Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    36—అరణ్యంలో

    ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా నలభై సంవత్సరాల పాటు ఆరణ్య సంచా రంలో కనుమరుగయ్యారు. మోషే ఇలా అంటున్నాడు. “మనసు కాదేషు బర్నేయలో నుండి బయలుదేరి జేరెదు ఏరు దాటు వరకు, అనగా యోహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరము వారందరు సేనలో నుండకుండ నశించువరకు మనము నడిచిన కాలము ముప్పది ఎనిమిది సంవతసరములు. అంతేకాదు, వారు నశించు వరకు సేవ మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను”.ద్వితి2:14, 15.PPTel 400.1

    తాము దేవుని మందలింపు కింద ఉన్నారని ఈ కాలమంతటిలోను వారికి ప్రతి నిత్యం గుర్తు చేయటం జరిగింది. కాదేషు తిరుగుబాటులో వారు దేవుని విసర్జించారు. ఆ కాలంలో దేవుడు కూడా వారిని విడిచి పెట్టాడు. తన నిబంధన పరంగా వారు ఆయనకు అపనమ్మకంగా ఉన్నారు గనుక ఆ నిబంధన చిహ్నమైన సున్నతిని వారు పొందలేకపోయారు. తాము దాసులుగా ఉన్న ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోవాలన్న తమ కోరిక స్వతంత్రతకు వారు అర్హలు కారని తేట పర్చింది. దాస్యవిముక్తి జ్ఞాపకార్థంగా స్థాపితమైన పస్కా ఆచరణ ఉండదు.PPTel 400.2

    అయినా గుడార సేవల కొనసాగింపు దేవుడు తన ప్రజల్ని పూర్తిగా విసర్జించలేదని సూచించింది. కృపగల ప్రభువు వారి అవసరాల్ని తీర్చుతూనే ఉన్నా డు. వారి ప్రయాణ చరిత్రను సమీక్షిస్తూ మోషే ఇలా అన్నాడు, “నీ చేతుల పన్నులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప ఆరణ్యములో నీవు ఈ నలుబది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమియు తక్కువ కాలేదు”. దేవుడు ఇశ్రాయేలీయుల్ని విసర్జించి వెలివేసిన సంవత్సరాల్లో సయితం ఆయన వారి పట్ల చూపించిన శ్రద్ధాసకుల్ని గురించి లేవీయుల కీర్తనలో నెహెమ్యా ఇలా నమోదు చేశాడు, “వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గముగుండ వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగు నిచ్చుటకు రాత్రి అగ్ని స్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ యుపకారాత్మను దయచేసితివి. నీ విచ్చిన మన్నాను ఇయ్యకమానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమియు తక్కువ కాకుండ నలువది సంవత్సరములు వారిని సోషించితివి. వారి వస్త్రములు పాతగిలి పోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు” నెహెమ్యా 9:19-21. PPTel 400.3

    తిరుగుబాటు చేసిన వారికి, గొణుగుకొన్న వారికి అరణ్యంలో సంచారం శిక్ష మాత్రమే కాదు ఉదయిస్తున్న తరంవారికి క్రమశిక్షణ, వాగ్దత్త దేశ ప్రవేశానికి సిద్ధబాటుగా ఏర్పాటయ్యాయి. వారితో మోషే ఇలా అన్నాడు. “ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడు” “నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసు కొనును........ఆహారము వలననేగాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను” ద్వితి 8:5, 2,3.PPTel 401.1

    “అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన యెడారిలోను వారి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపవలె వారిని కాపాడెను”. వారి యావద్భాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమచేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.” ద్వితి 32:10, యెషా 63:9.PPTel 401.2

    వారి అరణ్య జీవితాన్ని గూర్చిన దాఖలాలు ప్రభువు పై వారి తిరుగుబాటును చాటి చెప్పుతున్నాయి. కోరహు తిరుగుబాటు పర్యవసానంగా పద్నాలుగువేలమంది ఇశ్రాయేలీయులు నాశనమయ్యారు. దైవాధికారంపట్ల అలాంటి ధిక్కార స్వభావాన్ని ప్రదర్శించిన సందర్భాలు అక్కడక్కడ ఉన్నాయి.PPTel 401.3

    ఇశ్రాయేలు స్త్రీకి ఐగుప్తీయుడికి పుట్టిన కుమారుడొకడు ఒకసారి శిబరంలోని తన నియమిత స్థలం విడిచి పెట్టి ఇశ్రాయేలు ప్రజల భాగంలో ప్రవేశించి అక్కడ గుడారం వేసుకొంటానని అది తన హక్కుని పట్టుపట్టాడు. దైవ నిబంధన ప్రకారం అది నిషిద్ధం. ఐగుప్తీయ సంతతివారు మూడు తరాలపాటు సమాజం నుంచి బహిష్కకృతులు. అతడికి ఒక ఇశ్రాలేయుడికి మధ్య వివాదం వచ్చింది. ఆ విషయం న్యాయాధిపతి ముందుకి రాగా అతడు నేరస్తుడికి ప్రతికూలంగా తీర్పు చెప్పాడు. PPTel 401.4

    నేరస్తుడు ఆగ్రహావేశాల్లో మండిపడి న్యాయాధిపతి పై శాపనార్థలు పలికాడు. ఆ కోపంలో అతడు దేవుని నామాన్ని దూషించాడు. అతణ్ని మో షేముందు హాజరు పర్చారు. “తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్షనొందును” (నిర్గమ 2:17) అన్న ఆజ్ఞ ఉన్నది గాని ఇలాంటి అపరాధానికి ఏ పరిష్కారాన్ని పేర్కొనలేదు. అది అతి భయంకర నేరం గనుక దేవుని వద్ద నుంచి ప్రత్యేక ఆదేశం అవసరమని భావించారు. దేవుని చిత్తమేంటో తెలిసేంతవరకు అతడి పై నిఘా ఉంచారు. శిక్షను దేవుడే వెలువరించాడు. దేవదూషకుణ్ని శిబిరం వెలపటికి తీసుకువెళ్ళి రాళ్ళతో కొట్టి చంపమన్నది దైవాదేశం. అతడు దేవదూషణ చేస్తుండగా విన్నవారు అతడి తలమీద చేతులుంచాల్ని ఉన్నారు. ఆ విధంగా అతడి నేరాన్ని ధ్రువపర్చి అనంతరం అతడిపై మొదటి రాళ్ళు రువ్వాల్సి ఉన్నారు. ఆ తర్వాత అక్కడున్న ప్రజలు రాళ్ళు రువ్వి తీర్పును అమలుపర్చాల్సి ఉంది.PPTel 401.5

    అనంతరం ఇలాంటి నేరాల్ని శిక్షించటానికి సరిపడ్డ నిబంధన జారీ అయ్యింది. “మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము - తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించు వాడు మరణ శిక్షనొందవలెను. సర్వ సమాజము రాళ్ళతో అట్టివానిని చావగొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణ శిక్ష విధింపవలెను” లెవికాండము 24:15, 16.PPTel 402.1

    కోపావేశంలో అన్న మాటలకు అంత కఠిన శిక్ష విధేంచే దేవుని ప్రేమను న్యాయశీలతను ప్రశ్నించేవారున్నారు. దుర్బుద్ధితో ద్వేషంతో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం మాహాపాపమని ప్రేమ మాత్రమే కాదు న్యాయం కూడా చెబుతున్నది. దేవుని నామాన్ని గౌరవించాలి అన్న విషయంలో మొట్టమొదటి నేరస్తుడికి కలిగే శిక్ష ఇతరులకు హెచ్చరికగా పనిచేయాలి. ఇతణ్ని శిక్షించకుండా విడిచి పెట్టి ఉంటే ఇతరులు జంకు లేకుండా దుర్నీతి జరిగించేవారు. ఫలితంగా అనేకులు తమ ప్రాణాల్ని కోల్పోవలసి వచ్చేది.PPTel 402.2

    ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులతో బయులుదేరిన అన్యజనులు విభేదాలకు శోధనలకు కారకులు. విగ్రహాధన మానేశామని నిజదేవుని ఆరాధిస్తున్నామని వారు చెప్పుకొనేవారు. అయితే చిన్నతనంలో వారు నేర్చుకొన్న విద్య, పొందిన శిక్షణ వారి అభ్యాసాలను ప్రవర్తనను తీర్చిదిద్దాయి. విగ్రహారాధన, దేవునిపట్ల అసభ్యత వారు చిన్ననాటి నుంచి ఆచరిస్తున్న దురాచారాలే. విభేదాలు సృష్టించటంలోను ఫిర్యాదులు చేయటంలోను వారు ప్రథములు. ఇశ్రాయేలీయ సమాజాన్ని విగ్రహారాధనతో దేవునికి వ్యతిరేకంగా సణగటంతో చెరిచింది వారే.PPTel 402.3

    ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోకి తిరిగి వచ్చిన కొద్ది కాలంలోనే సబ్బాతు అతిక్రమం జరిగింది. ఆ పరిస్థితుల్లో అది ఒక ప్రత్యేకమైన నేరమయ్యింది. ఇశ్రాయేలీయుల్ని విడిచి పెడ్తానని ప్రభువు చేసిన ప్రకటన తిరుగుబాటు రేపింది. కనాను ప్రవేశానికి అనర్హుడైన ఒక వ్యక్తి దైవ ధర్మ శాస్త్ర ధిక్కరణకు కృతనిశ్చయుడై నాల్గో ఆజ్ఞ మీరుతూ సబ్బాతునాడు కట్టెలు పోగు చెయ్యటానికి వెళ్ళాడు. అరణ్య ప్రయాన కాలంలో ఏదో దినాన పొయ్యి రాజెయ్యటం నిషిద్ధం. కనాను వాతావరణ పరిస్థితోల్లో అగ్ని వెలగించటం అనివార్యం గనుక ని షేధం కనానుకు వర్తించలేదు. కాగా అరణ్యంలో చలి తీవ్రతలేదు. అందుచేత అగ్ని వెలిగించటం అవసరం లేకపోయింది.. ఈ వ్యక్తి చేసిన పని కావాలని నాల్గో ఆజ్ఞను మీరటానికి చేసింది అది అనాలోచితంగానో అజ్ఞానం వల్లనో కాక దురాభిమానంతో చేసిన పాపం.PPTel 403.1

    ఆ పాపం చేస్తుండగా పట్టుకొని అతణ్ని మోషే ముందు నిలిపారు. సబ్బాతు ఉల్లంఘనకు శిక్ష మరణమేనని ముందే ప్రకటించటం జరిగింది. కాని ఆ శిక్షా విధి ఏ విధముగా అమలవుతుందో ఎవరికీ తెలియదు. ఆ విషయాన్ని మోషే దేవుని ముందు పెట్టగా ఆయన శిక్షను నిర్దేశించాడు. ” ఆ మనుష్యుడు మరణ శిక్షనొందవలెను. సర్వసమాజము పాళెము వెలుపల రాళ్ళతో వానిని కొట్టి చంపవెను”అని ఆయన చెప్పాడు. సంఖ్యా 15:35. సబ్బాతు అతిక్రమం దేవదూషణ రెండూ దేవుని అధికారాన్ని ధిక్కరించే పాపాలే. ఈ రెండింటికి ఏర్పాటైన శిక్ష ఒక్కటే.PPTel 403.2

    సబ్బాతు యూదుల వ్యవస్థ అని దాన్ని ఆచరించాల్సి వస్తే దాన్ని ఉల్లంఘనకు మరణదండన విధింపు అవసరముంటుందంటూ సృష్టి నాటి సబ్బాతును నిరాకరించే వారు మన రోజుల్లో చాలామంది ఉన్నారు. దేవ దూషణకు సబ్బాతు ఉల్లంఘనకు దేవుడు ఒకే శిక్ష విధించినట్లు చూస్తున్నాం. అందుచేత మూడో ఆజ్ఞ యూదులకే వర్తించింది గనుక దాన్ని కూడా తోసిపుచ్చాలని వాదిద్దామా? అయినా మరణదండన ఆధారంగా రూపొందిన వాదన మూడు, అయిదు ఇంకా చెప్పాలంటే దాదాపు ఆజ్ఞలన్నింటికీ ఒకేరీతిగా వర్తిస్తుంది. తన ధర్మశాస్త్ర అతిక్రమానికి దేవుడు ఇప్పుడు లోకపరమైన శిక్షలు విధించకపోయినా పాపానికి జీవితం మరణమని దైవ వాక్యం ఘోషిస్తుంది. చివరి తీర్పు అమలులో ఆయన పరిశుద్ధ ధర్మశాసనాల్ని అతిక్రమించే వారికి మరణమే మిగుల్తుందని తేలుతుంది.PPTel 403.3

    వారు అరణ్యంలో సంచరించిన నలభై సంవత్సరాలూ మన్నా ప్రదానం ద్వారా సబ్బాతుల పవిత్రతను దాని ఆచరణను గూర్చి ప్రజలకు ప్రతీ వారం జ్ఞాపకం చేయటం జరిగేది. అయినా వారు అవిధేయులాయ్యరు. అంత బాహాటంగాను బహిరంగంగాను అతిక్రమించకపోయినా నాల్గో ఆజ్ఞ ఆచరించటంలో అశ్రద్ధ చూపారు. తన ప్రవక్త ద్వారా దేవుడిలా అంటున్నాడు. “నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపర”చారు. యెహెజ్కేలు 20:13-14 మొదటి తరం ఇశ్రాయేలీ యులు వాగ్దాత్త దేశం అయిన కనానులో ప్రవేశించకపోవటానికి ఇదొక కారణం. అయినా వారి పిల్లలు పాఠం నేర్చుకోలేదు. నలభై సంవత్సరాల అరణ్య సంచార కాలంలో సబ్బాతును వారు అంతగా అశ్రద్ధ చేశారు. కనానులో ప్రవేశించకుండా దేవుడు వారిని నిరోధించకపోయినా ఆదేశంలో వారు స్థిరపబడిన తర్వాత అన్యుల మధ్యకు చెదిరిపోయి నివసిస్తారని ప్రకటించాడు.PPTel 403.4

    ఇశ్రాయేలీయులు కాదేషునుంచి వెనుదిరిగి అరణ్యంలో ప్రవేశించారు. తమ అరణ్య సంచార కాలం ముగిసాక వారు “సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి” సంఖ్యా 20:1.PPTel 404.1

    ఇక్కడ మిర్యాము మరణించింది. ఆమెను సమాధి చేశారు. దేవుడిచ్చిన ఘన విజయాన్ని ఎర్రసముద్రం ఒడ్డున గీతాలతోను నృత్యంతోను ఇశ్రాయేలు ప్రజలు పండుగగా జరుపుకొన్నారు. ఐగుప్తు విడిచి గొప్ప ఆశలు నిరీక్షణతో వచ్చిన లక్షలాది ప్రజలు ఆ ఆనందోత్సాహాల సన్నివేశం నుంచి జీవితకాలం సంచరించి అరణ్యంలో సమాధి అయ్యారు. దీవెన పాత్ర పెదవులకు అందకుండా పాపం కూల్చివేసింది. తర్వాతి తరం వారు పాఠం నేర్చుకొనేనా?PPTel 404.2

    “ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి.... వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు హృదయ పూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసికొనిరి.” కీర్తనలు 78:32-35. అయినా వారు యధా హృదయంతో దేవుని తట్టు తిరగలేదు. శత్రువుల చేతిలో శ్రమలనుభవించెటినప్పుడు కాపాడమంటూ దేవునికి మొర పెట్టినప్పటికీ “వారి హృదయము ఆయన యెడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు.... అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషములు హరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమార్లు కోపము అణచుకొనువాడు... కాగా వారు కేవలము శరీరులైయున్నారనియు విసరి, వెళ్ళి మరలి రానిగాలివలె సున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను” 37-39 వచనాలుPPTel 404.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents