Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    10—బాబెలు గోపురం

    కొద్దికాలం క్రితమే జలప్రళయం వల్ల నాశనమైన భూమిని తిరిగి జనులతో నింపటానికి దేవుడు నోవహు కుటుంబాన్ని భద్రంగా కాపాడాడు. అతనితో దేవుడీ మాటలన్నాడు, “నీ తరములో నీవే నా యెదుట నీతిమంతుడవైయుండుట చూచితిని” ఆదికాండము 7:1. అయినా జలప్రళయానికి పూర్వం లోకంలో కనిపించిన లక్షణాలే నోవహు ముగ్గురు కుమారుల్లోనూ కనిపించాయి. మానవజాతి స్థాపకులు కావలసి ఉన్న షేము, హాము, యా పెత్తుల్లో వారి సంతతి వారి ప్రవర్తన ప్రతిబింబించింది.PPTel 106.1

    ఆత్మావేశం వల్ల మాట్లాడూ నోవహు తన ఈ ముగ్గురు కుమారులనుంచి రానున్న మూడు జాతుల చరిత్రను ప్రావచనికంగా చెప్పాడు. హాము వంశావళిని తండ్రి నుంచి కాక కుమారుణ్నంచి ఆరంభిస్తూ నోవహు ఇలా ప్రకటించాడు. “కనాను శపింపబడినవాడై తన సహెూదరులకు దాసానుదాసుడగును”. హాము చేసిన అస్వాభావిక నేరం అతడికి తల్లిదండ్రుల పట్ల గౌరవం ఎప్పటినుంచో లేదని రూఢిపర్చింది. అది అతడి భక్తిహీనతను ముష్కర ప్రవర్తనను కనపర్చింది. ఈ దుర్గుణాలు కనానులోను తన సంతతిలోను కొనసాగి వారి మీదికి దేవుని తీర్పులు తెచ్చా యి.PPTel 106.2

    ఇకపోతే, షేము యా పెతులు తండ్రి పట్ల తన్మూలంగా దైవ విధులపట్ల, కనపర్చిన గౌరవం వారి సంతతికి మంచి భవిష్యత్తు ఉన్నదని సూచించింది. ఈ కుమారుల గురించి ఇలా ప్రకటించాడు, “మేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక కనాను అతనికి దాసుడగును. దేవుడు యా పెతును విశాల పరచును అతడు షేము గుడారములలో నివసించును. అతనికి కనాను దాసుడగును”. షేము సంతతి ఎన్నిక అయిన జనాంగం, దేవుని నిబంధన ప్రజలు. వారు వాగ్రత్త రక్షకుని వంశావళి కావాల్సి ఉన్నది. యెహోవా షేము దేవుడు. అతని సంతతి నుంచే అబ్రాహామ, అబ్రాహాము ద్వారా ఇశ్రాయేలు ప్రజలు, క్రీస్తు రావాల్సి ఉన్నారు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు” కీర్తనలు 144:15. యా పెతు సంతతివారు ముఖ్యంగా సువార్త దీవెనల్ని పంచుకోవాల్సి ఉన్నారు. కనాను సంతతి ప్రజలు అతి నీచమైన అన్యమతాల్ని అవలంబించారు. దేవుని శాపం వల్ల వారు బానిసలవ్వాల్సి ఉన్నా కొన్ని శతాబ్దాల వరకూ అది అమలుకాలేదు. తన సహనం హద్దుల వరకూ దేవుడు వారి భక్తి హీనతను దుర్నీతిని సహించాడు. అప్పుడు వారు షేము యా పెతుల సంతతికి బానిసలయ్యారు.PPTel 106.3

    నోవహు ప్రవచనం, అకారణంగా చేసిన ఖండనగాని చూపిన అభిమానంగాని కాదు. అది తన కుమారుల ప్రవర్తనను వారి భవిష్యత్తును నిర్ధారించలేదు. కాని తాము ఎన్నుకొన్న జీవన విధానం, తాము నిర్మించుకొన్న ప్రవర్తన ఫలితాలు ఎలాంటివో అది సూచించింది. తమ ప్రవర్తన దృష్ట్యా వారి విషయంలోను వారి సంతతి విషయంలోను దేవుని ఉద్దేశాన్ని అది ప్రకటించింది. సాధారణంగా పిల్లలకు తల్లిదండ్రుల మనస్తత్వాలు ప్రవృత్తులు సంక్రమిస్తాయి. పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. తరతరాలుగా తల్లిదండ్రుల దోషాల్నే పిల్లలు కొనసాగిస్తారు. ఈ రీతిగా హము ముష్కరత్వం అతడి సంతతివారిలో కొనసాగి అనేక తరాలవరకు ఆ శాపానికి వారికి గురిచేసింది. “ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును” ప్రసంగి 9:18.PPTel 107.1

    ఇక షేము మాటకొస్తే, తండ్రిపట్ల గౌరవం చూపిన షేము గొప్ప ప్రతిఫలం పొందాడు. అతడి వంశంలోని పరిశుద్ధులు ఎంతగొప్ప భక్తిపరులు! “నిర్దోషుల చర్యలను యెహోవ గుర్తించుచున్నాడు” “వారి సంతానపు వారు ఆశీర్వదించ బడుదురు” కీర్తనలు 37:18,6. “కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన అజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడుననియు, తనను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడ నియు నీవు తెలిసికొనవలెను.” ద్వితి 7:9. PPTel 107.2

    నోవహు సంతతివారు ఓడ నిలిచిన పర్వతాల మధ్యనే కొంతకాలం నివసించారు. తాను సంతతి పెరిగే కొద్దీ వారి మధ్య మత భ్రష్టత పెరిగి విభజనకు దారితీసింది. సృష్టికర్తను మర్చిపోయి ఆయన ధర్మశాస్త్ర విధుల్ని తోసిపుచ్చినవారు తమ మధ్య భక్తిగా నివసిస్తున్న తమ సహచరుల ఆదర్శాన్ని చూసి బోధనలు విని ఎంతో ఇబ్బంది పడి కొంతకాలం అయిన తర్వాత దైవారాధకులనుంచి విడిపోవటానికి తీర్మానించుకొన్నారు. ప్రయాణమై యూఫ్రటీసు నది తీరాన ఉన్న షినారు మైదానం చేరుకొన్నారు. ఆ సుందర పరిసరాలు, సారవంతమైన నేల వారిని ఆకర్షించాయి. ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకోవటానికి నిశ్చయించుకొన్నారు.PPTel 107.3

    ఇక్కడ ఒక పట్టణం నిర్మించి అందలో ప్రపంచమంతటికి వింతగా నిలిచే ఎత్తయిన గోపురం కట్టాలని తీర్మానించుకొన్నారు. ప్రజలు వేర్వేరు వలసలుగా చెదిరిపోకుండా ఉండేందుకు బాబెలు నిర్మాతలు ఈ కార్యకలపాల్ని తల పెట్టారు. భూమిపై విస్తరించి వృద్ధి చెందడమన్నది దేవుని ఆదేశం. కాని తమ సమాజాన్ని ఒకటిగా కలిపి ఉంచి తుదకు సర్వ ప్రపంచాన్ని పరిపాలించే రాచరికాన్ని స్థాపించాలన్నది వారి ఆకాంక్ష. ఈ రకంగా వారి పట్టణం విశ్వసామ్రాజ్యానికి ప్రధాన నగరం కావాలని దాని మహిమా ప్రాభావాల్ని లోకమంతా అభినందించి దాని నిర్మాతలకు నివాళులర్పించాలని ఆశించారు. ఆకాశాన్నంటే బ్రహ్మాండమైన ఈ గోపురం దాని నిర్మాణకుల శక్తిని వివేకాన్ని సూచించే స్మారక చిహ్నంగా నిలిచి దాని నిర్మాణకుల పేరును తరతరాలుగా స్థిరపర్చాలని వారు ఉద్దేశించారు.PPTel 107.4

    మళ్ళీ భూమిని జల ప్రళయంతో నాశనం చేయనని దేవుడు చేసిన నిబంధనను షీనారు నివాసులు నమ్మలేదు. వారిలో అనేకమంది దేవుడు లేడని నమ్మారు. జలప్రళయం స్వాభావిక కారణాల వల్ల కలిగిందని వాదించారు. అందుకు కయీనుకుమల్లే దేవుని పై తిరుగుబాటు చేశారు. ఇతరులు మానవాతీత శక్తిగల దేవుడు ఉన్నాడని ఆయనే జలప్రళయ పూర్వ ప్రజల్ని నాశనం చేశాడని నమ్మారు. ఇంకోసారి జలప్రళయం సంభవిస్తే తమ్ముతాము కాపాడు కోవాలన్నదే గోపురం కట్టడంలో వారి ముఖ్యోద్దేశం. ప్రళయజలంలా ఎత్తుగా తమ నిర్మాణాన్ని లేపటం ద్వారా తమకేహానీ కలుగకుండా కాపాడుకోగలమని వారు భావించారు. పథక రూపకర్తల అతిశయాన్ని పెంచి భావితరాల ప్రజల మనసుల్ని దేవుని మీద నుంచి మళ్లించి వారిని విగ్రహారాధన ఊబిలో దింపటానికే ఈ తతంగమంతా ఏర్పాటయ్యింది.PPTel 108.1

    గోపురం పాక్షికంగా పూర్తి అయినప్పుడు దానిలో కొంత భాగం నిర్మాణకుల నివాస స్థలంగా కేటాయించారు. తక్కిన భాగాల్ని అందంగా అలంకరించి వాటిని తమ విగ్రహాలకు ప్రత్యేకించారు. ప్రజలు ఆనందోత్సావాల్లో తేలి ఆడూ తమ బంగారు వెండి దేవుళ్లను కొనియాడారు. భూమ్యాకాశాల పరిపాలకుడైన దేవునికి ఎదురు తిరిగారు. చక్కగా సాగుతున్న పని అర్థాంతరంగా నిలిచిపోయింది. నిర్మాణకుల కృషిని నిరర్థకం చేయటానికి దేవదూతలు నియమితులయ్యారు. గోపురం బ్రహ్మాండమైన ఎత్తుకి లేచింది. పైనున్న పనివారు కిందివారితో సంభాషించటం అసాధ్యమయ్యింది. అందువల్ల మధ్య మధ్య మనుషుల్ని ఉంచి కావలసిన దినుసులు వస్తువుల నిమిత్తం, తమ కిందివారికి వార్తల్ని అందించటానికి వసతి కల్పించారు. ఇలా వారు పరస్పరం వర్తమానాలు అందించుకొంటున్న సమయంలో వారి భాషలు తారుమారయ్యాయి. కావాలన్న దినుసులు కాక అవసరంలేనివి అందజేయటం జరుగుతున్నది. వస్తువులు కోసం చెప్పిన మాటల్ని కిందివారు వ్యతిరేకంగా అర్థం చేసుకోటం మొదలయ్యింది. గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పని ఆగిపోయింది. పనిలో సమన్వయంగాని, సహకారం గాని ఇక లేకపోయింది. తమ మద్య చోటు చేసుకున్న విపరీతమైన భాషా భేదాన్ని నిర్మాణకులు వివరించలేకపోయారు. ఆవేశంతో వారు ఒకర్నొకరు నిందించుకున్నారు. వారి కూటమి కొట్లాటతోను రక్తపాతంతోను అంతమొందింది. దేవుని అసమ్మతికి సూచికగా ఆకాశం నుంచి పిడుగులు పడి గోపురం శిఖరాన్ని కూల్చివేశాయి. పరలోకం నుంచి పరిపాలించే దేవుడున్నాడని మనుషులు గుర్తించారు.PPTel 108.2

    అప్పటిదాకా మనుషులందరూ ఒకే భాష మాట్లాడారు. ఇక ఇప్పుడు ఒకరి భాష ఒకరు అర్థం చేసుకోగలిగినవారందరూ గుంపులు గుంపులు అయ్యారు. కొందరు ఒక దారిని వెళ్తే కొందరు ఇంకోదారిని వెళ్లారు. “అలాగు యెహోవా అక్కడ నుండి భూమి యందంతట వారిని చెదరగొట్టెను” ఇలా చెదిరిపోటం భూమిని జనులతో నింపటానికి ఒక మార్గం అయ్యింది. దేవుని ఉద్దేశానికి గండి కొట్టటానికి మనుషులు ఏ సాధనాల్ని ఉపయోగించారో వాటినే ఉపయోగించి దేవుడు తన ఉద్దేశాన్ని ఇలా నెరవేర్చుకొన్నాడు.PPTel 109.1

    అయితే దేవున్ని వ్యతిరేకించిన వారికి ఇదెంత హాని కలిగించింది! సత్యజ్యోతి భావితరాల ప్రజలకు ప్రకాశవంతంగా వెలుగుతూ అందాలన్న ఉద్దేశంతో మనుషులు భూమిపై పలు ప్రాంతాలకు వెళ్లి నివసించి జాతులు స్థాపించాలని దేవుడు కోరాడు. నీతి ప్రబోధకుడు నోవహు జలప్రళయం అనంతరం మూడు వందల ఏభై సంవత్సరాలు నివసించాడు. షేము అయిదు వందల సంవత్సరాలు జీవించాడు. వారి సంతతి వారు దైవ విధులేమిటో తమ పితరులతో దేవుడు ఎలా వ్యవహరించాడో తెలుసుకోటానికి ఇలా వారికి అవకాశం లభించింది. కానీ ఆ ప్రియ సత్యాల్ని వినటానికి వారు ఇష్టంగా లేరు. దేవుని గూర్చి తెలుసుకోవాలన్న కోరిక వారికి లేదు. సత్యాన్ని అందించగలవారు భాషల తారుమారు ఫలితంగా సత్యాన్ని వారికి అందించలేకపోయారు.PPTel 109.2

    గోపుర నిర్మాణకులు దేవునికి వ్యతిరేకంగా సణగటం మొదలు పెట్టారు. ఆదాము పట్ల ఆయన చూపించిన కృప విషయంలోను నోవహుతో ఆయన చేసుకొన్న నిబంధన విషయంలోను కృతజ్ఞులై ఉండే బదులు ఆదామవ్వల్ని ఏదెను నుంచి బహిష్కరించినందుకు జలప్రళయంతో ప్రపంచాన్ని నాశనం చేసినందుకు కఠిన హృదయుడంటూ ఆయనను విమర్శించారు. విచిత్రమేమిటంటే దేవుడు నిరంకుశ ప్రభువు, కఠినుడు అంటూనే మిక్కిలి క్రూరుడైన సాతానుని వారు అంగీకరించారు. క్రీస్తు మరణానికి ముంగుర్తు అయిన బలి అర్పణల విషయం ద్వేషం పుట్టించడానికి అతడు ప్రయత్నించాడు. విగ్రహారాధనతో ప్రజల మనసులు మసకబారినప్పుడు ఈ ఆరోపణలకు నకిలీలు తయారుచేసి తమ సొంత బిడ్డల్ని తమ దేవుళ్లకు బలి ఇవ్వటానికి వారిని నడిపించాడు. మనుషులు దేవుని విడిచి పెట్టి దూరంగా వెళ్లిపోవటంతో న్యాయం, పవిత్రత, ప్రేమవంటిదైన గుణాల స్థానే హింస, దౌర్జన్యం, క్రూరత్వం నెలకొన్నాయి.PPTel 109.3

    బాబెలు జనులు దైవ ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా స్వతంత్ర ప్రభుత్వాన్ని స్థాపించాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. వారిలో కొందరు దేవునికి భయపడేవారు కూడా ఉన్నారు. కాని భక్తిపరులుగా నటించిన భక్తిహీనులు వారిని తమ కుతంత్రాల్లోకి ఆకర్షించారు. నమ్మకంగా ఉన్న వీరిని బట్టి దేవుడు తన తీర్పుల్ని ఇవ్వటంలో కొంత జాప్యం చేసి తమ నిజమైన ప్రవర్తనను బయలుపర్చుకోటానికి ప్రజలకు తరుణం ఇచ్చాడు. ఈ కాలంలో వారిని తమ ఉద్దేశం నుంచి మరల్చటానికి దేవుని కుమారులు కృషి చేశారు. కాని ప్రజలు ఆ దైవ వ్యతిరేక కార్యాన్ని నిర్వహించటానికే కృత నిశ్చయు లయ్యారు. వారు తమ పథకాన్ని ఆటంకం లేకుండా కొనసాగించగలిగి ఉంటే ప్రారంభ దశలో ఉన్న లోకాన్ని అధైర్యంతో నింపి ఉండేవారే. వారిది తిరుగుబాటు ద్వారా స్థాపితమైన కూటమి. అది ఆత్మ ఔన్నత్యానికి స్థాపించాలనుకొన్న రాజ్యం . దేవుని పాలనగాని ఆయనకు గౌరవంగాని ఉండని రాజ్యం . ఈ కూటమికి అనుమతి లభించి ఉంటే లోకంలోనుంచి నీతిని - దానితోపాటు శాంతి, సంతోషం, భద్రతల్ని బహిష్కరించ టానికి ఒక శక్తిరమంతమైన అధికారం ఏర్పడేది. “పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమైనదియు” (రోమా 7:12) అయిన దైవ ధర్మశాస్త్రానికి మారుగా తమ స్వార్థ హృదయాల ఉద్దేశాల్ని నెరవేర్చి నియమాల్ని అమలు పర్చటానికి మనుషులు ప్రయత్నిస్తున్నారు.PPTel 110.1

    దేవునికి భయపడేవారు ఆయన కలుగజేసుకోవాలంటూ మొర పెట్టారు. “యెహోవా ప్రపంచం పై దయతలచి గోపుర నిర్మాణకుల ఉద్దేశాల్ని నిరర్థకం చేసి వారు నిర్మించిన సాహస స్మారక చిహ్నాన్ని పడగొట్టాడు. తన కృపతో వారి భాషను తారుమారు చేసి తిరుగుబాటకు నడిపేవారి ఉద్దేశాలకు కళ్లెం వేశాడు. మనుషుల అవిధేయతను దేవుడు దీర్ఘకాలం సహించి పశ్చాత్తాపపడటానికి వారికి అవకాశ మిస్తాడు. కాని తన పరిశుద్ధ ధర్మశాస్త్రాధికారాన్ని ప్రతిఘటించటానికి వారి ప్రయత్నాలన్నిటినీ గమనిస్తాడు. రాజదండాన్ని పట్టుకొని తన చేతిని చాపి అప్పుడప్పుడూ పాపాన్ని నిలువరిస్తాడు. అనంత జ్ఞానం, ప్రేమ, సత్యానికి నిలయమైన విశ్వసృష్టి కర్త భూపరలోకాల సర్వోన్నత పరిపాలకుడైన ఆయన అధికారాన్ని ధిక్కరించి శిక్ష పొందకుండా నివసించటం ఎవరికీ సాధ్యం కాదని సూచించే నిదర్శనం ఎంతో ఉన్నది.PPTel 110.2

    బాబేలు నిర్మాణకుల పథకాలు సిగ్గుతో పరాజయంతో అంతమొందాయి. వారి అతిశయానికి చిహ్నం కావలసింది వారి అవివేకానికి చిహ్నమయ్యింది. అయినా మనుషులు నిత్యం అదే మార్గాన్ని అనగా దేవుని ధర్మశాస్త్రాన్ని తోసిపుచ్చి తమ్మును తామే నమ్ముకొనే మార్గాన్ని అనుసరిస్తున్నారు. సాతాను పరలోకంలో అవలంబించటానికి ప్రయత్నించిన సూత్రం ఇదే. కయీను అర్పణ వెనుక ఉన్న సూత్రం కూడా ఇదే.PPTel 111.1

    మన కాలంలోనూ గోపుర నిర్మాణకులున్నారు. విజ్ఞాన శాస్త్రపు ఊహాగానాల పై నాస్తికులు తమ సిద్ధాంతాల్ని నిర్మించుకొని ప్రకటితమైన దైవ కార్యాన్ని తోసిపుచ్చుతారు. దేవుని నీతి ప్రభుత్వం పై తీర్పు తీర్చటానికి పూనుకొంటారు. దేవుని ధర్మశాస్త్రాన్ని ద్వేషించి మానవ జ్ఞానం గురించి అతిశయపడ్డారు. “దుష్ క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచిన మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రి యలు చేయుదురు” ప్రసంగి 8:11.PPTel 111.2

    క్రైస్తవ మతావలంబకులమని చెప్పుకొంటున్న అనేకమంది బైబిలు బోధించే స్పష్టమైన బోధనల్ని పక్కన పెట్టి మానవుల ఊహాగానాలు కల్పిత కథల పై తమ విశ్వాసాన్ని నిర్మించుకొని పరలోకం చేరటానికి తమ గోపురం ఒక మార్గమని బోధిస్తారు. అపరాధి చావకూడదని, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరించకుండా రక్షణ పొందవచ్చునని బోధించే వాగ్దాటి గల ప్రసంగికులను అభినందించి వారి చుట్టూ తిరుగుతూ క్రీస్తు అనుచరులమని చెప్పుకొనే భక్తులు దేవని ప్రమాణాల్ని అంగీకరిస్తే అది వారిని ఐక్యతలోకి నడుపుతుంది. అలాక్కాక వారు దేవుని పరిశుద్ద వాక్యానికి పైగా మానవ జ్ఞానాన్ని హెచ్చించినంతకాలం చీలికలు అసమ్మతి ఉంటూనే ఉంటాయి. వివిధ విశ్వాసాలు మతశాఖలతో కూడిన ప్రస్తుత గందరగోళ పరిస్థితని “బబులోను” అన్నపదం చక్కగా వర్ణిస్తున్నది. ఈ పదాన్ని ప్రవచనం (ప్రకటన 14:8, 18:2), లోకాన్ని ప్రేమించే చివరి దినాల సంఘాలకు అన్వయిస్తున్నది.PPTel 111.3

    సిరులకు అధికారాన్ని సంపాదించి వాటినే తమ పరలోకంగా భావించటానికి అనేకమంది ప్రయత్నిస్తారు. “ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు” కీర్తనలు 73:8. వారు మాత్రం ప్రజల హక్కుల్ని కాలరాస్తారు, దైవాధికారాన్ని తృణీకరిస్తారు. గర్విష్టులు కొంతకాలం అధికారం చేపట్టి తాము తల పెట్టిందంతా విజయవంతం కావటం చూస్తారు. కాని చివరికి వారికి మిగిలేది నిరాశ నిస్పృహలే.PPTel 111.4

    దేవుని దర్యాప్తు ప్రక్రియకు సమయమయ్యింది. మహోన్నతుడు నరులు నిర్మించిన కట్టడాన్ని చూడటానికి దిగివస్తాడు. ఆయన తన సార్వభౌమాధికారాన్ని ప్రదర్శిస్తాడు. మానవుడి అతిశయ కార్యాలు మరుగున పడ్డాయి. “యెహోవా ఆకాశములోనుండి కని పెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయనున్న స్థలములో నుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు” “అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్పలముగా జేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును” కీర్తనలు 33:13, 14, 10, 11.PPTel 112.1

    భూమిపై ముగించాల్సిన పనిలో దేవదూతలు వారితో చెయ్యి కలిపి పనిచేస్తారు. అబ్రాహాము ఐగుప్తులో ఉన్న కాలంలో అతనిలో మానవ బలహీనతలు లోటుపాట్లు ఉన్నట్లు నిదర్శనం కనిపించింది. శారయి తన భార్య అన్న సంగతి దాచి పెట్టటంలో దేవుని కాపుదల శ్రద్ధల పై తన నమ్మకాన్నీ, తన జీవితం పొడుగునా కనపర్చుతూ వచ్చిన ఉదాత్త విశ్వాసాన్ని, ధైర్యాన్ని నిరర్థకం చేశాడు. శారయి సౌందర్యవతి, నల్లని ఐగుప్తు మనుషులు రూపవతి అయిన ఆమెను ఆశిస్తారన్నది. కాదు అతని అనుమానం. ఆమెను సంపాదించటానికి ఆమె భర్తను చంపుతారన్నదే అతని భయం. శారయి తన సోదరి అని చెప్పటంలో తాను అబద్ద మాడటం లేదని ఎందుకంటే ఆమె తన తల్లికి పుట్టకపోయినా తన తండ్రికి పుట్టిందేనని సమర్థించుకున్నాడు. కాని వారి వాస్తవ సంబంధం విషయంలోని ఈ దాపరికం వంచన. న్యాయవర్తనలో ఏ కొద్దిపాటి వక్రతకూడా దేవునికి సమ్మతంకాదు. అబ్రాహాము విశ్వాసంలోని లోటుమూలంగా శారయి గొప్ప ప్రమాదంలో చిక్కుకొన్నది. శారయి సౌందర్యాన్ని గురించి విన్న ఐగుప్తురాజు వివాహం చేసుకొనే ఉద్దేశంతో ఆమెను తన రాజభవనానికి రప్పించాడు. అయితే రాజకుటుంబం మీదికి తీర్పులు పంపటం ద్వారా ప్రభువు శారయిని పరిరక్షించాడు. రాజు ఈ విధంగా అసలు విషయాన్ని తెలుసుకొని అబ్రాహాము చేసిన మోసానికి అతణ్ణి గద్దించి ఇలా అన్నాడు, “నీవు నాకు చేసినదేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని యేల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితేనేమి? ఇదిగో నీ భార్య; ఈమెను తీసికొని పొమ్ము”.PPTel 112.2

    రాజుకి అబ్రాహాముపట్ల విస్తారమైన సద్భావన ఉన్నది. ఇంత జరిగాక కూడా అతనికిగాని అతని బృందానికిగాని ఏ హానీ జరగటం ఫరోకి ఇష్టం లేక ఒక భటుడ్ని పిలిచి అబ్రాహామును అతని పరివారాన్ని క్షేమంగా తన రాజ్యం పొలిమేరల్ని దాటించమని ఆజ్ఞాపించాడు. ఐగుప్తీయులు పరదేశులైన గొర్రెల కాపరులతో కలిసి తినటం, తాగటం వంటివి చేయకూడదంటూ ఈ సమయంలో చట్టాలు రూపొందించారు. ఫరో అబ్రాహాముపట్ల ఉదారంగా వ్యవహరించాడు. కాని అతడు ఐగుప్తులో ఉండటానికి వీలులేదని చెప్పాడు. అజ్ఞానంవల్ల రాజు అబ్రాహాముకి గొప్ప హాని చేయటానికి సిద్ధమయ్యాడు. కాని దేవుడు కలుగజేసుకొని మహాపాతకం చేయకుండా రాజును కాపాడాడు. అబ్రాహాములో దేవుని అనుగ్రహాన్ని పొందిన వ్యక్తిని ఫరో చూశాడు. దేవుని ఆదరానుగ్రహాల్ని పొందిన వ్యక్తి తన రాజ్యంలో ఉండటం ఫరోకు భయం పుట్టించింది. అబ్రాహాము ఐగుప్తులోనే ఉంటే పెరుగుతున్న తన సంపద, ప్రతిష్టవల్ల ఆ దేశస్తులు అసూయపడి దురాశతో నిండి అతనికి హాని తల పెట్టవచ్చును. దానికి ఫరోని బాధ్యుడుగా ఎంచటం రాజు కుటుంబం పై దేవుని తీర్పులు పడటం జరగవచ్చు. PPTel 112.3

    అన్య ప్రజలతో అబ్రాహాము సంబంధాల విషయంలో అబ్రాహాము ఆరాధించే దేవుడు అతడ్ని కాపాడాడని అతనికి అపకారం జరిగితే దానికి ప్రతీకారం జరుగుతుందని ఫరోకి దేవుడు పంపిన హెచ్చరికను బట్టి వ్యక్తమయ్యింది. పరలోక రాజు బిడ్డల్లో ఏ ఒకరికి అన్యాయం జరిగినా అది ప్రమాద భరితం. “అభిషేకించబడిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తులకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన వారికొరకు రాజులను గద్దించెను” (కీర్త 105:14, 15) అని ఎన్నుకోబడ్డ వారిని గురించి కీర్తనకారుడు అన్నప్పుడు అబ్రాహాము అనుభవంలోని ఈ అధ్యాయం గురించి మాట్లాడున్నాడు.PPTel 113.1

    అబ్రాహాముకి ఐగుప్తులో కలిగిన అనుభవానికి శతాబ్దాల అనంతరం అతని సంతతి ప్రజల అనుభవానికి దగ్గర పోలికలున్నాయి. ఇరువురూ కరవు మూలంగా ఐగుప్తు వెళ్లారు. ఇరువురూ ఆ దేశంలో సంచరించారు. వారి తరపున దేవుని తీర్పుల కారణంగా ఐగుప్తీయులికి వారంటే భయం పుట్టింది. అన్యుల బహుమతులతో ధనికులై గొప్ప సంపదతో ఇరువరూ బైటికి వెళ్లారు.PPTel 113.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents