Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    17—యాకోబు పలాయనం పరదేశవాసం

    కోపోద్రిక్తుడైన ఏశావు ప్రాణహానికి తల పెడ్తానన్న భయంతో యాకోబు తండ్రి గృహం నుంచి పారిపోయాడు. కాని తండ్రి దీవెనలు తనమీదనే ఉన్నాయి. ఇస్సాకు అతడికి నిబంధన వాగ్దానాన్ని ధ్రువపర్చి వాగ్దాన వారసుడిగా తాను అరామ్నహరాయిములో ఉన్న తన తల్లి కుటుంబంలో నుంచి భార్యను ఎంపిక చేసుకోవాల్సిందిగా యాకోబును ఆదేశించాడు. అయినా యాకోబు తన ఒంటరి ప్రయాణాన్ని హృదయ వేదనతో ప్రారంభించాడు. చేతిలో కేవలం కర్రతో క్రూరమైన ఆటవిక జాతుల ప్రజలు నివసిసస్తున్న వందలాదిమైళ్ల భూభాగంలో ప్రయాణం చేయాల్సి ఉన్నాడు. కోపంతో ఉన్న తన అన్నకు తన వైనం తెలియకుండేందుకుగాను యాకోబు జనుల్ని తప్పించుకొని ప్రయాణం చేశాడు. దేవుడిస్తానని వాగ్దానం చేసిన దీవెనను పోగొట్టుకొన్నావేమో అని భయపడ్డాడు. అతణ్ని శోధనలకు గురిచేయటానికి సాతాను పొంచి ఉన్నాడు.PPTel 174.1

    రెండోరోజు సాయంత్రానికల్లా చాలా దూరం వెళ్లాడు. తాను వెలివేయబడ్డ వాణ్ణని భావించాడు. అదంతా తాను తన చేజేతులా చేసుకొన్న పాప ఫలమేనని బాధపడ్డాడు. అతడి ఆత్మను నిరాశ చీకట్లు కమ్ముకున్నాయి. ప్రార్థన చేయటానికి కూడా భయపడ్డాడు. ఏకాకిగా ఉన్న అతడు క్రితంలో ఎన్నటికన్నా ఎక్కువగా ఇప్పుడు దేవుని సంరక్షణ తనకు అవసరమని గుర్తించాడు. కన్నీళ్లు కార్చుతూ దీన మనసుతో తన పాపాన్ని ఒప్పుకొని తనను పూర్తిగా విసర్జించలేదనటానికి ఏదో ఒక నిదర్శనం చూపించమని దేవునికి ప్రార్థన చేశాడు. అయినా అతడి హృదయ భారం తేలికవ్వలేదు. తన ఆత్మ విశ్వాసమంతా పోయింది. తన పితరుల దేవుడు తనను విసర్జించాడని భావించాడు.PPTel 174.2

    అయితే, దేవుడు యాకోబును విసర్జించలేదు. తప్పులు చేస్తూ అవిశ్వాసం కనపర్చుతూ ఉన్న తన సేవకుడిపట్ల ఆయన ఇంకా కృప చూపించాడు. యాకోబుకి రక్షకుడు అవసరమయ్యాడు. అతణ్ని కటాక్షించి ప్రభువు అతడికి రక్షకుని బయలు పర్చాడు. యాకోబు పాపం చేశాడు. కాని తాను మళ్లీ దేవుని ప్రసన్నతని పొందేందుకు ఏర్పాటైన మార్గాన్ని చూసినప్పుడు అతడి హృదయం కృతజ్ఞతతో నిండింది. ప్రయాణం చేసి చేసి అలసిపోయిన ఆ సంచారి ఒక రాయిని తలగడగా వేసుకొని నేలమీద నడుం వాల్చాడు. నిద్రలో ప్రకాశవంతమైన నిచ్చెన చూశాడు. దాని మొదలు భూమ్మీద చివర ఆకాశాన్నంటుకొంటూ ఉన్నట్లు చూశాడు. ఈ నిచ్చెన పై దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దాని పైన మహిమ ప్రభువు క్రీస్తు ఉన్నాడు. ఆయన స్వరం పరలోకం నుంచి ఇలా వినిపించింది : “నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను” పరవాసిగా తాను పండుకొని ఉన్న దేశాన్ని తనకూ తన సంతతికీ వాగ్దానం చేసిన దేవుడు ఈ హామీ ఇచ్చాడు. “భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును.” దేవుడు ఈ వాగ్దానాన్నే అబ్రాహాముతోను, ఇస్సాకుతోను చేశాడు. ఇప్పుడు దాన్ని తిరిగి యాకోబుతో చేశాడు. యాకోబు వంటరిగాను, దుఖంలోను ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఆదరణను ప్రోత్సాహాన్ని కలిగించే మాటల్ని పలికాడు, “ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువను”.PPTel 174.3

    యాకోబు చూట్టూ ఉండే దుష్ప్రభావాలేంటో అతడు ఏ అపాయాలకు గురికానున్నాడో దేవునికి తెలుసు. తన నిమిత్తం దేవుని సంకల్పం ఏమిటో అవగాహన చేసుకొని తాను విగ్రహారాధకుల మధ్య కుతంత్రాలు పన్నే మనుషుల నడుమ ఒంటరిగా నివసించేటప్పుడు ఎదురయ్యే శోధనల్ని జయించటానికి అతడు సిద్ధపడేందుకుగాను పశ్చాత్తాపం పొందిన ఆ కాందిశీకుడికి కృపగల దేవుడు భవిష్యత్తును చూపించాడు. తాను లక్షంగా పెట్టుకోవాల్సి ఉన్న ప్రయాణం నిత్యమూ అతడి ముందుంటుంది. తనద్వారా దేవుని ఉద్దేశం నెరవేరుతుందన్న దానికి అతడు సర్వదా నమ్మకంగా నిలిచేందుకు చేయూతనిస్తుంది.PPTel 175.1

    ఈ దర్శనంలో దేవుడు యాకోబుకు రక్షణ ప్రణాళికలను బయలు పర్చాడు. పూర్తిగా కాదు గాని అప్పుడు అతడికి అవసరమైన ప్రధాన భాగాల్ని మాత్రమే బయలు పర్చాడు. దర్శనంలో యాకోబు చూసిన మార్శిక నిచ్చెన. క్రీస్తు నతానియేలుతో మాట్లాడినప్పుడు ప్రస్తావించిన నిచ్చెన ఒకటే. ఆయనిలా అన్నాడు. “మీరు ఆకాశము తెరువబడుటయు, దేవుని దూతల మనుష్య కుమారుని పైగా ఎకుయు దిగుటయు చూతురు” యోహావ 1:51, దైవ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మానవుడు తిరుగుబాటు చేసిన సమయంవరకు దేవునికి మానవుడికి మధ్య ముఖాముఖి సంభాషణ జరిగేది. ఆదామవ్వల పాపం పరలోక భూలోకాల మధ్య ఆగాధం సృష్టించింది. అందుచేత మానవుడు దేవునితో మాట్లాడటం ఆగిపోయింది. పాపం సృష్టించిన అగాధాన్ని క్రీస్తు తన నీతిమూలంగా కలిపి ఉండకపోతే పడిపోయిన మానవుడతో దూతలు మాటలాడటం జరిగేదికాదు. మానవుణ్ని తన బలహీన, నిస్సహాయ స్థితిలో క్రీస్తు అనంత శక్తికి నిలయమైన దేవునితో అనుసంధానం చేస్తున్నాడు. ఇదంతా యాకోబుకి కలలో ప్రత్యక్షపర్చాడు. అందులో ఒక భాగాన్ని అతడి మనసు వెంటనే గ్రహించినప్పటికీ అందులోని మర్మపూరితమైన గొప్ప సత్యాలు జీవిత కాలమంతా అధ్యయనం చేయాల్సి ఉన్న సత్యాలు. చదివే కొద్దీ అతడికి ఎక్కువ గ్రాహ్యమాయ్యాయి.PPTel 175.2

    ప్రశాంతమైన ఆ రాత్రిలో యాకోబు నిద్రనుంచి మేల్కోన్నాడు. దర్శనంలో తనకు కనిపించిన రూపాలన్నీ మాయమయ్యాయి. అక్కడి కొండలు, వాటికి పైగా నక్షత్రాలతో నిండిన ఆకాశం మాత్రమే అతడికి కనిపించాయి. కాని దేవుడు తనతో ఉన్నాడన్న స్పృహ అతడికి కలిగింది. తనకు కనిపించని ఒకరి సన్నిధి తన ఒంటరి తనాన్ని తొలగించింది. “నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయెను... ఇది దేవుని మందరమే గాని వేరొకటి కాదు; పరలోకపు గవిని ఇదే” అన్నాడు.PPTel 176.1

    “తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసికొన్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను”. ముఖ్య సంఘటనల్ని జ్ఞాపకముంచుకొనేందుకు అప్పటి ఆచారాన్ననుసరించి దేవుని కృపకు గుర్తుగా యాకోబు ఆ స్మారక చిహ్నన్ని నిలిపాడు. తాను ఆ మార్గాన వెళ్ళటం జరినప్పుడు ఈ పవిత్ర స్థలంలో ఆగి దేవుని ఆరాధించాలన్నది దాని పరమోద్దేశం. ఆ స్థలానికి అతడు బేతేలు లేదా ” దేవుని మందిరము”అని పేరు పెట్టాడు.దేవుని సన్నిధి తనతో ఉంటుం దన్న వాగ్దానాన్ని కృతజ్ఞతతో నిండిన మనసుతో వల్లించాడు. అనంతరం ఈ గంభీర వాగ్దానం చేశాడు, ” నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గముతో నన్ను కాపాడి, తినుటకు ఆహరమును, ధరించు కొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడైయుండును మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను”.PPTel 176.2

    యాకోబు ఇక్కడ దేవునితో బేరసారాలు చేయటం లేదు. దేవుడు యాకోబుకు వృద్ధిని సౌభాగ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుని కృప నిమిత్తం, ఆయన ప్రేమ నిమిత్తం కృతజ్ఞతతో నిండిన హృదయ ప్రతిస్పందనను యాకోబు చేసిన యీ వాగ్దానం వ్యక్తం చేస్తున్నది. తనపై దేవునికున్న హక్కును తాను గుర్తించాలని, తనపట్ల దేవుడు చూపిన ప్రత్యేక కృప తాను ఏదో తిరిగి ఇవ్వాలని కోరుతుందని యాకోబు భావించాడు. అలాగే దేవుడు మనకిచ్చే ప్రతి దీవెన దాన్ని దయచేస్తున్న “ప్రభువుకు కృతజ్ఞతతో ప్రతిస్పందిచాలని కోరుతుంది. క్రైస్తవుడు తరచుగా తన గత జీవితాన్ని సమీక్షించుకొని దేవుడు తనకు విడుదల కలిగించిన సందర్భాల్ని అనగా కష్టాల్లో తనను ఆదుకోటం, సమస్తం అంధకారమయంగా ఉన్నప్పుడు తనకు మార్గాన్ని తెరవటం, సొమ్మసిల్లి పడిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఉజ్జీవాన్నివ్వటం కృతజ్ఞతతో గుర్తు చేసుకోవాలి. తన విషయంలో దేవదూతలు చూపుతున్న శ్రద్ధాసక్తులికి నిదర్శనాలుగా వీటిని అతడు గుర్తించాలి. అసంఖ్యాకమైన ఈ దీవెనల దృష్ట్యా దీన మనస్సుతోను కృతజ్ఞతతో నిండిన హృదయంతోను అతడు తరచు ఇలా తన్ను తాను ప్రశ్నించుకోవాలి. “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయకేమి చెల్లించుదును?” కీర్తనుల 116:12.PPTel 176.3

    మన సమయం, మన వరాలు, మన ఆస్తి వీటిని మనకు ధర్మనిధిగా ఇచ్చిన దేవునికి మనం అంకింతం చేయాలి. ప్రభువు మనకు ప్రత్యేక రీతిగా విడుదల కలిగించినప్పుడల్లా లేదా మనం ఉహించని ఉపకారం చేసినప్పుడల్లా సుత్తి సమర్పణ ద్వారా మాత్రమేగాక యాకోబులా దైవ సేవార్థం బహుమతులు అర్పణలద్వారా దేవుని దయాళుత్వాన్ని గుర్తించాలి.PPTel 177.1

    “నీవు నాకిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను” అన్నాడు యాకోబు. సంపూర్ణ సువార్తను అధిక్యతల్ని ఆనందిస్తున్న మనం పూర్వం తక్కువ వెలుగున్న రోజుల్లో నివసించిన ప్రజలు దేవునికిచ్చిన దానికన్నా తక్కువ ఇద్దామా? తక్కువ ఇవ్వటం సమంజసం కాదు. మనం అనుభవించే దీవెనలు రాశిలోను వాసిలోను ఎక్కువ గనుక మన విధులు, బాధ్యతలు కూడా తగురీతిలో పెరగాలి గదా? కొలవటం సాధ్యంకాని ప్రేమను, విలువ కట్టటానికి వీలులేని ఈవిని గణితశాస్త్ర నియమాలతో, సమయంతో, ప్రేమతో కొలవటానికి ప్రయత్నిస్తే ఆ అంచనా ఎంత తక్కువగా ఉంటుంది! అది ఎంత వ్యర్థ ప్రయత్నమవుతుంది! క్రీస్తుకి పదోవంతు! ఎంతో ఖర్చు అయిన దానికి ఈ చెల్లింపు అతి స్వల్పం. సిగ్గుచేటు పరిహరం! మినహయింపులేని సమర్పణ చేయమంటూ క్రీస్తూ కల్వరి సిలువ మీద నుంచి పిలుపు నిస్తున్నాడు. మనకున్నదంతా, మనకున్న విలువ అంతా దేవునికి సమర్పిచుకోవాలి.PPTel 177.2

    దైవా వాగ్దానాల పై నూతనమైన ధృడమైన విశ్వాసంతో, పరలోక దూతల సముఖం కాపుదల తనకున్నదన్న నిశ్చయతతో, యాకోబు “తూర్పు జనుల దేశమునకు” ప్రయాణం సాగించాడు. అయితే అతడి రాకకు దాదాపు వందేళ్లక్రితం అబ్రాహాము దాసుడు ఎలియాజరు రాకకు మధ్య ఎంత వ్యత్యాసం! అబ్రాహాము దాసుడు వెండి బంగారు అభరణాల బహుమతులతో ఒంటెలమీద ప్రయాణం చేసిన సేవకులతో వచ్చాడు. యాకోబు అయితే నడకవల్ల పుండ్లు పడ్డ కాళ్ళతో, చేతిలో కర్ర మినహా చిల్లిగవ్వ లేకుండా, ఒంటరిగా వచ్చాడు. అబ్రాహాము దాసుడిమల్లే యాకోబు నూతివద్ద ఆగాడు. లాబాను చిన్న కూతురు రాహేలును ఇక్కడే కలుసుకున్నాడు. బావిమీద నుంచి రాయి దొర్లించి మందకు నీళ్లు పెట్టడం వంటి సేవలు చేసింది ఇప్పుడు యాకోబు. తన బంధుత్వాన్ని తెలియజేసినప్పుడు అతడికి లాబాను గృహానికి స్వాగతం లభించింది. ఆస్తిపాస్తులు లేకుండా దాసాన దాసులు లేకుండా వచ్చిన కొన్ని వారాల్లోనే అతడి పనితనం నేర్పు విలువ ఎంతో తెలిసి పోయాయి. తనతో ఉండిపొమ్మని లాబాను అతణ్ని కోరాడు. రాహేలును భార్యగా పొందటానికి యాకోబు ఏడేళ్లు కొలువు చేయటానికి ఒప్పదం అయ్యింది.PPTel 177.3

    వెనుకటి రోజుల్లో వివాహ సంబంధం ఖరారు కాకముందు వరుడు తన పరిస్థితుల్ని అనుసరించి కొంత సొమ్ము లేదా ఇతర ఆస్తిరూపంలో దానికి సమానంగా వధువు తండ్రికి చెల్లించటం ఆచారం. ఇది వివాహ బాంధవ్యానికి కాపుదలగా పరిగణన పొందింది. కుటుంబ పోషణకు ఏర్పాటు ఏమీలేని పురుషులకు తమ కుమార్తెలను ఇవ్వటానికి తండ్రులు వెనుకాడేవారు. అవసరమైనంత పొదుపు, వ్యాపారాల్ని నిభాయించే సామర్థ్యం, పశువులు, పొలాలు సంపాదించే స్తోమత వారికి లేకపోతే వారి జీవితం వ్యర్థమవుతుందని తండ్రుల భయం. అయితే భార్యకోసం చెల్లించటానికి ఏమీలేని వారి నిమిత్తం ఒక ఏర్పాటుండేది. తాము ప్రేమించిన యువతి తండ్రికి కొలువు చేసి కట్నం బాకీ తీర్చటానికి ఆ ఏర్పాటు అనుమతించేది. ఊడిగపు కాలవ్యవధి కట్నం విలువ మీద ఆదారపడి ఉండేది. ప్రేమికుడు తన కొలువు కాలాన్ని నమ్మకంగా పూర్తిచేసి ఇంకా తక్కిన విషయాల్లో యోగ్యుడిగా నిరూపించుకొని అప్పుడు అతడు ఆ యువతిని భార్యగా పొందేవాడు. తండ్రికి ముట్టిన కన్యాశుల్కాన్ని తండ్రి సర్వసాధారణంగా కుమార్తె వివాహ సమయంలో ఆమెకు ఇచ్చేవాడు. ఇలాగుండగా, రాహేలు, లేయాల విషయంలో వారి కట్నం సొమ్ము వారికివ్వకుండా లాబానే స్వార్థంగా అట్టి పెట్టుకున్నాడు. పద్దనరాము విడిచి పెట్టి వెళ్లకముందు ఇలా తమ తండ్రిని నిందిచినప్పుడు వారు దీన్ని దృష్టిలో ఉంచుకొనే మాట్లాడారు. “అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను”.PPTel 178.1

    లాబానువల్ల జరిగినట్లు, కొన్నిసార్లు ద్రవ్యం దుర్వినియోగం అయినప్పటికీ ఈ పాతకాలపు ఆచారం మంచి ఫలితాల్నే ఇచ్చింది. వధువును సంపాదించుకోటానికి ప్రేమికుడు కొలువు చేయటంలో తొందరపాటు వివాహానికి కళ్లెం పడేది. అతడి ప్రేమ ఎంత లోతైందో, తన కుటుంబాన్ని పోషించటానికి అతడికి సామర్థ్యం ఉందో లేదో పరీక్షించటానికి అవకాశం అభించేది. మనకాలంలో దీనికి విరుంగా వ్యవహరించటంవల్ల ఎన్నో దుష్పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. వ్యక్తులికి పెండ్లికి ముందు ఒకరితో ఒకరికి పరిచయం లేనందువల్ల ఒకరి అలవాట్లు, చేతివృత్తులు ఒకరికి తెలియకపోవటంతో వివాహ వేదికవద్ద వారు భార్యాభర్తలుగా ఏకమైనప్పుడు అనుదిన జీవితానికి సంబంధించినంతవరకు వారు పరాయివాళ్లలా వ్యవహరిచంటం తరుచ జరుగుతుంటుంది. అనేకమంది భార్యాభర్తలు తాము ఒకరితో ఒకరు సర్దుబాటు చేసుకోలేకపోతున్నామని చాలా అలస్యంగా గుర్తిస్తారు. వారి వైవాహిక జీవితం దుర్భరంగా సాగుతుంది. భర్త సోమరితనం, అసమర్థత లేదా దురభ్యాసాలవల్ల భార్యాపిల్లలు భాదలకు గురి అవుతుంటారు. పూర్వకాల ఆచారం ప్రకారం వివాహనికి ముందు వరుడి ప్రవర్తనను పరీక్షించటం జరిగి ఉంటే వివాహంలో ఎంతో అసంతోషం నివారణ అయిఉండేది. PPTel 178.2

    రాహేలు కోసం యాకోబు ఏడేళ్లు నమ్మకంగా కొలువుచేశాడు. “అతడు ఆమెను ప్రేమించెను గనుక” ఆ ఏడు సంవత్సరాలూ “అతనికి కొద్ది దినములుగా తోచెను”. అలాగుండగా, స్వార్థపరుడు, అన్యాయస్తుడు అయిన లాబాను విలువైన పనివాణ్ణి తనవద్దే నిలుపుకొనే దురుద్దేశంతో మోసం చేసి రాహేలు బదులు లేయాను యాకోబుకు ఇచ్చాడు. ఆ మోసంలో లేయాకూడా పాలుపంచుకొన్నందుకు యాకోబు ఆమెను ప్రేమించలేకపోయాడు. దానికి యాకోబు లాబానుని కోపంగా గద్దించటంతో ఇంకో ఏడేళ్లు కొలువు చేస్తే రాహేలు నిస్తానని లాబాను చెప్పాడు. కానీ లేయాను విడిచి పెట్టకూడదని అది తన కుటుంబానికి అపకీర్తి తెస్తుందని లాబాను అన్నాడు. ఈ విధంగా యాకోబు మిక్కిలి బాధాకరమైన పరిస్థితిలో పడ్డాడు. చివరికి లేయాను విడిచి పెట్టకుండా రాహేలుని వివాహ మాడటానికి తీర్మానించు కున్నాడు. యాకోబు రాహేలునే ఎక్కువ ప్రేమించాడు. ఇది లేయాలో అసూయను, ద్వేషాన్ని పెంచింది. అక్కచెల్లెళ్లయిన ఈ భార్యల మధ్య రేగిన వైరంవల్ల యాకోబు జీవితం దు:ఖంతో నిండిది.PPTel 179.1

    యాకోబు పద్దనరాములో లాబాను కొలువులో సేవచేస్తూ ఇరవై సంవత్సరాలు ఉన్నాడు. లాబాను బంధుత్వ బంధాల్ని లెక్క చేయకుండా ఆ బాంధవ్యం ఆధారంగా సొమ్ము చేసుకోటానికి చూశాడు. ఇద్దరు కూతుళ్ల నిమిత్తం పధ్నాలుగేళ్ల కఠిన పరిశ్రమను కోరాడు. మిగిలిన ఆరేళ్లలో యాకోబు జీతాన్ని పదిసార్లు మార్చాడు. అయినా యాకోబు శ్రద్ధగా నమ్మకంగా పనిచేశాడు. యాకోబు లాబానుతో తమ చివరి సమావేశంలో అన్న ఈ మాటలు కఠిన యజమాన్ని అయిన అతడి కొలువును తాను ఎంత జాగృతితోను అవిశ్రాంతంగాను చేశాడో స్పష్టంగా తెలుపుతున్నాయి “ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొట్టెలైనను, మేకలైనను ఈచుకోని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగము చేత చీల్చబడిన దానిని నీయొద్దకు తేక ఆ నష్టమును నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఈలాగుంటిని, పగటి యెండకును, రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూరమాయెను.”PPTel 179.2

    కాపరులు తమ మందల్ని రాత్రింపగళ్లు కాయటం అవసరమయ్యింది. దొంగలవల్ల, నమ్మకమైన కాపలాలేని మందలోపడి తరచు గొప్ప నష్టం కలిగించే అసంఖ్యాకమైన అడవి మృగాలవల్ల మందలకు ప్రమాదం పొంచి ఉండేది. లాబానుకు చెందిన విస్తారమైన మందల్ని కాయటానికి యాకోబుకి చాలామంది సహయకులుండేవారు. కాని మందలన్నిటికి యాకోబునే జవాబుదారి చేశాడు లాబాను. వర్షాలుసరిగా పడని కాలంలో దాహంతో మరణించకుండా గొర్రెల్ని కాపాడటానికి, తీవ్రమైన చలి మాసాల్లో రాత్రుళ్లు దట్టంగా పడే గడ్డ మంచుకి చల్లబడిపోకుండా వాటిని కాపాడటానికి సంవత్సరంలో కొన్ని కాలాల్లో అతడు ఎల్లప్పుడు వ్యక్తిగతంగా మందతో ఉండటం అవసరమయ్యేది. ప్రధాన కాపరి యాకోబే! అతడి కింద పనిచేసే సేవకులు ఉప కారులు. గొర్రెల్లో ఒకటి పోతే ఆ నష్టాన్ని ప్రధాన కాపరి భరించేవాడు. మంద చిక్కిపోయి ఆరోగ్యం లేకపోతే దానికి మంద కాపరులైన సేవకుల్ని సంజాయిషీ అడిగేవాడు.PPTel 180.1

    తనకు అప్పగించిన నిస్సహాయ జీవులపట్ల కాపరి చూపించే శ్రద్ధ, జాగరూ కత, కారుణ్యాల్ని పరిశుద్ధ లేఖన రచయితలు సువార్త తాలూకు ప్రశస్త సత్యాల్ని ఉదా హరించటానికి ఉపయోగించేవారు. తన ప్రజలతో తన సంబంధం దృష్ట్యా, క్రీస్తును గొర్రెల కాపరితో సరిపోల్చటం జరుగుతున్నది. పాపం ప్రవేశించిన తర్వాత తన గొర్రెలు పాపాంధకార మార్గాల్లో పడి నశించటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన చూశాడు. దాని తప్పి తిరిగుతున్న వీరిని రక్షించటానికి ఆయన తన తండ్రి గృహంలోని ఔన్నత్యాన్ని మహిమను విడిచి పెట్టాడు. ఆయన ఇలా అంటున్నాడు. “తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిని దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడిన దానికి కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరుచుదును”. “నా గొట్టెలు ఇక దేవుడు కాకుండ... నేను వాటిని రక్షించెదను”. “దుష్ట మృగములు వారినిక భక్షింపవు”. యెహెజ్కేలు 34:16,22,28. వాటిని మందలోకి పిలుస్తున్న ఆయన స్వరం వినిపిస్తుంది. అది “పగలు ఎండకు నీడగాను, గాలి వానకు ఆశ్రయముగాను చాటుగాను” ఉన్న “వర్ణశాల” యెషయా 4:6 మందల ఆలనపాలన విషయంలో ఆయన అలు పెరుగడు. బలహీనంగా ఉన్న గొర్రెల్ని కౌగిట్లోకి తీసుకొంటాడు. భుజాలమీద ఎక్కించుకొని మోస్తాడు. ఆయన గొర్రెలు ఆయన్ని అమితంగా ప్రేమిస్తాయి. “అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవును” యోహాను 10:5.PPTel 180.2

    క్రీస్తు ఇలా అంటున్నాడు. “నేను గొఱ్ఱలకు మంచి కాపరిని, మంచి కాపరి గొట్టెలు కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొట్టెల కాపరి కాడు. గనుక గొట్టెలు అతనివి కానందున తోడేలు వచ్చుటచూచి గొట్టెలను విడిచి పెట్టి పారిపోవును, తోడేలు ఆ గొట్టెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొట్టెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును” 11-14 వచనాలు.PPTel 181.1

    క్రీస్తు ప్రధాన కాపరి. తన మందను కాసే బాధ్యతను సహయ కాపురలైన సువార్త బోధకులకు ఆయన అప్పగించాడు. తాను తమకు అప్పగించిన గొట్టెలు విషయంలో తాను చూపించిన ఆసక్తినే తాను వహించిన పవిత్ర బాధ్యతనే వారూ ప్రదర్శించాలని వారిని ఆయన కోరుతున్నాడు. మందను మేపటంలోను, బలహీనంగా ఉన్న గొట్టెల్ని బలపర్చటంలోను, సొమ్మసిల్లే గొట్టెల్ని తెప్పరిల్ల జేయటంలోను నమ్మకంగా పనిచేసి వాటిని మింగటానికి పొంచి ఉన్న తోడేళ్ల బారినుంచి వాటిని కాపాడాల్సిందిగా వారిని ఆదేశిస్తున్నాడు.PPTel 181.2

    సహాయ కాపరులకు అపోస్తలుడైన పేతురు ఈ హితవు పలుకుతున్నాడు. “బలిమి చేతకాక దేవుని చిత్త ప్రకారము ఇష్ట పూర్వకముగాను, దుర్గాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగించబడిన వారిపై ప్రభువై యుండక మందకు మాదిదిగా ఉండుడి”. 1 పేతురు 5:2,3. పౌలు ఈ హితపు ఈ హెచ్చరిక చేస్తున్నాడు. “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్దాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మునుగూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును, వారు మందను కనికరింపరు” అ.కా. 20:28,29.PPTel 181.3

    నమ్మకమైన నిజాయితీపరుడైన కాపరి భరించాల్సిన భార బాధ్యత వహించటానికి సుముఖంగా లేనివారందరినీ అపోస్తలుడైన పౌలు ఇలా మందలిస్తున్నాడు: “బలిమి చేతకాక దేవుని చిత్త ప్రకారము ఇష్ట పూర్వకముగాను, దుర్గాభా పేక్షతోగాక సిద్ధ మనస్సుతోను” వ్యవహరించండి. 1 పేతురు 5:2 అలాంటి అపనమ్మకమైన సేవకుల్ని ప్రధాన కాపరి తొలగించివేస్తాడు. సంఘాన్ని క్రీస్తు తన రక్తంతో కొన్నాడు. తాను కాస్తున్న గొర్రెలు గొప్ప ఖరీదు పెట్టి కొన్నవని ప్రతీ కాపరీ గుర్తించాలి. ప్రతీ గొర్రె అపారమైన విలువగలదని గుర్తించి వాటిని ఆరోగ్యంగాను, బలంగాను ఉంచటానికి అవిశ్రాంతంగా కృషిచేయాలి. క్రీస్తు స్ఫూర్తితో నిండిన కాపరి తన్నుతాను ఉపేక్షించుకొన్న ఆ ప్రభువు ఆదర్శాన్ని ఆనుకరిస్తూ తన మంద క్షేమాభివృద్ధికోసం సర్వదా పాటుపడ్డాడు. అతడి యాజమాన్యం కింద మంద వర్ధిలుతుంది.PPTel 182.1

    తమ సేవ నిమిత్తం అందరూ లెక్క చెప్పాల్ని ఉంటుంది. ప్రతీ కాపరినీ ప్రభువు ఇలా ప్రశ్నిస్తాడు. “నీ కియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది?” యిర్మీయా 13:20 నమ్మకంగా ఉన్న కాపరి గొప్ప ప్రతిఫలం పొందుతాడు. “ప్రధాన కాపరి ప్రతక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు” 1 పేతురు 5:4.PPTel 182.2

    లాబాను కొలువుచేసి విసిగిపోయి యాకోబు కనానుకు వెళ్లిపోతానని లాబానుతో చేస్తూ ఇలా అన్నాడు. “నన్ను పంపివేయుము. నా చోటికి నా దేశమునకు వెళ్లిదను. నా భార్యలను నా పిల్లలను నాకప్పగింపుము; అప్పుడు నేను వెళ్లెదను. వారి కోపము నీకు కొలువు చేసితిని. నేను నీకు కొలువు చేసిన విధమును నీవెరుగుదువుగదా?. “నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకొంటిని” అని చెబుతూ వెళ్లిపోవద్దని యాకోబును అర్ధించాడు. అల్లుడి యాజమాన్యంకింద తన ఆస్తి పెరుగుతున్నట్లు లాబాను గుర్తించాడు.PPTel 182.3

    “నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. అయితే అది బహుగా వృద్ధి పొందెను” అన్నాడు యాకోబు లాబానుతో, కాలం గతించే కొద్ది “యాకోబు అత్యధికముగా అభివృద్ధి విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు” కలవాడైనప్పుడు లాబాను ఈర్ష్యపడ్డాడు. లాబాను కొడుకులు కూడా తండ్రి మాదిరిగానే అసూయపడ్డారు. ద్వేషంతో వారన్న మాటలు యాకోబు చెవిని పడ్డాయి. “మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతడి యెడల ఉండలేదు.PPTel 182.4

    ఏశావును గూర్చిన భయం ఇంకా పోలేదు. లేకుంటే యాకోబు తన జిత్తుల మారి మామను ఎప్పుడో విడిచి పెట్టేవాడే! ఇప్పుడు లాబాను కొడుకులు తన ఆస్తిని చూసి అది తమ తండ్రిదని భావిస్తూ దాని కైవసం చేసుకోటానికి దౌర్జన్యానికి పూనుకొనే ప్రమాదముందని యాకోబు భావించాడు. ముందు గొయ్యి వెనుక నుయ్యి పరిస్థితిలో వున్న యాకోబు ఆందోళన చెందాడు. ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నాడు. అయితే బేతేలు వాగ్దానాన్ని మనసులో ఉంచుకొని తన సమస్యను దేవుని ముందు పెట్టి మారగా చూపించమని ఆయనను వేడుకొన్నాడు. ఒక కలలో తన ప్రార్థనకు జవాబు వచ్చింది. “నీ పితరుల దేశమునకు నీ బందువులయొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడై యుందును”.PPTel 183.1

    లాబాను లేకపోవటం యాకోబు వెళ్లిపోవటానికి దోహదపడింది. మందల్ని త్వరత్వరగా పోగుచేసి ముందుకి తోలి భార్యలు, బిడ్డలు, సేవకులతో యాకోబు యూఫ్రటీను దాటి కనాను సరిహద్దులో ఉన్న గిలాదు దిశగా ప్రయాణం చేశాడు. మూడు రోజుల తర్వాత యాకోబు వెళ్లిపోయిన సంగతి లాబానుకి తెలిసింది. పారిపోతున్న యాకోబు బృందాన్ని పట్టుకోటానికి లాబాను వారి వెనుక బయల్దేది వారి ప్రయాణంలో ఏడోరోజున వారిని పట్టుకొన్నాడు. లాబాను మండిపడూ వారిని బలత్కారంగా వెనక్కు తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు. తన పరివారం యాకోబు పరివారం కన్నా పెద్దది కనుక వారిని బలవంతంగా వెనక్కు మళ్లించవచ్చుని లాబాను భావన. పారిపోతున్న యాకోబు బృందం గొప్ప ప్రమాదంలో ఉంది.PPTel 183.2

    లాబాను తన దురుద్దేశాన్ని అమలు పర్చలేవపోవటానికి కారణం తన సేవకుడు యాకోబును కాపాడటానికి దేవుడు కలుగజేసుకోవటమే. “మీకు హాని చేయటకు నా చేతనవును; అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు - నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము. జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను” అన్నాడు లాబాను. అంటే యాకోబును లాబాను బలవంతంగా వెనక్కు తీసు వెళ్లకూడదని లేక ఆకర్షణీయమైన రాయితీతో వెనక్కు వెళ్లటానికి ఒప్పించి తీసుకువెళ్లకూడదని దేవుడు చెప్పాడు.PPTel 183.3

    లాబాను తన కుమార్తెల కట్నం డబ్బును వారికివ్వకుండా అట్టి పెట్టుకున్నాడు. యాకోబుతో ఎప్పుడూ కుటిలంగాను కఠినంగాను వ్యవహించాడు. ఇప్పుడు తన స్వాభావిక వేషదారణతో తన కూతుళ్లకు, వారి బిడ్డలకు వీడ్కోలు చెప్పటానికి, వీడ్కోలు విందు చేయటానికి తండ్రి అయిన తనకు అవకాశం ఇవ్వకుండా రహస్యంగా వెళ్లిపోతున్నాడంటూ నిందిస్తున్నాడు.PPTel 183.4

    దానికి జావాబుగా యాకోబు లాబాను స్వార్థపూరిత విధానాన్ని వివరించి తాను నిజాయితీగా నమ్మకంగా చేసిన కొలువుకు తానే సాక్షి అని తెలిపాడు. “నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు. ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై యుండని యెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెను” అని యాకోబు అన్నాడు.PPTel 184.1

    యాకోబు వెలికి తెచ్చిన వాస్తవాల్ని లాబాను కాదనలేకపోయాడు. ఇప్పుడు శాంతి ఒప్పందం ఖరారు చేసుకొందామని లాబాను ప్రతిపాదించాడు. దానికి యాకోబు సమ్మతించటంతో ఆ ఒప్పందానికి గుర్తుగా అక్కడ ఒక రాళ్ల కుప్ప నిర్మించారు. ఈ కుప్పకు లాబాను ‘మిస్ప’ అన్న పేరు పెట్టి, “నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా నుండునని” చెప్పాడు.PPTel 184.2

    మరియు లాబాను “నాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్పను చూడుము. హాని చేయవలెనని నేను ఈ కుప్పదాటి నీయొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈస్తంభమను దాని నా యొద్దకకు రాకును ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభము సాక్షి, అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను.” ఆ సంధిని ధ్రువపర్చుకోటానికి ఇరుపక్షాలవారు విందు చేసుకున్నారు. ఆ రాత్రి స్నేహపూర్వక సంభాషణలు జరుపుకున్నారు. తెల్లవారగానే లాబాను అతడి పరివారం వెళ్లిపోయారు. ఈ విడిపోవటమే చివరిది. దీనితో అబ్రాహాము పిల్లలకు పద్దనరాములోని నివాసులకు మధ్యగల బాంధవ్యం అంతమొందింది.PPTel 184.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents