Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    20—ఐగుప్తలో యోసేపు

    కాగా తనను కొన్న వ్యాపారులతో కలసి యోసేపు ఐగుప్తుకి వెళ్తున్నాడు. ప్రయాణికుల బృందం కనాను సరిహద్దుల దిశగా దక్షిణానికి ప్రయాణిస్తున్నప్పుడు అల్లంత దూరాన ఉన్న కొండలు వాటి నడుమ ఉన్న తన తండ్రి గుడారాలు ఆ బాలుడి మనసులో మెదిలాయి. తన ఒంటరితనంలో శ్రమల్లో మిక్కిలి ప్రియమైన తన తండ్రిని తలచుకొని ఎంతగానో విలపించాడు. దోతానులోని దృశ్యం మళ్లీ అతడి కళ్లముందు నిలిచింది. కోపోద్రిక్తులైన తన అన్నల్ని చూశాడు. వారి భయంకర చూపులు తనమీద పడటం చూశాడు. వేదనతో తాను చేసిన విజ్ఞాపనలకు జవాబుగా వారు పలికిన పదునైన అవమానకరమైన మాటలు అతడి చెవుల్లో గింగురుమని మోగాయి. దడదడ వణుకుతున్న హృదయంతో భవిష్యత్తుకు ఎదురు చూశాడు. అల్లారుముద్దుగా పెరిగిన కొడుకు ఇప్పుడు ఆదరణలేని నిస్సహాయుడైన బానిసగా మారటం ఎంత విచిత్రమైన మార్పు! నా అన్నవాళ్లు లేని ఒంటరివాడు. తాను వెళ్తున్న ఆ పరాయిదేశంలో అతడి గతి ఏమి కానుంది? కొంత సేపు యోసేపు అవిమాలిని దు:ఖానికి, భయానికి లోనయ్యాడు.PPTel 203.1

    ఏమైనా దేవుని సంకల్పం ప్రకారం ఈ అనుభవం సయితం అతడికి ఒక దీవెన కానున్నది. కొన్ని సంవత్సరాల్లో కూడా నేర్చుకొని ఉండలేని పాఠాల్ని కొన్ని గంటల్లోనే అతడు నేర్చుకొన్నాడు. తండ్రి అతణ్ని అమితంగా ప్రేమించి అతడిపట్ల పక్షపాతంగా వ్యవహరించటంలో అతడికి తీరని అన్యాయం చేశాడు. తండ్రి యోసేపు పట్ల చూపించిన అవివేకమైన ఈ పక్షపాతపు ప్రేమ తన అన్నలకు కోపం పుట్టించి తనను ఇంటినుంచి దూరం చేసిన ఆ ఘోర కృత్యానికి వారు పాల్పడేటట్లు చేసింది. అతడి ప్రవర్తనలో కూడా దాని ఫలితాలు కనిపించాయి. సరిదిద్దాల్సిన దోషాల్ని తండ్రి ఉపే క్షించాడు. ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని అతడు భావించటం మొదలు పెట్టాడు. తండ్రి మమకారానికి శ్రద్ధాసక్తులకు అలవాటుపడ్డ యోసేపు తన ముందున్న బాని జీవితంలో శ్రమలకు, బాధలకు సంసిద్ధంగా లేడు.PPTel 203.2

    ఆ తరుణంలో అతడి ఆలోచనలు తన తండ్రి దేవుని మీద నిలిచాయి. తన చిన్నతనంలో దేవుని ప్రేమించటం నేర్చుకొన్నాడు. యాకోబు తన తండ్రి గృహం నుంచి పారిపోతున్న సమయంలో తనకు కలిగిన దర్శనాన్ని గూర్చిన కథను యోసేపు తన తండ్రి గుడారంలో తరచుగా వినేవాడు. దేవుడు యాకోబుకు చేసిన వాగ్దానాలగురించి, అవి నెరవేరటం గురించి, తాను అవసరంలో ఉన్నప్పుడు దేవుని దూతలు వచ్చి తనకు ఉపదేశం, ఓదార్పు సంరక్షణ ఇవ్వటం గురించి తండ్రి చెప్పటం వినేవాడు. మానవుడికి విమోచకుడ్ని ఏర్పాటు చేయటంలో దేవుడు కనపర్చిన ప్రేమనుగూర్చి నేర్చుకొన్నాడు. ఇప్పుడు ఈ పాఠాలన్నీ స్పష్టంగా జ్ఞాపకం వచ్చాయి. తన తండ్రుల దేవుడే తన దేవుడని యోసేపు విశ్వసించాడు. అక్కడే అప్పుడే తన్ను తాను దేవునికి పూర్తిగా సమర్పించుకొన్నాడు. తాను నివసించబోతున్న దేశంలో తనతో ఉండ వలసిందిగా ఇశ్రాయేలును కాపాడే దేవున్ని ప్రార్థించాడు.PPTel 203.3

    యోసేపు అన్ని పరిస్థితుల్లోను పరలోక రాజ్య పౌరిడిగా ప్రవర్తించటానికి దేవునికి నమ్మకంగా నిలవటానికి ధృఢంగా సంకల్పించుకొన్నప్పుడు అతడి హృదయం ఎంతో ఆనందించింది. పూర్ణ హృదయంతో దేవుని సేవించటానికి తీర్మానించుకొన్నాడు. తన జీవితంలో ఎదురయ్యే శ్రమల్ని ధైర్యంగా భరిస్తూ తన విధుల్ని నమ్మకంగా నిర్వహించాలని నిర్ధారణ చేసుకొన్నాడు. జీవితంలో తనకు సంభవించిన విపత్తు అతణ్ని ఒక ముద్దు బిడ్డ నుంచి ఆలోచన పరుడు సాహసికుడు అయిన మనిషిగా మార్చింది.PPTel 204.1

    ఐగుప్తు చేరిన వెంటనే యోసేపును రాజు సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరుకు అమ్మారు. పొతీఫరు కొలువులో అతడు పదిసంవత్సరాలు పనిచేశాడు. ఇక్కడ అతడికి ఎదురైన శోధనలు సామాన్యమైనవి కావు. అతడి చుట్టూ విగ్రహారాధన ఉంది. రాజ కుటుంబ సభ్యులు ఆడంబరంతో అబద్ధ దేవుళ్లను పూజిస్తున్నారు. ఆ దినాల్లో లోకంలో మిక్కిలి నాగరికమైన భాగ్యవంతమైన ఆ జాతి ప్రజలు అట్టి పూజను బలపర్చారు. అయినా యోసేపు తన నిరాడంబరతను దేవుని పట్ల తన విశ్వసనీయతను కాపాడుకొన్నాడు. తనచుట్టూ దుర్మార్గత కనిపించింది, దుష్టత వినిపించింది. నిషిద్దాంశాల గురించి అతడు ఆలోచించలేదు. ఐగుప్తీయుల అభిమానం పొందటానికి అతడు తన నియమాల్ని దాచి పెట్టలేడు. అది చేసి ఉంటే అతడు శోధనను జయించేవాడు కాదు. అయితే అతడు తన తండ్రి విశ్వాసాన్ని అనుసరించటం గురించి సిగ్గుపడలేదు. తాను యెహోవాను పూజించే వాణ్ణన్న విషయం దాచి ఉంచటానికి ప్రయత్నించలేదు.PPTel 204.2

    “యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్థిల్లుచు తన యజమానుడగు ఈ ఐగుప్తీయుని యింట నుండెను.యెహోవా అతనికి తోడైయుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు” చూశాడు. యోసేపు పై పొతీఫరు నమ్మకం రోజు రోజు పెరిగింది. చివరికి పొతీఫరు అతణ్ని తన యింటిమీద విచారణకర్తగా నియమించాడు. అతడికి తన ఆస్తిమీద నియంత్రణాధికారాన్నిచ్చాడు. “అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమీ ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు”.PPTel 204.3

    యోసేపు చేపట్టినదంతా వర్థిల్లటం ప్రత్యక్ష సూచక క్రియ ఫలితం కాదు. కాని అతడి పరిశ్రమ, పనిలో అతడి జాగరూకత, ఆసక్తి వీటిని దేవుడు ఆశీర్వదించాడు. తన విజయానికి తన దేవుడే మూలమని యోసేపు చెప్పేవాడు. విగ్రహారాధకుడైన అతడి యజమానుడు తన అపూర్వ అభివృద్ధికి రహస్యం ఇదేనని అంగీకరించాడు. ధృఢమైన కృషిలేకపోతే జయం కలిగి ఉండేది కాదు. విశ్వాసులు పరిశుద్ధత విషయంలో నీతి విషయంలో విగ్రహారాధకులకు భిన్నంగా ఉండాలి. అన్యమతం చీకటిలో దేవుని కృప ఈ విధంగా ప్రకాశించవచ్చు.PPTel 205.1

    అయితే భయంకర శ్రమల కొలిమిలో యోసేపు భక్తి విశ్వాసాలు పరీక్షకు నిలబడాల్సి ఉన్నాయి. అతడి యజమాని భార్య దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటానికి ఆ యువకుణ్ని ఆకర్షించటానికి ప్రయత్నించింది. అన్యమతం ప్రబలుతున్న ఆ దేశంలో ఉన్న దుర్మార్గతకు దుర్నీతికి అతడు లొంగలేదు. కాని హఠాత్తుగా, బలంగా, మోసపూరితంగా వచ్చిన ఆ శోధనను ఎదుర్కొనటం ఎలా? ప్రతిఘటన ఫలితం ఏంటో యోసేపుకి బాగా తెలుసు. ఒక పక్క అది ఎవరికీ తెలియకుండా దాగి ఉండ టంలో ఎన్నో లాభాలు, ఉపకారాలు! మరోపక్క అవమానం, ఖైదు, బహుశా మరణం! తన భవిష్యత్తంతా ఆ నిమిషం తాను చేసే తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది నియమం జయమొందుతుందా? యోసేపు ఇంకా దేవునికి నమ్మకంగా నిలుస్తాడా! చెప్పనలవికాని ఆందోళనతో దేవదూతలు ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్నారు.PPTel 205.2

    యోసేపు సమాధానం మత నియమంలోని శక్తిని చాటుతుంది. లోకసంబంధమైన తన యజమానికి అతడు ద్రోహం చెయ్యడు. పర్యవసానం ఏమైనా పరలోకంలోవున్న తన ప్రభువుకి ద్రోహం చేయడు. అనేకులు తమ తోటి మనుషుల సమక్షంలో చేయటానికి సందేహించే పాపాలకు దేవుని సమక్షంలోను ఆయన దూతల సమక్షంలోను పాల్పడుతూ ఉండగా యోసేపు మొట్టమొదటగా దేవుని గురించి తలంచాడు. “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును?” అన్నాడు.PPTel 205.3

    మన క్రియల్ని మాటల్ని దేవుడు చూస్తున్నాడని వింటున్నాడని వాటిని నమ్మకంగా దాఖలు చేస్తున్నాడని మనం అలవాటు చొప్పున గుర్తుంచుకొంటే పాపం చేయటానికి భయపడ్డాం. తాము ఎక్కడున్నా ఏమి చేస్తున్నా తాము దేవుని సముఖంలో ఉన్నామని యువత గుర్తుంచుకోవాలి. మన ప్రవర్తనలో ఏ భాగం కూడా దేవుని నిశిత పరిశీలనను తప్పించుకోలేదు. సర్వోన్నతుని నుంచి మన మార్గాల్ని దాచి ఉంచలేం. కొన్నిసార్లు కఠినమైన మానవ చట్టాన్ని సహితం పట్టుబడకుండా అతిక్రమించవచ్చు. శిక్ష తప్పించుకోవచ్చు. అయితే దైవ ధర్మశాస్త్రంతో అది సాధ్యం కాదు. కన్నుమిన్ను కానని మధ్యరాత్రి కూడా అపరాధికి ఆశ్రయం ఇవ్వలేదు. తాను ఒంటరిగా ఉన్నానని ఒకడు భావించవచ్చు. కాని అక్కడ జరిగే ప్రతీ క్రియకు సాక్ష్యం ఉంటుంది. అతడి ఉదే శాన్ని ఆయన పరీక్షిస్తాడు. లోకం అంతటిలోను ఒకే వ్యక్తి ఉన్నట్లు పరలోకం దృష్టి అతడిమీదే నిలిచి ఉన్నట్లు అతడి ప్రతీ క్రియ ప్రతీ మాట ప్రతీ ఆలోచన స్పష్టంగా గుర్తింపు పొందుతుంది.PPTel 206.1

    తనను శోధించిన స్త్రీ కక్షతో తనమీద తప్పుడు నేరం మోపినందువల్ల తన నిజాయితీకి యోసేపు చెరసాల శిక్ష అనుభవించాడు. భార్య మోపిన నేరాన్ని పొతీఫరు నమ్మి ఉంటే ఆ హెబ్రీ యువకుడు తన ప్రాణాన్ని కోల్పోయేవాడు. అయితే యధార్థత, న్యాయశీలతతో కూడిన అతడి సచ్చీలమే అతడు నిరపరాధి అనటానికి రుజువు. అయినా యజమాని తన కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు యోసేపుని అవమానానికి, దాసత్వానికి గురిచేశాడు.PPTel 206.2

    ఆదిలో జైలు అధికార్లు యోసేపు పట్ల కఠినంగా వ్యవహరించారు. కీర్తన రచయిత ఇలా అంటున్నాడు, “వారు సంకెళ్లతో అతని కాళ్లు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను”. కీర్తనలు 10:18, 19. కాగా చెరసాల చీకటిలో సైతం యోసేపు యధార్థ ప్రవర్తన ప్రకాశిస్తున్నది. అతడు తన విశ్వాసాన్ని ఓర్పును విడిచి పెట్టలేదు. నమ్మకంగా చేసిన సేవకు ఫలంగా అతడు కాఠిన్యాన్ని, క్రూరత్వాన్ని అనుభవించాడు. అయినా అతడు మొహం ముడుచుకొని అందరినీ అనుమానిస్తూ తిరగలేదు. తనలో పాపం లేదన్న స్పృహనుంచి పుట్టిన శాంతి అతడికి ఉన్నది. ఇక అతడు తన సమస్యను దేవుని చేతుల్లో పెట్టాడు. తనకు జరిగిన అన్యాయం గురించి దు:ఖ మొహంతో తిరగలేదు. ఇతరుల కన్నీరు తుడవటంలో తన దు:ఖాన్ని మర్చిపోయాడు. ఖైదులో కూడా అతడు ఒక పనిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఉపయోగకరమైన సేవకు అతణ్ని శ్రమల పాఠశాలలో దేవుడు సిద్ధం చేస్తున్నాడు. తనకు అవసరమైన క్రమశిక్షణను అతడు నిరాకరించలేదు. పరపీడనం, నిరంకుశత్వం, నేరం పర్యవసానాల్ని చూసి, న్యాయం, సానుభూతి కనికరం అన్న పాఠాల్ని యోసేపు చెరసాలలో నేర్చుకొన్నాడు. అధికారాన్ని వివేకంతో దయతో ఉపయోగించటానికి ఈ పాఠాలు అతణ్ని సన్నద్ధం చేశాయి.PPTel 206.3

    యోసేపు క్రమక్రమంగా చెరసాల అధికారి విశ్వాసాన్ని సంపాదించగలిగాడు. ఆ అధికారి యోసేపును ఖైదీలపై అధిపతిగా నియమించాడు. ఖైదులో తాను నిర్వహించిన పాత్ర - అతడు దినదిన జీవితంలో కనపర్చిన నిజాయితీ, కష్టంలోను దు:ఖంలోను ఉన్నవారిపట్ల సానుభూతితో వ్యవహరించటం - ఇవి భవిష్యత్తులో అతడి అభివృద్ధికి గౌరవానికి మార్గం సుగమం చేశాయి. ఇతరులపై మనం ప్రసరించే ప్రతీ కాంతి కిరణం మనమీద ప్రతిబింబిస్తుంది. సరి అయిన ఉద్దేశంతో వ్యవహరిస్తూ, దు:ఖంలో ఉన్నవారికి చెప్పే ప్రతీ దయగల మాట, బాధితుల బాధ నివారణకు చేసే ప్రతీకార్యం, అవసరంలో వున్నవారికి అందించే ప్రతీ సహాయం దాతకు దీవెనగా పరిణమిస్తుంది.PPTel 207.1

    భక్ష్యకారుల నేతను పానదాయకుల నేతను తాము చేసిన నేరాలకు రాజు చెరసాలలో వేశాడు. వారు యోసేపు అజమాయిషీ కిందకి వచ్చారు. ఒక ఉదయం వారు విచారంగా ఉన్నట్లు గమనించి యోసేపు కారణమేంటని అడిగినప్పుడు వారిద్దరికీ విచిత్రమైన కలలు వచ్చాయని వాటి భావం తెలుసుకోటానికి తాము ఆతృతగా ఉన్నామని చెప్పారు. “భావము చెప్పుట దేవుని ఆధీనమే గదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పండి” అన్నాడు. వారిద్దరూ వారి వారి కలలు చెప్పగా యోసేపు వాటి భావాన్ని వారికి చెప్పాడు. మూడుదినాల్లో పానదాయకుడు తిరిగి తన పదవిలో చేరి క్రితంలోలాగే ఫరోచేతికి పానపాత్ర అందిస్తాడని అయితే భక్ష్యకారుడు రాజాజ్ఞమేరకు మరణ దండన పొందుతాడని వివరించాడు. ఈ రెండు సందర్భాల్లోనూ ముందే చెప్పిన ఘటన జరిగింది. PPTel 207.2

    ఆనందదాయకమైన కలభావం చెప్పినందుకు ఇంకా ఎన్నో దయాకార్యాలకు పానదాయకుడు యోసేపుకు కృతజ్ఞతలు చెప్పాడు. తాను అన్యాయంగా చెరసాలలో ఉన్నానని అతిదీనంగా వివరించి తన విషయాన్ని రాజుకు విన్నవించాల్సిందిగా యోసేపు అతణ్ని కోరాడు. “నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలబడితిని. అది నిశ్చయము మరియు ఈ చెరసాలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదు” అన్నాడు. కలలోని ప్రతీ వివరణ నెరవేరినట్లు పానదాయకుల అధిపతి గుర్తించాడు. అయితే అతడు రాజు అనుగ్రహాన్ని తిరిగి పొందినప్పుడు తన ఉపకారిని మర్చిపోయాడు. యోసేపు ఇంకా రెండేళ్లు ఖైదులోనే ఉండిపోయాడు. తన హృదయంలో వెలిగిన ఆశాజ్యోతి ఆరిపోయింది. యోసేపు శ్రమల జాబితాలో కృతజ్ఞత వేసిన కాటు చేరింది.PPTel 207.3

    ఇలా ఉండగా దైవహస్తం చెరసాల ద్వారాలు తెరవటానికి సిద్ధంగా ఉంది. ఒకరాత్రి ఐగుప్తు రాజుకి రెండు కలలు వచ్చాయి. ఆ కలలు ఒకే సంఘటనకు సంబంధించి గొప్ప విపత్తును సూచిస్తున్నాయి. రాజు వాటి ప్రాధాన్యాన్ని నిర్ధారించలేకపోయాడు. అవి అతడి మనసులో భయాందోళనలు నింపుతున్నాయి. ఆ దేశంలోని మాంత్రికులు జ్ఞానులు వాటి భావాన్ని చెప్పలేకపోయారు. రాజు ఆందోళన పెరిగింది. రాజభవనంలో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. ప్రజల్లో చెలరేగిన ఆందోళన ప్రధాన పానదాయకుడికి తాను కన్నకలలను గురించిన పరిస్థితుల్ని జ్ఞప్తికి తెచ్చింది. దానితో పాటు యోసేపును గురించిన జ్ఞాపకం వచ్చింది. తన మరుపు నిమిత్తం కృతఘ్నత నిమిత్తం కాస్త బాధపడ్డాడు. వెంటనే అతడు రాజు వద్దకు వెళ్లి తనకు ప్రధాన భక్ష్యకారుడికి వచ్చిన కలలకు ఒక హెబ్రీ బానిస అర్థం చెప్పాడని అతడు చెప్పినదంతా నెరవేరిందని చెప్పాడు. తన రాజ్యంలోని మాంత్రికుల్ని,PPTel 208.1

    జ్ఞానుల్ని పక్కన పెట్టి ఒక పరదేశిని ఆ మాట కొస్తే ఒక బానిసను సంప్రదించటం ఫరోకి నామోషి. అయినా తన ఆందోలన ఉపశమిస్తుందంటే ఎంత తక్కువవారి సేవనైనా అంగీకరించటానికి రాజు సిద్ధంగా ఉన్నాడు. వెంటనే రాజు యోసేపును పిలిపించాడు. యోసేపు చెరసాల దుస్తులు తీసివేసి చెరసాలలో ఉన్నకాలంలో పెరిగిన తలకు కత్తిరింపు వేయించుకొని గడ్డం చేసుకొని సిద్ధపడ్డ తర్వాత అతణ్ని రాజు సమక్షంలోకి ప్రవేశపెట్టారు.PPTel 208.2

    “ఫరో యోసేపుతో నేనొక కలకంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్నయెడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు అది నావలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను”. యోసేపు రాజుకిచ్చిన జవాబు అతడి నమ్రతను దేవుని పై అతడికున్న విశ్వాసాన్ని ప్రచురపర్చుతున్నది. తనకు విశేష జ్ఞానం లేదని వినయంగా చెప్పాడు. “అది నావలన కాదు” ఈ మర్మాన్ని విశదం చేయగలవాడు దేవుడే అన్నాడు.PPTel 208.3

    అంతట ఫరో తన కలను చెప్పటం మొదలు పెట్టాడు. “నా కల్లో నేను ఏటియొడ్డున నిలుచుంటిని. బలిసినవియు చూపున కందమైన యేడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమై బహు వికారరూపము కలిగి చిక్కిపోయిన మరి యేడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను. అవి వాటి కడుపున పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగానుండెను. అంతలో నేను మేలుకొంటిని. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల యేడు మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను. మరియు తూర్పు గాలిచేత చెడిపోయి యెండిన యేడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మ్రింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియ జెప్పితిని. గాని దాని భావమును తెలుపగల వారెవరును లేరని అతనితో చెప్పెను”.PPTel 209.1

    అందుకు యోసేపు “ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియజేసెను” అన్నాడు. సమృద్ధిగల ఏడు సంవత్సరాలు వస్తాయి. పంటపొలాలు, తోటలు ముందెన్నటికన్నా ఎంతో సమృద్ధిగా పంటలనిస్తాయి. ఆ కాలావధి తర్వాత ఏడు సంవత్సరాల కరవు వస్తుంది. “అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. ఆ కరవు దేశమును పాడుచేయును”. కల మళ్లీ రావటం అది తప్పక నెరవేరుతుందనటానికి నెరవేర్పు సమీపంలో ఉన్న దనటానికి నిదర్శనం. “కాబట్టి ఫరో వివేకము జ్ఞానముగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో దొరకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతి కప్పగించి ఆయాపట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరవుచేత ఈ దేశము నశించిపోకుండ ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగానుండును” అని చెప్పాడు.PPTel 209.2

    కల భావం హేతుబద్ధంగా సంగతంగా ఉంది. అది ప్రతిపాదించిన విధానం జ్ఞానయుతంగా ఉంది. అది సరియైన విధానమనటంలో సందేహం లేదు. అయితే ఈ ప్రణాళిక అమలు ఎవరికి అప్పగించాలి? ఈ ఎంపికలోని విజ్ఞత పైనే ఆ జాతి సంరక్షణ ఆధారపడి ఉంది. రాజు తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. నియామకం సమస్య కొంతకాలం రాజు పరిగణలో ఉంది. చెరసాలను నిభాయించటంలో యోసేపు ప్రదర్శించిన వివేకం, విజ్ఞతల్ని గురించి ప్రధాన పానదాయకుడి ద్వారా రాజు తెలుసుకొన్నాడు. అతడికి విశేషమైన పరిపాలనా దక్షత ఉన్నదని రాజుకి అర్థమయ్యింది. ఆత్మనిందతో బాధపడున్న ప్రధాన పానదాయకుడు తన గత ఉదాసీనతకు ప్రాయశ్చిత్తం చేసుకొంటూ తన ఉపకారి అయిన యోసేపును ప్రశంసించాడు. రాజు అదనంగా చేసిన దర్యాప్తుకూడా తాను విన్నది యధార్థమేనని ధ్రువపర్చింది. తన రాజ్యానికి ఏర్పడ్డ అపాయాన్ని నిర్దేశించి దాన్ని ఎదుర్కొనటానికి అవసరమైన ప్రణాళిక రూపకల్పనను సిద్ధబాటును సూచించగల సమర్ధుడు రాజ్యమంతటిలోను యోసేపు ఒక్కడే కనిపించాడు. తాను సూచించిన ప్రణాళికల్ని అమలు పర్చటానికి అతడే అనగా యోసేపే సమర్థుడని రాజు విశ్వసించాడు. అతడితో శక్తిమంతుడైన దేవుడున్నాడన్నది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశ వ్యవహారాల నిర్వహణకు రాజు అధికార గణంలో సమర్ధులైనవారు ఎవరూలేరన్నది వాస్తవం, అతడి వివేకాన్ని వివేచనను పరిగణలోనికి తీసుకొన్నప్పుడు అతడు హెబ్రీయుడు బానిస అన్న విషయాలు లెక్కలోకి రాలేదు. “ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా?” అని రాజు తన సలహాదారులతో అన్నాడు.PPTel 209.3

    నియామకం తీర్మానమయ్యింది. దాన్ని యోసేపుకు ఈ విధంగా రాజు ప్రకటించాడు, “దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు. నీవు నాయింటికి అధికారివై యుండవలెను. నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు. సింహాసనము విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడినైయుందును”. ఆ మీదట రాజు యోసేపుకి లాంఛనంగా అధికారాన్ని అప్పగించాడు. “ఫరో తన చేతికున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిలో పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసువేసి తన రెండవ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి”.PPTel 210.1

    “అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన యింటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించెను”. కీర్తనలు 105:21, 22. ఐగుప్తు దేశం అంతటిమీద పరిపాలకుడు కావటానికి యోసేపు చీకటి కొట్టునుంచి ఉత్థానుడయ్యాడు. అది గొప్ప గౌరవం గల స్థానమే. అయినా అది కష్టాలు ప్రమాదాల్తో నిండిన స్థానం. ఎత్తయిన స్థానంలో నిలబడటం ప్రమాద భరితం. గాలివాన పర్వత శిఖరాన ఠీవీగా నిలిచివున్న వృక్షాన్ని వేళ్లతో పెకిలించినా లోయలోని అల్పమైన పువ్వుకు హానిచేయకుండా దాన్ని ఎలా ఉంచుతుందో అలాగే సామాన్య జీవితంలో నమ్మకంగా నిజాయితీగా నివసించేవారు లౌకికమైన విజయాలు ప్రతిష్ఠ వెంట ఉండే శోధనల వల్ల గుంతలో పడవచ్చు. అయితే యోసేపు ప్రవర్తన కష్టాల్లోను, సుఖాల్లోను ఒకే విధంగా ఉన్నది. చెరసాలలో ఉన్నప్పుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో ఫరో రాజభవనంలో ఉన్నప్పుడూ అంతే నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఆరాధించే తనవారి నుంచి వేరైనా తాను అన్యుల దేశంలో ఇంకా పరదేశిగానే ఉన్నాడు. కాని తనను దేవుడే నడిపించాడని పూర్తిగా విశ్వసించి ఎల్లప్పుడు దేవుని పై ఆధారపడి తన పదవీ బాధ్యతల్ని నమ్మకంగా నిర్వహించాడు. రాజు, ఐగుప్తులోని గొప్ప వ్యక్తులు యోసేపు ద్వారా నిజమైన దేవుని గూర్చి తెలుసుకున్నారు. వారు తమ విగ్రహారాధనను మానకపోయినప్పటికీ యెహోవాను ఆరాధించే యోసేపు జీవితంలో ప్రదర్శితమైన నియమాల్ని గౌరవించటం నేర్చుకున్నారు.PPTel 210.2

    యోసేపుకి ధృఢ ప్రవర్తన, నిజాయితీ, వివేకం ఎలా వచ్చాయి? చిన్నతనంలో తన ఇష్టానికి గాక విధి నిర్వహణకు అతడు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ బాలుడి యధార్థత, విశ్వాసం, ఉదాత్త గుణం అతడు పెద్దవాడైనప్పుడు అతడి క్రియల్లో వాటి ఫలితాలు చూపించాయి. పవిత్రమైన నిరాడంబరమైన జీవనం, శారీరక, మానసిక శక్తుల అభివృద్ధిని ప్రోది చేసింది. ప్రకృతి ద్వారా దేవునితో మాట్లాడటం, విశ్వాస వారసులకు దేవుడిచ్చిన సత్యాల్ని అనుసరించటం, యోసేపు ఆధ్యాత్మిక స్వభావాన్ని ఉన్నతపర్చి ఎలాంటి అధ్యయనం కన్నా ఎక్కువగా అతడి మనసును విశాలపర్చి పటిష్టం చేసింది. ప్రతీ హోదాలో చిన్న హోదా మొదలుకొని పెద్ద హోదా వరకు విధి నిర్వహణలో విశ్వసనీయత ప్రతీ శక్తిని దానిలోని ఉన్నత సేవకు తర్పీదు చేసింది. సృష్టికర్త చిత్తాన్ననుసరించి నివసించే వ్యక్తి యధార్థమైన, ఉన్నతమైన ప్రవర్తనను నిర్మించుకొంటాడు. “యెహోవాయందలి భయభక్తులే జ్ఞానము, దుష్టత్వము విడుచుటయే వివేకము” యోబు 28:28.PPTel 211.1

    ప్రవర్తనాభివృద్ధిపై చిన్న చిన్న విషయాల ప్రభావాన్ని గుర్తించేవారు బహుకొద్దిమంది. మనకు సంబంధమున్నదేదైనా చిన్న విషయం కాదు. మనం ప్రతి దినం ఎదుర్కొనే వేర్వేరు పరిస్థితులు మన విశ్వసనీయతను పరీక్షించి మనల్ని ఇంకా ఉన్నత బాధ్యతల నిర్వహణకు అర్హుల్ని చేస్తాయి. సాధారణ జీవిత వ్యవహారాల్లో నియమబద్ధంగా వ్యవహరించటం ద్వారా వినోదాలు ఇష్టాయిష్టాలకన్నా విధి నిర్వహణ ప్రధానమని భావించటానికి మనసు అలవాటు పడుంది. ఇలా క్రమశిక్షణ పొందిన మనసులు గాలికి జమ్ముగడ్డి వణికేటట్టు తప్పు ఒప్పుల మధ్య అటు ఇటు ఊగవు. వారు నమ్మకంగా నిజాయితీగా నివసించటానికి తమ్మును తాము తర్ఫీదు చేసుకొన్నారు. కనుక విధి నిర్వహణలో నమ్మకంగా ఉంటారు. మిక్కిలి అల్పమైన వాటిలో వారు నమ్మకంగా ఉంటారు గనుక పెద్ద పెద్ద విషయాల్లో నమ్మకంగా ఉండటానికి శక్తి సంపాదిస్తారు.PPTel 211.2

    యధార్థ ప్రవర్తన ఓఫిరు బంగారం కన్నా విలువైంది. అది లేకుండా మనం గౌరవ ప్రతిష్ఠలు సంపాదించలేం. ప్రవర్తన వంశపారంపర్యంగా వచ్చేది కాదు. అది కొనటానికి దొరకదు. నైతిక యోగ్యత శ్రేష్టమైన మానసిక శక్తులు కాకతాళీయంగా వచ్చేవి కావు. వృద్ధిపర్చుకొంటే తప్ప అతి ప్రశస్తమైన వరాలు ఏమీ ఉపయోగపడవు. యధార్థ ప్రవర్తన నిర్మాణానికి జీవితకాలం పడుతుంది. అది మిక్కిలి శ్రద్ధతో, ఓర్పుతో చేసే కృషి ఫలితం. దేవుడు అవకాశాలిస్తాడు. వాటిని వినియోగించుకోటం పై జయం ఆధారపడి ఉంటుంది.PPTel 212.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents