Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    8—జలప్రళయం అనంతరం

    జలప్రళయం నీళ్ళు మిక్కిలి ఎత్తయిన పర్వతాల్ని ముంచి పైగా పది హేను మూరల ఎత్తున నిలిచాయి. బలంగా వీస్తున్న గాలులు, ఉవ్వెత్తున లేచి పడుతున్న తరంగాలు ఓడను అయిదు మాసాలు అటు ఇటూ కొట్టడంతో లోపల ఉన్న కుటుంబానికి తాము మరణిస్తామేమో అన్న భయం పుట్టింది. అది బాధాకరమైన అగ్ని పరీక్ష, నోవహు విశ్వాసం ఏమాత్రం సడలలేదు. ఎందుచేతనంటే దేవుని హస్తం తనకు బాసటగా ఉంటుందన్న వాగ్దానం అతనికి ఉన్నది.PPTel 92.1

    నీళ్లు తగ్గుముఖం పట్టినప్పుడు దైవశక్తివల్ల చెక్కు చెదరకుండా భద్రంగా నిలిచిన పర్వత సముదాయం మధ్యకు కొట్టుకుపోయి ఓడ నిలిచింది. ఈ పర్వతాలు ఒకదాని నుంచి ఒకటి కొంచెం ఎడంగా నిలిచి ఉన్నాయి. ఈ ప్రశాంత స్థలంలోకి ఓడ వెళ్లి నిలిచింది. ఆ అనంత సముద్రపు గాలులు ఇక ఓడను అటూ ఇటూ కొట్టలేదు. లోపల ఉన్న ప్రయాణికులకు ఇది గొప్ప ఊరట కలిగించింది.PPTel 92.2

    నీళ్లు తగ్గిపోటానికి నోవహు అతని కుటుంబం ఆతురుతగా కని పెడుతున్నారు. మళ్లీ నేల మీద మసలాలని ఎంతో ఆశించారు. పర్వత శిఖరాలు కనిపించిన నలభై దినాల తర్వాత భూమి ఆరిందోలేదో తెలుసుకోటానికి త్వరగా పసికట్టగల పిట్ట అయిన కాకిని నోవహు బైటికి విడిచి పెట్టాడు. అంతట అది ఓడమీద నుంచి బైటికి, బైటి నుంచి ఓడమీదకి ఎగుర్తూ ఉన్నది. ఏడు రో జుల తర్వాత ఒక పావురాన్ని విడిచి పెట్టాడు. కాలు మోపటానికి ఎక్కడా స్థలం లేకపోటంతో అది తిరిగి ఓడలోకి వచ్చింది. ఇంకా ఏడు రోజులు ఆగి నోవహు ఆ పావురాన్ని మళ్లీ విడిచి పెట్టాడు. సాయంత్రం ఒక ఒలీవ ఆకు నోటితో కరచిపట్టుకొని అది ఓడలోకి తిరిగి వచ్చినప్పుడు ఆ కుటుంబానికి గొప్ప సంబరమయ్యింది. తర్వాత “నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను” అయినా అతడింకా ఓడలోనే వేచి ఉన్నాడు. దేవుని ఆదేశం చొప్పున ఓడలో ప్రవేశించాడు. ఓడ విడిచి బైటికి వెళ్లటానికి ఆయన ఆదేశం కోసం కని పెడున్నాడు.PPTel 92.3

    చివరికి పరలోకం నుంచి ఒక దూత దిగివచ్చి ఓడ తలుపు తెరిచి నేలమీదికి వెళ్లమంటూ నోవహుని అతడి కుటుంబికుల్ని ఆదేశించాడు. తమతో పాటు ఓడలో ఉన్న ప్రతి ప్రాణినీ బైటకు తీసుకు వెళ్లమని ఆదేశించాడు. తమకు విడుదల లభించిందన్న ఆనందోత్సాహాల్లో ఎవరి కృప ఎవరి కాపుదల వలన తాము క్షేమంగా భద్రంగా ఉన్నారో ఆ ప్రభువును నోవహు మరిచిపోలేదు. ఓడలోనుంచి బైటికి వెళ్లిన తర్వాత బలిపీఠం కట్టి పవిత్రమైన ప్రతి జంతుజాతినుంచి జంతువుల్ని,పిట్ట జాతినుంచి పిట్టల్నీ బలి అర్పించి తమను రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొని భవిష్యత్తులో జరుగనున్న క్రీస్తు బలిదానం పై తన విశ్వాసాన్ని ప్రకటించుకొన్నాడు. ఈ అర్పణ దేవునికి ఆనందం కలిగించింది. అంతట దేవుడు నోవహును అతడి కుటుంబాన్నేగాక భూమిపై నివసించనున్న జనులందరినీ ఆశీర్వదించాడు. “అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి - ఇక మీదట నరులను బట్టి భూమిని శపింపను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది... భూమి నిలిచియున్నంత వరకు వేదకాలమును, కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతాకాలములను రాత్రింబగళ్లును ఉండక మానవుని తన హృదయములో అనుకొనెను”, తర్వాత తరాలన్నీ నేర్చుకోవలసిన పాఠం ఇక్కడ ఒకటున్నది.నోవహు మనుషులు లేని భూమిమీద అడుగు పెట్టాడు. తనకోసం ఒక నివాసం ఏర్పర్చుకోకముందు దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. తన పశువుల మంద చిన్నది. దాన్ని కాపాడటానికి ఎంతో వ్యయ ప్రయాసలు అవసరమయ్యాయి. అయినా, సమస్తం దేవుని సొత్తు అన్న గుర్తింపును సూచిస్తూ వాటిలో కొన్నిటిని ఆయనకు అర్పించాడు. అలాగే మొదటగా మనం మన స్వేచ్ఛార్పణల్ని ప్రభువుకి అర్పించాలి. మన పట్ల ప్రభువు కనపర్చుతున్న కృపకు దయకు భక్తి విశ్వాసాల ద్వారా ఆయన సేవకొనసాగింపు నిమిత్తం త్యాగపూరితంగా ఇవ్వటం ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.PPTel 92.4

    మబ్బులు పట్టి వర్షాలు వచ్చినప్పుడల్లా మళ్లీ ప్రళయం సంభవిస్తుందేమోనన్న భయం నిత్యమూ వారిని వేధించకుండేందుకు నోవహు కుటుంబానికి దేవుడు ఈ వాగ్దానం చేశాడు. - “నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును... భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదు... నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచితిని. అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. భూమి పైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు... నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లురావు”.PPTel 93.1

    మానవులతో తన నిబంధనకు గుర్తుగా మేఘాల్లో అందమైన ధనస్సును పెట్టటంలో అత్యున్నతుడైన దేవుడు తన్ను తాను తగ్గించుకొని మనపట్ల తన ప్రేమను వ్యక్తం చేయటం చూస్తున్నాం. అదెంత గొప్ప సంగతి! ధనస్సును చూచినప్పుడు మనతో తన నిబంధనను గుర్తుచేసుకొంటానని ప్రభువు ప్రకటించాడు. దాన్ని ఆయన ఎప్పుడైనా మర్చిపోతాడని కాదు. ఆయన మనతో మన పంథాలో మనకర్థమయ్యేటట్లు మాట్లాడున్నాడు. తర్వాతి తరాల్లో పిల్లలు ఆకాశంలోని ఆ అందమైన ధనస్సును చూసి అది ఏంటని అడిగినప్పుడు వారి తల్లిదండ్రులు జలప్రళయం ఉదంతాన్ని వారికి చెప్పి నీటితో ఇంకొకసారి భూమిని నాశనం చేయనని వాగ్దానంచేసి దానికి గుర్తుగా ఆ ధనస్సును వంచి దాన్ని దేవుడు మేఘాల్లో పెట్టాడని వారికి చెప్పాలన్నది దేవుని సంకల్పం. మానవుడి పట్ల దేవుని ప్రేమకు ధనస్సు ఇలా తరతరాలు సాక్షిగా నిలిచి దేవుని పై మానవుడి విశ్వాసాన్ని మరింత ధృఢతరం చేస్తుంది. పరలోకంలో దైవ సింహాసనాన్ని క్రీస్తు శిరస్సునూ, దనస్సువంటి ప్రకాశత ఆవరించి ఉంటుంది. ప్రవక్త దాన్ని ఇలా వర్ణిస్తున్నాడు, “వర్షాకాలమున కనబడు ఇంద్ర ధనస్సు యొక్క తేజస్సు వలె దాని (సింహాసనం) చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము” యె హెజ్కేలు 1:28. ప్రకటన రచయిత ఇలా అంటున్నాడు, “అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడియుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై యుండెను...మరకతమువలె ప్రకాశించు ఇంద్ర ధనస్సు సింహాసనమును ఆవరించి యుండెను” ప్రకటన 4:2, 3. మానవుడు తన దుర్మార్గత మూలంగా దేవుని న్యాయ విచారణకు గురి అయినప్పుడు, పశ్చాత్తాపం పొందే పాపిపట్ల దేవుని కృపకు సంకేతంగా మేఘాల్లోను, సింహాసనం చుట్టూను స్వయాన తన శిరస్సు చుట్టూను ఉన్న ధనస్సు చూపిస్తుంది రక్షకుడు తండ్రి ముందు అతడి తరపున విజ్ఞాపన సల్పుతాడు.PPTel 94.1

    జలప్రళయం గురించి ప్రభువు నోవహుకిచ్చిన వాగ్దానంతో తన ప్రశస్త కృపావాగ్దానాన్ని ఆయన జోడించాడు. “నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు, చేయుదును. జలములు భూమిమీదికి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండవనియు నిన్ను గద్దింపవనియు నేను ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు” యెషయా 54:9, 10.PPTel 94.2

    ఓడలోనుంచి తనతో పాటు బయటికి వచ్చిన క్రూర మృగాల్ని చూసినప్పుడు అవి తన కుటుంబంలోని ఎనిమిదిమందినీ నాశనం చేస్తాయేమోనని నోవహు భయపడ్డాడు. కాని ప్రభువు తన దూతను పంపి నోవహుకు ఈ ధైర్యకరమైన వర్తమానం అందించాడు, “మీ భయము మీ బెదురు అడవి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును. అవి మీ చేతికి అప్పగించబడియున్నవి. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను” దీనికి ముందు దేవుడు మానవులకు ఆహారంగా జంతువుల్ని ఇవ్వలేదు. మానవులు భూమి పంటను మాత్రమే తిని బతకాలన్నది దేవుని ఉద్దేశం. కాగా ఇప్పుడు పచ్చని మొక్కలు నాశనమవ్వటంతో ఓడలో సంరక్షించబడ్డ పవిత్ర జంతువుల్ని తినటానికి వారిని అనుమతించాడు.PPTel 95.1

    జలప్రళయం వల్ల భూమి ఉపరితలం పూర్తిగా మారిపోయింది. పాపపర్యవసానంగా భయంకరమైన మూడో శాపం భూమిమీద పడింది. నీరు తగ్గటం ప్రారంభమైనప్పుడు కొండలు పర్వతాల చుట్టూ కాలుష్యంతో నిండిన సముద్రం ఏర్పడింది. ఎక్కడ చూసినా మనుషులు జంతువుల శవాలే కనిపించాయి. అవి కుళ్లి వాతావరణాన్ని కలుషితం చేయటం దేవునికి సమ్మతం కాదు. అందుకు భూమిని బ్రహ్మాండమైన స్మశానవాటికగా మార్చాడు. నీళ్లు ఎండిపోటానికి వీచిన బలమైన గాలి గొప్పశక్తితో పర్వత శిఖరాల్ని రాతి బండల్ని, వృక్షాల్ని లేపుకువచ్చి శవాల్ని పూడ్చి పెట్టింది. అలాగే జలప్రళయ పూర్వ ప్రపంచాన్ని భాగ్యవంతం చేసిన, ప్రజలు విగ్రహాలు చేసుకొన్న వెండి, బంగారం, విలువైన కలప, వజ్రాలు, వైఢూర్యాలపై మట్టి రాతి బండలు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న కొండలు పడి వాటిని కప్పి పెట్టి అన్వేషకుల దృష్టికి దూరంగా ఉంచాయి. మనుషుల్ని ఎంత ధనికుల్ని చేసి వృద్ధిపరిస్తే వారి మార్గాలు అంత దుష్టంగాను పాపపూరితంగాను ఉంటున్నట్లు దేవుడు చూశాడు. వారిని భాగ్యవంతులు చేసిన వెండి, బంగారాన్ని సమృద్ధిగా ఇచ్చిన దేవుని ఆరాధించకుండా ఆయన ఈవుల్ని ఆరాధించి ఆయనను అగౌరవపర్చారు.PPTel 95.2

    భూమి అంతా అస్తవ్యస్తంగా నిర్మానుష్యంగా ఉన్నది. ఒకప్పుడు తీర్చిదిద్దినట్లు చూడముచ్చటగా ఉన్న పర్వతాలు పగిలిపోయి వంకర టింకరగా ఉన్నాయి. అనేకచోట్ల కొండలు పర్వతాలు మాయమయ్యాయి. అవి ఎక్కడుండేవో అక్కడ వాటి ఆనవాళ్ల కూడా లేవు. చదును భూముల్లో ఇప్పుడు పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. ఈ మార్పులు కొన్ని చోట్ల మారెక్కువగా కనిపించాయి. క్రితంలో బంగారం వెండి వలకు నెలవైన స్థలాలు ఎక్కువ శాపగ్రస్తమైనట్లు కనిపించింది. జనులు నివసించని స్థలాల్లోను లేదా తక్కువ పాపమున్న స్థలాల్లోను శాపం తక్కువగా ఉన్నది.PPTel 95.3

    ఈ సమయంలో పెద్ద పెద్ద అడవులు సమాధి అయిపోయాయి. అప్పటినుంచి ఇవి బొగ్గుగా పరివర్తన చెందుతూ వచ్చాయి. ఇప్పుడు మనకున్న విస్తారమైన బొగ్గు, చమురు నిక్షేపాలు ఇలా ఏర్పడ్డనే, భూగర్భంలో ఉన్న బొగ్గు చమురు అక్కడ కాలూ ఉంటాయి. ఈ విధంగా రాళ్లు, సున్నపరాళ్ళు కాలటం, ఇనుము కరగటం జరుగుతుంది. సున్నం పై నీటి చర్య పర్యవసానంగా పుట్టిన వేడి ఉద్దృతమై భూకంపాలు కలుగుతాయి. అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. భుగర్భంలోని అగ్ని నీరు రాళ్ళని, ఖనిజాల్ని తాకినప్పుడు భూగర్భంలో పేలుడులు సంభవిస్తాయి. అవి ఎక్కువ శబ్దంలోని ఉరుముల్లా వినిపిస్తాయి. వేడిగాలివస్తుంది. శ్వాసక్రియ కష్టమవుతుంది. అనంతరం అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. భూగర్భంలో వేడెక్కిన పదార్థాలు బయటికి రావటానికి సరైన మార్గం లేకపోవటంతో భూమి కంపిస్తుంది, నేల సముద్రపు కెరటంలా పైకి లేస్తుంది. బ్రహ్మాండమైన పగుళ్ళు ఏర్పడి కొన్నిసార్లు పట్టణాలు, గ్రామాలు, మండుతున్న పర్వతాలు భూమిలో కూరుకుపోతాయి. లోకం త్వరలో అంతం కానున్నదని సూచిస్తూ క్రీస్తు రెండో రాకడ లోకాంతానికి ముందు ఈ ఘటనలు మరింత తరచుగా, మరింత భయంకరంగా సంభవిస్తాయి.PPTel 96.1

    భూగర్భంలో యెహోవా ఆయుధాగారం. ప్రపంచాన్ని నాశనం చేసేందుకు ఆయనకు ఆయుధాలు ఇక్కడనుంచే వచ్చాయి. లోకాన్ని జనరహితం చేయాలన్న తన ఉద్దేశం నెరవేర్పుకు భూమిలో నుంచి నీళ్ళు పైకి ఆకాశంలో ఉన్న నీటితో కలిశాయి. జలప్రళయం అనంతరం దుర్మార్గంతో నిండిన పట్టణాల్ని నాశనం చేయటంలో అగ్ని నీరు దేవుని సాధనాలయ్యాయి. తన ధర్మశాస్త్రాన్ని చులకనగా చూస్తూ తన అధికారాన్నికాలరాసే ప్రజలు తనముందర వణుకుతూ తన అధికారాన్ని అంగీకరించేందుకోసం దేవుడు ఈ తీర్పుల్ని పంపిస్తున్నాడు. పర్వతాలు మంటలు కక్కటం, కరిగిన రాయి ముడిలోహం కుండపోతగా పడటం, ప్రజలతో కిటకిటలాడుతున్న నగరాలు ధ్వంసం కావటం ఎక్కడ చూసినా శిధిలాలు మరణమే దర్శనమివ్వటం మనుషులు చూసినప్పుడు గుండె చెదరని వారు, భయకంపితులు కానివారు ఉండరు. నాస్తికులు దేవదూషకులు మితిలేని దైవశక్తిని గుర్తించక తప్పదు.PPTel 96.2

    ఈ సన్నివేశాల్ని సూచిస్తూ పూర్వ ప్రవక్తలు ఇలా అంటున్నారు, “గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలున కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగి వచ్చెదవుగాక. జరుగునని మేమనుకొనిన భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనములు నీ సన్నిధిని కలవరపడకుందురుగాక. నీవు దిగివచ్చెదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక” యెషయా 64:1-3. “యెహోవా దీర్ఘ శాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను నున్నాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన ఎండిపోజేయును” నహూము 1:3, 4.PPTel 96.3

    ఇంతవరకూ లోకం చూసి ఎరుగని సంఘటనలు క్రీస్తు రెండోరాకడ సమయంలో చోటుచేసుకోనున్నాయి. “ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును లోకమును అందలి నివాసులందరును వణుకుదురు. ఆయన ఉగ్రత సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని యెదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును” నహూము 1:5, 6. “యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము” కీర్తనలు 144:5, 6.PPTel 97.1

    “పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను” అ.కా. 2:19. “అప్పుడు మెరుపులను ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను”. “ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. అయిదేసి మణుగుల బరువు గల పెద్ద వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి” ప్రకటన 16:18, 20, 21.PPTel 97.2

    ఆకాశంలో పుట్టే మెరుపులు భూమిలోని అగ్నితో కలిసినప్పుడు పర్వతాలు అగ్నిగుండాల్లా కాల్తాయి. లావా ప్రవాహం తోటల్ని పొలాల్ని గ్రామాల్ని పట్టణాల్ని తుడిచివేస్తుంది. పెద్ద పెద్ద లావా ముద్దలు నదుల్లో పడటంతో నీరు సలసల కాగుతుంది. పేలుళ్ల ప్రచండ శక్తి బండల్ని విసిరికొట్టి వాటి శకలాల్ని భూమి పై చెల్లాచెదురుచేస్తుంది. నదులు ఎండిపోతాయి. భూమి కంపిస్తుంది. ప్రతీచోట భూకంపాలు పేలుళ్లు సంభవిస్తాయి.PPTel 97.3

    లోకంలోని దుర్మార్గుల్ని దేవుడు ఈ విధంగా నాశనం చేస్తాడు. కాగా నోవహును ఓడలో భద్రంగా కాపాడిన రీతిగా నీతిమంతులకు ఈ ఉపద్రవాలన్నిటిలోను దేవుడు ఆశ్రయ దుర్గంగా నిలుస్తాడు. ఆయన రెక్కలకింద ఉండి వారు ఆయనను నమ్ముకొంటారు. కీర్తన రచయిత ఇలా అంటున్నాడు, “యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసికొనియున్నావు, నీకు అపాయమేమియురాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు” కీర్తనలు 91:9, 10. “ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్నుదాచును. తన గుడారపు మాటున నన్ను దాచును” కీర్తనలు 27:5. దేవుని వాగ్దానం ఇది, “అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. అతడు నానామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను” కీర్తనలు 91:14.PPTel 97.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents