పుడు అహరోను తిరుగుబాటు చేయలేదు, సణగలేదు. అయినా అతని చరిత్ర దోషరహితం కాదు. ప్రజల ఒత్తిడికి లొంగి సీనాయి వద్ద బంగారు దూడను చేసి అహరోను ఘోర పాపం చేశాడు. మిర్యాముతో కలిసి మోషే పై అసూయపడి సనిగినప్పుడు కూడా అతడు ఘోర పాపం చేశాడు. కాదేషు వద్ద బండ నీళ్లు ఇవ్వటానికి మాట్లడమన్న ఆదేశాన్ని మోషేతో పాటు అహరోను కూడా అత్రికమించి దేవుని దు:ఖ పెట్టాడు.PPTel 419.1

    తన ప్రజలకు నాయకులైన వారు క్రీస్తుకు ప్రతినిధులుగా వ్యవహరించాలని దేవుడు ఉద్దేశించాడు. అహరోను ఇశ్రాయేలీయుల పేర్లను తన ఛాతి పై ధరించాడు. అతడు దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియజేశాడు. అతడు ప్రాయశ్చితార్రర్త దినాన ఇశ్రాయేలీయుల మద్యవర్తిగా రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఆ పని ముగించుకొని సమాజాన్ని ఆశీర్వదించటానికి బయటికి వచ్చాడు. అలాగే తమ పక్షంగా తన ప్రాయశ్చితార్థ పరిచర్య సమాప్తమైన తర్వాత వేచివున్న తన ప్రజల్ని ఆశీర్వదించటానికి క్రీస్తు బయటికి వస్తాడు. మన ప్రదాన యాజకుడైన క్రీస్తుకు ప్రతినిదిగా అహరోను నిర్వహించిన పరిశుద్ధ హోదాకున్న ఔన్నత్యాన్ని బట్టే కాదేషులో అతని పాపం అంత ఘోర పాపమయ్యింది.PPTel 419.2

    తీవ్ర ఆవేదనతో అహరోను పరిశుద్ధ వస్త్రాన్ని తీసి మోషే ఎలియాజరుకు తొడిగాడు. ఈ విధంగా దేవుని నియామకం చొప్పున ఎలియాజరు అహరోను వారసుడయ్యాడు. కాదేషులో తాను చేసిన పాపం గురించి అహరోను కనానులో దేవుని ప్రధాన యాజకుడుగా సేవచేసే ఆధిక్యతను అనగా రమ్యమైన ఆదేశంలో మొదటి బలి అర్పించి తద్వారా ఇశ్రాయేలీయుల స్వాస్థ్యాన్ని ప్రతిష్ఠించే ఆధిక్యతను పోగొట్టుకొన్నాడు. మోషే అయితే తన భార్య బాధ్యతల్ని కొనసాగించాల్సి ఉన్నాడు. ప్రజల్ని కననాను పొలిమేర్లవరకూ నడిపించాల్సి ఉన్నాడు. వాగ్దత్త దేశం కనిపించేంత వరకూ వెళ్తాడు గాని ఆ దేశంలో ప్రవేశించడు. ఈ దైవ సేవకులు కాదేషులో బండ ముందు తమకు వచ్చిన పరీక్షలో సణుగుకోకుండా నిలిచి ఉంటే వారి భవిష్యత్తు ఎంతా వ్యత్యాసంగా ఉండేది! జరిగిపోయిన ఆ కార్యాన్ని వెనక్కి తీసుకోలేం. ఒక్క నిమిషం శోధనవలన లేదా అనాలోచనవల్ల కోల్పోయిన దాన్ని పునరుద్ధరించటానికి ఒక జీవిత కాలమైనా సరిపోదు.PPTel 420.1

    శిబిరంలో ఈ నాయకులిద్దరూ కనిపించపోవటం, వారితో పాటు అహరోను వారసుడుగా అందిరికీ తెలిసిన ఎలియాజరు వెళ్లటం భయాందోళనలు పుట్టించాయి. వారి తిరిగి రాకకోసం ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూశారు. తమ చుట్టూ ఉన్న విస్తార జన సమూహాన్ని పరిశీలించినప్పుడు ఐగుప్తులో నుంచి బయలు దేరిన పెద్దవారిలో దాదాపు అందరూ అరణ్యంలో నశించిపోయినట్లు ప్రజలు గమనించారు. మోషే అహరోన్ల శిక్షను గుర్తు చేసుకొన్నప్పుడు ఏదో కీడు జరగబోతుందని అందరూ భయపడ్డారు. హోరు పర్వత శిఖరానికి వారు ఎక్కటంలోని ఉద్దేశం కొంతమందికి తెలుసు. తమ ప్రియతమ నాయకుల్ని గూర్చిన తమ ఆందోళనను వారి చేదు జ్ఞాపకాలు ఆత్మ నిందలు మరింత దుర్భరం చేశాయి.PPTel 420.2

    చివరికి మోషే ఎలియాజరులు నెమ్మదిగా కొండదిగి రావటం కనిపించింది. అహరోను వారితో లేడు.ఎలియాజరు యాజక దుస్తులు ధరించాడు.తండ్రి పరిశు ద్ద బాధ్యతలకు తాను వారసుడయ్యాడని ఇది సూచించింది. దు:ఖంతో బరువెక్కిన హృదయాల్లో ప్రజలు తమ నాయకుడి చుట్టూ చేరగా అహరోను హోరు పర్వతం మీద తన చేతుల్లో మరణించాడని అతణ్ని తామక్కడే పాతి పెట్టామని మో షే తెలిపాడు. ప్రజలు బహుగా దు:ఖించారు. తనకు ఎన్నోసార్లు దు:ఖ పెట్టినప్పటికీ ప్రజలు అహరోనుని ఎంతో ప్రేమించారు. “ఇశ్రాయేలీయుల కుటుంబికులందరును అహరోనుకొరకు ముప్పది దినములు దు:ఖము సలిపిరి”.PPTel 420.3

    ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకుడి సమాధిని గూర్చి లేకనాల్లో ఈ సామన్య దాఖలా మాత్రమే ఉన్నది.” అక్కడ అహరోను చనిపోయి పాతి పెట్టబడెను” ద్వితి. 10:6 దేవుని ఆదేశం ప్రకారం జరిగిన ఈ భూస్థాపనకు, నేటి ఆచారాలకూ ఎంత వ్యత్యాసముంది! ప్రస్తుత కాలంలో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి మరనిస్తే సమాధి గొప్ప ఆడంబరంతో దుబారా ఖర్చుతో జరుగుతుది. లోకంలో అత్యుత్తమ వ్యక్తుల్లో ఒకడైన అహరోను కన్ను మూసినప్పుడు అతడి ఆప్తుల్లో ఇద్దరు మాత్రమే ఆ మరణాన్ని చూశారు, అతణ్ని సమాధి చేశారు. హోరు పర్వతం మీద ఉన్న ఒంటరి సమాధి ఇశ్రాయేలీయులకంటికి ఎన్నటికి కనబడకుండా మరుగు పడింది. మరణించిన వారి నిమిత్తం జరిగే ఆడంబరం, సమాధికి పెట్టే ఖర్చు విషయంలో మనుషులు దేవుని ఘనపర్చటం లేదు.PPTel 421.1

    అహరోను నిమిత్తం సమాజమంతా దు:ఖించింది. అహరోను లోటు అందరి కన్నా మో షేకి ఎక్కువగా కనిపించింది. తన అంతం కూడా దగ్గరలోనే ఉన్నదని అహరోను మరణం మోషేకు గుర్తు చేసింది. తాను జీవించనున్నది ఎంత తక్కువ కాలమైనా తన సుఖదు:ఖానిన తన నిరీక్షణని, భయాల్ని ఎన్నో సంవత్సరాలుగా పంచుకొంటూ నీడలా తనతో ప్రతి నిత్యం ఉన్న నేస్తం లేని లోటు అందరికన్నా మోషేకి ఎక్కువగా ఉంది. మోషే తన పనిని ఇప్పుడు ఒంటరిగా కొనసాగించాలి. అయితే దేవుడు తన మిత్రుడని మోషే ఎరుగును. ఆయన మీదే అతడు ఎక్కువ ఆధారపడి పనిచేశాడు.PPTel 421.2

    హోరు పర్వతాన్ని విడిచి వెళ్లిన వెంటనే కనానీయుల రాజుల్లో ఒకడైన అరాదుతో జరిగిన యుద్ధంలో ఇశ్రాయేలీయులు పరాజయం పొందారు. కాని వారు చిత్తశుద్ధితో దేవుని సహాయం అర్థించినందున దేవువు సహాయం చేశాడు. వారి శత్రువులు నాశనమయ్యారు. ప్రజల్లో కృతజ్ఞతభావం నింపి దేవుని పై మరెక్కువ ఆధారపడేటట్లు వారిని నడిపించే బదులు ఈ విజయం వారిని డంబాలు పలికించింది, ఆత్మ విశ్వాసంతో నింపింది. అనతికాలంలోనే గొణగటమన్న తమ పాత అలవాటు తిరిగి వచ్చింది. అప్పటికి సుమారు నలభై ఏళ్ల క్రితం వేగులవారి నివేదికి సమర్పణ దరిమిలా ఇశ్రాయేలీయులు కనాను పై తల పెట్టిన దాడిని అనుమతించనందుకు ఇప్పుడు వారు అసంతృప్తి చెందారు. అరణ్యంలో తమ దీర్ఘ ప్రయాణం అనవసర జాప్యమని నిందించారు. ఇప్పుడు తమ శత్రువుల పై సునాయాసంగా విజయం ఎలా సాధించారో అలాగే అప్పుడైన సాధించేవారమని వాధించారు.PPTel 421.3

    వారి ప్రయోణం దక్షిణ దిశలో సాగింది. అది ఇసుక లోయలో కూడి చెట్టూ నీడాలేని వేడి ప్రదేశం. గమ్యం బహుదూరమనిపించింది. ప్రజలు అలసిపోయారు. దాహార్తితో తపించిపోతున్నారు. విశ్వాసం, సహనం పరీక్షలో వారు మళ్లీ ఒడిపోయారు. తమ చేదు అనుభవాన్ని పదే పదే నెమరు వేసుకోటం ద్వారా దేవునికి దూరమై ఆయననుంచి విడిపోయారు. కాదేషులో నీళ్ల సరఫరా ఆగినప్పుడు తాము సణగకుండా ఉండి ఉంటే తాము ఏదోము చుట్టూ చేసిన ప్రయాణం అవసర మయ్యేది కాదని వారు గుర్తించలేదు. వారికి మేలైన వాటిని దేవుడు ఉద్దేశించాడు. తమ పాపానికి ఆయన తేలికపాటి శిక్ష విధించినందుకు వారు కృతజ్ఞలై ఉండాల్సింది. దీనికి బదులు, దేవుడు మోషే తమకు అభ్యంతరం చెప్పి ఉండకపోతే తాము ఈ పాటికే వాగ్దత్త దేశాన్ని స్వాధీనం చేసుకొని ఉండేవారమని ప్రగల్భాలు పలికారు. తమ తలల మీదకు శ్రమలు, కష్టాలు తెచ్చుకొన్న తర్వాత, తమ బ్రతుకు దేవుడు ఉద్దేశించిన దానికన్నా దుర్భరమైనప్పుడు, తమ గొనుగుడుకు దేవుడే కారణమని నిందించారు. ఈ విధంగా తమతో దేవుడు వ్యవహరించిన తీరు విషయంలో వారు ఆయాసంగా ఉన్నారు. చివరికి అన్ని విషయాల్లోనూ అసంతృప్తులయ్యారు. దేవుడు తమను నడిపిస్తున్న వాగ్దత్త దేశంకన్నా, స్వాతంత్ర్యం కన్నా వారికి ఐగుప్త మెరుగుగా వాంఛనీయంగా అసంతృప్తికి తావిచ్చిన ఇశ్రాయేలీయులు తమకు కలిగిన ఉపకారాల విషయంలో సైతం తప్పుపట్టటం మొదలు పెట్టారు. “కాగా ప్రజలు దేవునికిని మో షేకును విరోధముగా మాటలాడి - ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు. నీళ్లు లేవు. చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి”.PPTel 422.1

    ప్రజలు చేసిన పాపాన్ని మోషే వారి ముందుంచాడు. “తాపకరమైన పాములును, తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో తమను కాపాడినది దేవుని శక్తి” అని వారికి చెప్పాడు. ద్వితీ 8:15. వారి ప్రయాణంలో ప్రతీ దినం దేవుని కృపే వారిని కాపాడింది. దేవుడు తమను నడిపించిన మార్గమంతటిలోనూ దాహం తీర్చటానికి నీళ్ళు ఆకలి తీర్చటానికి మన్నా వారికి లభించాయి. పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్నిస్తంభం వలన వారికి శాంతి భద్రతలు చేకూరాయి. ఎత్తయిన పర్వతాలు ఎక్కినప్పుడు లేదా అరణ్యంలో ఇరుకైన రాతి మార్గాలలో పయనించినప్పుడు దేవదూతలు వారికి పరిచర్య చేశారు. వారికి ఎన్నో కష్టాలు, శ్రమలు కలిగినప్పటికీ వారిలో బలహీనులు ఎవ్వరూ లేరు. తమ సుదీర్ఘ ప్రయాణంలో ఎవరికీ కాళ్లు వాయలేదు. వారు ధరించిన దుస్తులు ప్రయాణంలో పాతగల్లి చినిగిపోలేదు. వారి మార్గంలోని క్రూర మృగాల్ని దేవుడు తరిమివేశాడు. అరణ్యంలోని ఎడారిలోని విషసర్పాల్ని తొలగించాడు. ఇలా వారి మార్గాన్ని సుగమనం చేశాడు. ఆయన ప్రేమకు ఇన్ని నిదర్శనాలుండగా ప్రజలు సణుగుతూ ఫిర్యాదులు చేస్తుంటే వారు తమ పట్ల దేవుని శ్రద్ధాసక్తుల్ని అభినందించి పశ్చాత్తాపంతోను, వినయ మనసుతోను ఆయన వద్దకు తిరిగి వచ్చేవరకు ప్రభువు తన కాపుదలను నిలిపి వేస్తాడు.PPTel 422.2

    దేవుడు తమను కాపాడూ వచ్చాడు గనుక తమను చుట్టుముట్టఉన్న అనేకమైన అపాయాల్ని వారు గుర్తించలేదు. వారు కృతఘ్నతతోను, అవిశ్వాసంతోను నిండి ఉన్న తరుణంలో తమకు మరణం వస్తే బాగుండుననుకొన్నారు. ఇప్పుడు వారికి మరణం రావటాన్ని ప్రభువు అనుమతించాడు. అ ఆరణ్యం నిండా వున్న విషసర్పాల్ని తాపకరమైన పాములని పిలిచారు. ఎందుకంటే వాటి కాటు తీవ్రమైన మంటతో సత్సర మరణం కలిగించింది. దేవుడు ఇశ్రాయేలీయుల్ని పరిరక్షించటం ఆపినప్పుడు ఈ విషసర్పాలు ప్రజల మీద విరుచుకుపడ్డాయి.PPTel 423.1

    శిబిరమంతా భయంతో, గందరగోళంతో నిండింది. దాదాపు ప్రతీ గుడారం లోను మరణించేవారో, మరణించిన వారో ఉన్నారు. భద్రత అన్నది లేదు. నిశ్శబ్దంగా ఉన్న రాత్రిలో కొత్త బాధితుల్ని గూర్చిన కేకలు, ఏడ్పు తరచు వినవచ్చేవి. అందరూ బాధితులికి సేవ చేయటంలోనో లేదా ఇంకా పాముల బారిపడని వారిని కాపాడేందుకు కృషి చేయటంలోనో తలమనకలై ఉన్నారు. ఇప్పుడు గొణుగుతున్న వారెవరూ లేరు. ప్రస్తుత శ్రమలతో పోల్చితే గతంలో వారి శ్రమలు, బాధుల కొరగానివిగా కనిపిస్తాయి.PPTel 423.2

    వారిప్పుడు దేవుని ముందు వినయ మనస్కలయ్యారు. తమ ఒప్పుకోళ్ల తోను, మనవులతోను వారు మోషే వద్దకు వచ్చారు, “మేము యెహోవాకును, నీకును విరోధముగా మాటలాడితిమి” అన్నారు. కొద్దిక్షణాల క్రితమే తమ శత్రువని తమ శ్రమలన్నిటికి హేతువని మో షేని నిందించారు. అలా అంటున్నప్పుడు కూడా తమ ఆరోపన నిజం కాదని వారికి తెలుసు. నిజమైన కష్టం వచ్చినప్పుడు తమ తరపున దేవునికి విజ్ఞాపన చేయగల ఒకే ఒక వ్యక్తిగా మోషే వద్దకు పరుగెత్తారు. “యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుము” అన్నారు.PPTel 423.3

    జీవించివున్న పాముల్లాంటి పామును చేసి దాన్ని ప్రజల మధ్య ఎత్తి ఉంచమని దేవుడు మోషేతో చెప్పాడు. పాము కాటుకి గురి అయిన వారందరూ దాన్ని చూసి స్వస్థత పొందాల్సి ఉన్నారు. మోషే ఆ ప్రకారం చేశాడు. పాము కాటుకి గురి అయిన వారందరు ఆ ఇత్తడి సర్పం వంక చూసి స్వస్థత పొందవచ్చునన్న వార్త శిబిరమంతా తెలిసింది. అప్పటికే చాలా మంది మరణించారు. ఇత్తడి సర్పాన్ని, మోషే కర్రమీద నిలబెట్టినప్పుడు కేవలం ఆ లోహ సర్పాన్ని చూడటం ద్వారా స్వస్థత కలుగుతుందని కొందరు నమ్మలేదు. వీరు తమ అవిశ్వాసం వల్ల మరణించారు. అయినా దేవుడు చేసిన ఏర్పాటును విశ్వసించినవారు అనుకులున్నారు. బాధపడుతున్నవారు, మరణిస్తున్నవారు ఉన్నారు. తేలిపోతున్న తమ వారి దృష్టిని ఆ సర్పం మీద ఉంచ టానికి తోడ్పడే కృషిలో తండ్రులు, తల్లులు, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు నిమగ్నమై ఉ న్నారు. సోలిపోతూ మరణిస్తూ వున్న వీరు ఒక్కసారి మాత్రమే చూసినప్పుడు బాగుపడ్డారు.PPTel 424.1

    ఇత్తడి సర్పాన్ని ఎత్తటం ద్వారా ఇశ్రాయేలీయులక ఒక ముఖ్యమైన పాఠం నేర్పించాలని దేవుడు ఉద్దేశించాడు. పాము కాటులోని విషం నుంచి వారు తమను తాము రక్షించుకోలేదు. దేవుడు మాత్రమే వారిని బాగు చేయగలడు. వారు ఆయన ఏర్పాటు చేసిన సాధనం పై నమ్మిక ఉంచాలి. బతకాలంటే వారు పైకి చూడాలి. వారి విశ్వాసమే దేవునికి అంగీకారం. సర్పం వంక చూడడం ద్వారా వారు తమ విశ్వాసాన్ని ప్రదర్శించాల్సి ఉన్నారు. ఆ సర్పంలో ఏమీ శక్తి లేదని వారెరుగుదురు. కాని అది క్రీస్తుకు ఒక చిహ్నం. ఆయన యోగ్యతలపై విశ్వాసముంచటం అవసరమని ఇది వారికి సూచించింది. అంతవరకు అనేకులు తమ అర్పణలు దేవుని వద్దకు తెచ్చి తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేశామని భావించారు. అయితే అర్పణలు ఎవరికి ముంగుర్తుగా ఉన్నవో రానున్న ఆ విమోచకుడి మీద వారు ఆధారపడలేదు. ప్రస్తుతం తమ అర్పణలో ఆ ఇత్తడి సర్పంలోలాగ శక్తిగాని, యోగ్యతగాని ఏమీలేదని, పాప పరిహారార్థంబలి అయిన క్రీస్తు వద్దకు తమను నడిపించటమే దాని పరమోద్దేశమని ప్రభువు వారికి బోధించాడు.PPTel 424.2

    “అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో” అలాగే “విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను” యెహాను 3:14, 15. లోకంలో నివసించిన వారందరూ “అపవాది యనియు, సాతాననియు పేరుగల ఆది సర్పము” ప్రాణాంతకమైన కాటుకు గురి అయినవారే. ప్రకటన 12:9. పాపం తాలూకు ప్రాణాంతక పర్యవసానాలు దేవుడు ఏర్పాటు చేసిన సాధనంవల్ల మాత్రమే నివారణ అవుతాయి. ఎత్తబడిన సర్పాన్ని వీక్షించటం ద్వారానే ఇశ్రాయేలీయులు తమ ప్రాణాల్ని రక్షించుకోగలిగారు. ఆ చూపు విశ్వాసాన్ని సూచించింది. దేవుని మాటను, తమ స్వస్థతకు ఆయన ఏర్పాటు చేసిన సాధనాన్ని విశ్వసించారు గనుక వారు బతికారు. అలాగే పాపికూడా క్రీస్తు వంక చూసి జీవించవచ్చు. ప్రాయశ్చిత్తార్థ బలిదానం ద్వారా పాపికి క్షమాపణ లభిస్తుంది. జీవంలేని ఆ సర్పసంకేతంలాకాక పశ్చాత్తాపం చెందే పాపిని స్వస్థపర్చటానికి క్రీస్తులో శక్తి ప్రభావాలున్నాయి.PPTel 424.3

    పాపి తన్నుతాను రక్షించుకోలేడు. అయినా రక్షణ సంపాదించటంలో అతడి పాత్ర కూడా ఉంది. “నా యొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను” అంటున్నాడు క్రీస్తు. యోహాను 6:37. మనం ఆయన వద్దకు రావటం అవసరం. మన పాపాల నిమిత్తం పశ్చాతాప్తం పొందినప్పుడు ఆయన మనల్ని అంగీకరించి క్షమిస్తాడని విశ్వసించాలి. విశ్వాసం దేవుని వరం. అయితే దాన్ని వినియోగించుకొనే శక్తి మనకే ఉన్నది. దేవుడిచ్చే కృప, కనికారల్ని విశ్వాసం అనే హస్తంతో ఆత్మ స్వీకరిస్తుంది.PPTel 425.1

    కృపా నిబంధన మూలంగా ఒనగూడే ఆశీర్వాదాల్ని క్రీస్తు నీతే మనకు దఃఖలు పర్చుతుంది. ఈ ఆశీర్వాదాల్ని పొందటానికి చాలాకాలంగా ఎందరో ఆశించి ప్రయత్నించారు గాని వాటిని పొందలేకపోయారు, ఎందుచేతనంటే వాటిని పొందే అర్హతను సంపాదించటానికి తమ వంతు కృషి చేయాలన్నది వారి అభిలాష, నేను అన్ని పరిధిని దాటి క్రీస్తు సర్వసమృద్దుడైన రక్షకుడని వారు ఆలోచించరు. మన అర్హతలే మనల్ని రక్షిస్తాయని మనం నమ్మరాదు. మన రక్షణ, నిరీక్షణ క్రీస్తే. “మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము”. అ.కా.4:12.PPTel 425.2

    మనం దేవున్ని సంపూర్ణంగా విశ్వసించినప్పుడు, పాపాలు క్షమించే రక్షకుడుగా యేసు యోగ్యతలమీద ఆధారపడి ఉన్నప్పుడు మనం కోరే సహాయమంతా పొందవచ్చు. తమను రక్షించుకొనే శక్తి తమకున్నట్లు ఎవరూ తమమీద తామే ఆధారపడకూడదు. మన కోసం మనం మరణించలేము గనుక యేసు మనకోసం మరణించాడు. ఆయనే మన నిరీక్షణ, మన ఆశా కిరణం, మన పరిశుద్ధత, మన నీతి. మనం మన పాప స్థితిని గుర్తించనప్పుడు మనకు రక్షకుడు లేడని గాని లేదా ఆయనకు మన మీద కృపాకనికరాలు లేవనిగాని భావించి నిరాశకు లోనై భయపడకూడదు. మన నిస్సహాయ స్థితిలో ఈ క్షణంలోనే తన చెంతకు వచ్చి రక్షణ పొందాల్సిందిగా ఆయన ఆహ్వానిస్తున్నాడు.PPTel 425.3

    దేవుడు ఏర్పాటు చేసిన పరిష్కారం సహాయ పడటంలేదని పలువురు ఇశ్రాయేలీయుల అభిప్రాయపడ్డారు. తమ చుట్టూ చనిపోయిన వారు చనిపోతున్న వారు పడి ఉండటం చూశారు. దేవుని సహాయం లేకుంటే తమగతి కూడా అదేనని గుర్తించారు. తక్షణ స్వస్థత అందుబాటులో ఉండగా, బలం క్షీణించి, చూపు మందగించే వరకూ వారు తమ గాయాల గురించి, బాధల గురించి, మరణం గురించి దు:ఖించటంలోనే మన శక్తినంతటినీ వినియోగించకూడదు. క్రీస్తులేని నాడు మనం నిస్సహాయులమని గుర్తించాల్సి ఉండగా మనం నిరాశకులోను కాకుండా సిలువ పొంది తిరిగి లేచిన రక్షకుని యోగ్యతలమీద ఆధారపడి ఉండాలి. చూసి బతకగలం. యేసు తన మాట ఇచ్చాడు. తన వద్దకు వచ్చేవారందరినీ ఆయన రక్షిస్తాడు. స్వస్థత పొందాల్సిన కోట్లాది ప్రజలు ఆయన్ను విసర్జించినప్పటికీ ఆయన యోగత్యల్ని నమ్ముకొన్న ఒక్క వ్యక్తి కూడా నశించటానికి మిగలి ఉండడు.PPTel 426.1

    రక్షణ ప్రణాళికను గూర్చిన మర్మమంతా తేటతెల్లమయ్యేవరకు క్రీస్తును స్వీకరించటానికి ఇష్టపడనివారు చాలామంది ఉన్నారు. వేలాదిమంది క్రీస్తు సిలువను చూసి ఆ చూపులోని శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకొన్నప్పటికీ వారు విశ్వాసపు చూపును నిరాకరిస్తారు. దేవుడిచ్చిన నిదర్శనాన్ని తోసిపుచ్చి కారణాల్ని, నిదర్శనాల్నీ వెదుక్కుంటూ అనేకమంది వేదాంత సిద్ధాంతాల పరిశీలనలో కొట్టుమిట్టాడు తున్నారు. నీతి సూర్యుడి వెలుగుకు కారణాల్ని విశదం చేసే వరకూ ఆ వెలుగులో నడవటానికి నిరాకరిస్తారు. ఈ రకంగా ప్రవర్తించే వారందరు సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని పొందలేరు. దేవుడు ఎన్నడూ సందేహించటానికి అవకాశం లేకుండా చేయడు. విశ్వాసానికి ఆధారంగా చాలినంత నిదర్శనాన్ని ఆయన ఇస్తాడు. ఆ నిదర్శనాన్ని అంగీకరించనప్పుడు మనసులో చీకటి చోటు చేసుకొంటుంది. పాము కాటుకు గురి అయినవారు సర్పంవంక చూడకముందు సందేహానికి లోనై చూపు మానేసి ఉంటే వారు మరణించేవారే. చూడటం మన ప్రథమ కర్తవ్యం. విశ్వాసపు చూపు మనకు జీవం ప్రసాదిస్తుంది.PPTel 426.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents